తిమ్మాపూర్, నవంబర్ 26: ఆత్మబంధువులా ఉన్న సీఎం కేసీఆర్ కావాలా.. అన్నీ బంద్ చేసే వారు కావాలా తెలంగాణ ప్రజలు ఆలోచించాలని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రసమయి బాలకిషన్ సూచించారు. ఆదివారం మండలంలోని మహాత్మానగర్, తిమ్మాపూర్ గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలకు ఏమి కావాలో ఆలోచించే నాయకున్ని ఎన్నుకుంటే ఐదేళ్ల పాటూ ఏ రందీ లేకుండా చూసుకుంటారని.. అలా కాదని వేరే వారికి ఓటు వేస్తే ప్రజలను పట్టించుకోరని స్పష్టం చేశారు.
మహాత్మానగర్ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, తాను ఎల్లవేళలా ఇదే గ్రామంలో అందుబాటులో ఉన్నానన్నారు. తిమ్మాపూర్ గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థి వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని, తానెన్నడూ వ్యక్తిగతం జోలికి పోలేదన్నారు. ఇలాంటి నాయకున్ని ఎన్నుకుంటే ఐదేళ్ల పాటు ప్రజలను పట్టించుకోరని విమర్శించాడు. సీఎం కేసీఆర్ తప్ప వేరే పార్టీల వారు అయితే ఇన్నాళ్లు చేసిన అభివృద్ధి మరుగున పడుతుందన్నారు.
ప్రజలకు, రైతులకు ఇచ్చే సంక్షేమ పథకాలు వారు ఇవ్వరని చెప్పారు. తిమ్మాపూర్ గ్రామాన్ని ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేసినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నిధులు తెచ్చి అభివృద్ధి చేశానని, ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంతకుముందు ఎమ్మెల్యేకు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవెందర్రెడ్డి మాట్లాడుతూ, గ్రామాన్ని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అండతో ఎంతగానో అభివృద్ధి చేశామని చెప్పారు. అభివృద్ధి చేసే వ్యక్తులనే గెలిపించాలని కోరారు.
తనపై విమర్శలు చేసే నాయకుడికి ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గడ్డం నాగరాజు, పార్టీ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాస్రావు, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ఇన్చార్జి నాయిని వెంకట్రెడ్డి, వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, సర్పంచులు దుండ్ర నీలమ్మ-రాజయ్య, జక్కని శ్రీవాణి-రవీందర్, ఎంపీటీసీ వేల్పుల మమత, నాయకులు ఉల్లెంగుల ఏకానందం, కేతిరెడ్డి తిరుపతిరెడ్డి, మడుపు శ్రీనివాస్రెడ్డి, మాశెట్టి శివ, అడిశెర్ల సత్యం, రాజు తదితరులు పాల్గొన్నారు.