ప్రత్యర్థి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్రెడ్డి.. ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ.. ఎన్నికల వేళ మొదటి దఫాలోనే టికెట్ కేటాయింపు.. ఆయనకు, ఆ పార్టీకి జగిత్యాల గట్టిపట్టున్న నియోజకవర్గం.. ముందు నుంచే ప్రచారం.. అయినా జగిత్యాల గడ్డపై డాక్టర్ సంజయ్ కుమార్ వరుసగా రెండోసారి జయకేతనం ఎగురవేశారు. ఆది నుంచీ ప్రజల మధ్య ఉన్న ఆయన, జీవన్రెడ్డిపై రెండు సార్లు విజయం సాధించారు. హస్తం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా అనుకూల పవనాలు వీచినా.. అలవోకగా ఓడించి తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. దశాబ్దం క్రితం వరకు కాంగ్రెస్ కంచుకోటగా పేరుగాంచిన నియోజకవర్గాన్ని సంజయ్ తన కఠోర శ్రమ, పదునైన వ్యూహాలతో బీఆర్ఎస్ అభేద్యదుర్గంగా మార్చివేశారు.
– జగిత్యాల, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ)
జగిత్యాల, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతూ ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ భుజం తట్టే తీరు. సంతోషంలో, ఆనందంలోనూ పాల్గొనే నైజం. పదేండ్ల కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం. స్వయంగా చేసిన ఆయన చేసిన స్వచ్ఛంద సేవలే డాక్టర్ మాకునూరి సంజయ్కుమార్ను రెండోసారి జగిత్యాల ఎమ్మెల్యేగా గెలిపించాయి. దశాబ్దం క్రితం వరకు కాంగ్రెస్ కంచుకోటగా పేరుగాంచిన జగిత్యాల నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ అభేద్యదుర్గంగా మార్చివేసి, వరుసగా రెండోసారి సైతం జయకేతనాన్ని ఎగురవేశారు. మూడోసారి జగిత్యాల ఎమ్మెల్యేగా అభ్యర్థిగా బరిలోకి దిగి, తన సమీప ప్రత్యర్థి, సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డిని 15వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించి, వరుసగా రెండో విజయాన్ని కైవసం చేసుకున్నారు.
డాక్టర్ సంజయ్ కుమార్ నేత్రవైద్యుడిగా నిరంతరం ప్రజలతోనే ఉన్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడినా.. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రజలకు అందుబాటులో ఉన్నారు. రౌండ్ది క్లాక్ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ‘నేనున్నా’ అంటూ భరోసానిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రతి నిమిషం జాగురుకతతో వ్యవహరించారు. ప్రతి అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరింపజేశారు.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డిపై 60వేలకు పై చిలుకు మెజార్టీతో విజయం సాధించారు. అప్పటి నుంచి నియోజకవర్గ ప్రజలతో మరింతగా మమేకమయ్యారు. ప్రతి మండలంపై దృష్టిని సారించారు. అన్ని వర్గాలనూ కలుపుకొని పోయారు. సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టారు. రెండేళ్ల క్రితం భారీ వర్షాలు కురిసిన సమయంలో ఓ విలేకరి వాగులో కొట్టుకుపోగా, మృతదేహం దొరికే వరకూ అక్కడే ఉన్నారు. ఇలా ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకున్నారు.
ఎమ్మెల్యే సంజయ్కుమార్ రెండోసారి గెలుపులో అభివృద్ధి, సంక్షేమ పథకాలు సైతం కలిసివచ్చాయి. నియోజకవర్గం రూపురేఖలు మార్చివేసిన అభివృద్ధి, ఆయన విజయాన్ని డిసైడ్ చేసింది. జగిత్యాలను జిల్లా కేంద్రంగా ప్రకటించడం, ధరూర్ క్యాంపులో దాదాపు 150 కోట్లు వెచ్చించి, కలెక్టరేట్, పోలీసు కార్యాలయం నిర్మించడం, జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయడం, దానికి అనుబంధంగా 650 పడకల దవాఖాన ఏర్పాటు చేయడం, 511 కోట్లతో దవాఖాన, కళాశాల నిర్మాణం ప్రారంభించడం గెలుపునకు దోహదపడ్డాయి.
వీటితోపాటు హైదరాబాద్ తర్వాత జగిత్యాలలోనే 4520 డబుల్ బెడ్రూం ఇండ్లను 300 కోట్లతో పూర్తి పంపిణీ చేయడం 50 కోట్లతో జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయడం, మండలాల్లో అంతర్గత రోడ్లు, వంతెనలు నిర్మిచండం, బీర్పూర్ మండలంలోని రోళ్లవాగును 135కోట్లతో ఆధునీకరించి సాగునీరు ఇవ్వడం కలిసివచ్చాయి. ఇంకా సంక్షేమ పథకాలు సైతం గొప్పగా పనిచేశాయి.
నియోజకవర్గ పరిధిలో 62వేల మందికి పెన్షన్లు నెలనెలా అందుతుండగా, తిన్నరేవును మరువద్దనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమైంది. వీటికి తోడు నియోజకవర్గవ్యాప్తంగా పలు మైనార్టీ, జనరల్ రెసిడెన్షియల్ కాలేజీలు, పాఠశాలలు ఏర్పాటయ్యాయి. ‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ – మన బడి’ ద్వారా 64 ప్రభుత్వ పాఠశాలలు సర్వాంగ సుందరంగా తయారుకావడం సంజయ్కుమార్ గెలుపులో కీలక పాత్ర పోషించాయి. ఇక పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనులు సైతం దోహదపడ్డాయి.
