రాయికల్, డిసెంబర్ 7: ఎన్నికల వేళ ఊదరగొట్టిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ సర్కారు పక్కాగా అమలు చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ డిమాండ్ చేశారు. గురువారం రాయికల్లో విలేకరులతో మాట్లాడారు. గ్యారెంటీల విషయంలో జీవన్రెడ్డి దేవుడి సమక్షంలో బాండ్ పేపర్ రాసిచ్చారని గుర్తుచేశారు. ప్రశ్నించే గొంతుకని చెప్పుకొనే జీవన్రెడ్డి గ్యారెంటీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. ఉమ్మడి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం తహసీల్, నీటి పన్నును వసూలు చేయగా, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు వాటిని రద్దు చేసి రైతులకు రైతు బంధు, రైతు బీమా సౌకర్యం కల్పించిందని గుర్తు చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కౌలు రైతులకు రూ. 12 వేలు, రైతుబంధు ద్వారా రూ. 15వేలు ఇస్తామన్న హామీని అమలు చేసి చూపాలన్నారు. ధాన్యంపై రైతులకు ప్రతి క్వింటాలకు రూ. 500 బోనస్ను వెంటనే చెల్లించాలన్నారు. అదేవిధంగా ప్రతి పంటకు కనీస మద్ద్దతు ధరతో పాటు క్వింటాల్కు రూ. 500 బోనస్ చెల్లించాలన్నారు.
ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం పదిహేను క్వింటాల్ల వరకు మాత్రమే బోనస్ ఇచ్చి రైతులను మోసం చేసిన చత్తీస్ఘడ్ సర్కారుకు తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టారని, తెలంగాణ రాష్ట్రంలో ఏ మాత్రం తేడా వచ్చినా రైతులు తగిన గుణపాఠం చెప్పేందుకు వెనుకాడరని హెచ్చరించారు. కాంగ్రెస్ పేదల ఇండ్ల నిర్మాణానికి రూ. 5లక్షలు, గృహజ్యోతి ద్వారా ప్రతీ కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా నిరుపేదలకు రూ. 10లక్షల కార్పొరేట్ వైద్యాన్ని పక్కాగా అందించాలన్నారు.
జగిత్యాల నియోజకవర్గంలో 25వేల మంది బీడీ కార్మికులకు ప్రతీ నెలా రూ. 2వేల జీవన భృతి అందించామని, ఒంటరి మహిళలకు సైతం ప్రతినెలా రూ. 2వేల పెన్షన్ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా అర్హులైన ప్రతీ మహిలకు రూ. 2500, రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్, పెన్షన్లను రూ. 4వేలకు పెంచుతామన్న హామీని వచ్చే నెల నుంచే ఆచరణలో పెట్టాలన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పిస్తామన్న హామీకి బస్సుల సంఖ్యను పెంచి రూట్లు లేని మార్గాల్లో సైతం బస్సును నడిపించి హామీని పూర్తి చేయాలన్నారు.
యువ వికాసం కింద విద్యార్థులకు రూ. 5లక్షల విద్యాభరోసా కార్డు ఇస్తామన్నారని, యువ వికాస్ విషయంలో స్పష్టత ఇవ్వాలన్నారు. అదేవిధంగా ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ను ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ డిక్లరేషన్లను సైతం అమలు చేయాలన్నారు. రెండో సారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన తనను ఆదరించి ఓట్లు వేసి గెలిపించిన పట్టణ, మండల ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధలుకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్రెడ్డి, మంత్రులకు ఎమ్మెల్యే డా. సంజయ్కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు, వైస్ చైర్పర్సన్ రమాదేవి, ఏఎంసీ చైర్మెన్ రాణి, సింగిల్విండో చైర్మెన్ మల్లారెడ్డి పాల్గొన్నారు.