సంజయ్కుమార్ మూడు దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలతో కలిసిపోయారు. ఆది నుంచీ స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేశారు. ముఖ్యంగా నేత్రవైద్యుడిగా సేవలందిస్తున్నారు. నియోజకవర్గం, జిల్లా పరిధిని దాటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. తాను చేయడంతో పాటు ఇతర నేత్రవైద్యులు, స్థానిక ఉన్న వైద్యులతో కలిసి శిబిరాలను నిర్వహించి, ఉచిత వైద్యసేవలు అందించారు. జగిత్యాల డివిజన్లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నేత్ర వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి, పిల్లలను పరీక్షించి, ఉచితంగా మందులు, అద్దాలు అందజేస్తూ వచ్చారు. ఇంకా కంటి ఆపరేషన్లను సైతం ఉచితంగా చేపట్టారు.
ఇప్పటి వరకు సంజయ్ 70వేల శస్త్రచికిత్సలు చేయగా, అందులో వేలాది శస్త్ర చికిత్సలు ఉచితంగా చేశారు. రాజకీయ రంగంలోకి వచ్చి పదేండ్లు అవుతున్నా.. వారానికో రోజు ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు చేస్తూనే ఉన్నారు. ఏటా వెయ్యి శస్త్రచికిత్సలు ఉచితంగా చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ‘ఆపీ’ ద్వారా ఆయన వైద్యసేవలు అందించారు. ఇలా స్వచ్ఛంద సేవతో ప్రజలకు చేరువయ్యారు.
జగిత్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి గట్టిపట్టున్న నియోజకవర్గం. 1983 నుంచి ఇప్పటి వరకు జగిత్యాలలో కాంగ్రెస్ తరపున జీవన్రెడ్డినే పోటీ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికీ ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా విజయం సాధించిన విషయం తెలిసిందే. స్వరాష్ట్ర సాధన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ సంజయ్కుమార్ పోటీ పడ్డారు. ఆ ఎన్నికలో జీవన్రెడ్డి విజయం సాధించారు. సంజయ్ ఓడిపోయినప్పటికీ దిగులు పడకుండా నియోజకవర్గ ఇన్చార్జిగా, ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారు.
దీంతో 2018లో జరిగిన ఎన్నికల్లో 60వేలకు పై చిలుకు మెజార్టీతో సంజయ్కుమార్ విజయం సాధించారు. అయితే ఈ సారి నియోజకవర్గంలో భిన్నమైన పరిస్థితులు ఆవిష్కృతమయ్యాయి. ఎమ్మెల్యేగా ఓడిపోయిన జీవన్రెడ్డి 2019లో శాసన మండలి సభ్యత్వం కోసం కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన నియోజకవర్గంలో పోటీ చేసి ఘన విజయం సాధించారు. 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న పట్టభధ్రుల నియోజకవర్గం నుంచి జీవన్రెడ్డి గెలువడంతో ఆయనకు పార్టీలోనూ ప్రాధాన్యత పెరిగిపోయింది.
2023 ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అందరి కంటే ముందుగానే జీవన్రెడ్డి పోటీకి సన్నద్ధమయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ టికెట్ల కోసం దరఖాస్తు స్వీకరించగా, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డికి చెందిన కొడంగల్ నియోజకవర్గం, జగిత్యాల నియోజకవర్గంలో మాత్రమే రెండు దరఖాస్తులు ఉండడం గమనార్హం. మొదటి దఫాలోనే జగిత్యాల కాంగ్రెస్ టికెట్ను జీవన్రెడ్డికి కేటాయించారు. జీవన్రెడ్డి సైతం ఎన్నికల కోసం ముందు నుంచే ప్రచారాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్నీ చుట్టివచ్చారు.
నియోజకవర్గంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బహిరంగ సభ ఏర్పాటు చేయించారు. ఎన్నికల ప్రచార కీలక తరుణంలో ఏఐసీసీసీ కీలక నేత రాహుల్గాంధీతో సైతం జగిత్యాలలో సభను నిర్వహింపజేశారు. ఇక ఎన్నికల్లో గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నించారు. బాండ్ పేపర్లు రాసి దేవుడి వద్ద ఉంచారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ప్రచారం చేశారు. ఇన్ని చేసినా బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్కుమార్ చేతిలో ఓడిపోయారు.
నన్ను వరుసగా రెండోసారి గెలిపించిన జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంట. నాపై వారు చూసిన ఆదరణను జీవితంలో మరిచిపోను. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్కు కొంత భిన్నమైన ఫలితాలు వచ్చినప్పటికీ ఇక్కడి ప్రజలు పార్టీపైన, తనపై నమ్మకంతో గెలిపించడం నా అదృష్టం. పదేండ్లుగా ఇక్కడి ప్రజలతో మమేకమై ఉంటున్న. నిరంతరం అందుబాటులో ఉండి, వారి మంచి చెడులలో భాగస్వామ్యం కావడం వల్లే నాకు ఈ విజయం దక్కింది. పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రభుత్వాలు ఏవైనా, జగిత్యాల ప్రజల సంక్షేమం, అభివృద్ధే నాకు ముఖ్యం. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు శ్రమిస్త. అవసరమైతే పోరాడుత.
– డాక్టర్ మాకునూరి సంజయ్కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే