మానకొండూర్ రూరల్, నవంబర్ 8: కాంగ్రెస్ ఇచ్చే ఆరు హామీలకు గ్యారెంటీ లేదు. మానకొండూర్ ఆ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి మాటలకు వారెంటీలేదు’ అంటూ మానకొండూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రసమయి బాలకిషన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దొంగమాటలతో ఊర్లకు వచ్చే వాళ్లను నమ్మదద్దని, ఆ పార్టీ పగటి బిచ్చగాళ్లను పొలిమేరల దాకా తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తొమ్మిదన్నరేండ్లలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, అందిన సంక్షేమ పథకాలను చూసి కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు.
బుధవారం కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని సదాశివపల్లి, మానకొండూర్ మండలం శ్రీనివాస్నగర్, జగ్గయ్యపల్లి, లింగాపూర్, వెల్ది, రంగపేట గ్రామాల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో కలిసి ముమ్మరంగా ప్రచారం చేశారు. గడపగడపకూ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. మళ్లీ గెలిపిస్తే చేయబోయే పనులను వివరిస్తూ ఓటేయాలని కోరారు. అనంతరం రసమయి మాట్లాడారు. దాదాపు యాభై ఏండ్లు అధికారం అనుభవించిన కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీలేదన్నారు. ఇప్పుడు మళ్లీ ఒక్కచాన్స్ ఇవ్వాలంటూ అడగడం విడ్డూరంగా ఉన్నదని విమర్శించారు. తెలంగాణను సాధించి అనంతరం అధికారం చేపట్టిన సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు.
దేశంలో ఎక్కడాలేనివిధంగా రైతుబంధు, రైతుబీమా లాంటి బృహత్తర పథకాలను అమలు చేస్తున్న ఘనత ఆయనకే దక్కిందన్నారు. ప్రజలు ఆలోచించి పనిచేసేవారికే ఓటేయాలని కోరారు. జీవీఆర్ మాట్లాడుతూ, ప్రజల కోసం తపించే రసమయిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కాగా శ్రీనివాస్నగర్లో మాజీ సర్పంచ్ ఎరుకల భాగ్య-శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేకు నామినేషన్ వేసేందుకు ఖర్చులకు 5 వేల నగదును అందజేశారు.
జగ్గయ్యపల్లిలో పార్టీలో చేరిన దాదాపు 40 మందికి ఎమ్మెల్యే, జీవీఆర్లు పార్టీ కండువాలు కప్పి సాదరగంగా ఆహ్వానించారు. జగ్గయ్యపల్లిలో కూకట్పల్లికి చెందిన పరిశీలకుల బృందం సీహెచ్ దామోదర్రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు తమ మద్దతు ప్రకటించారు. ప్రతి గ్రామానికి చేరుకున్న రసమయి బాలకిషన్కు, జీవీఆర్లతో పాటు ప్రముఖులకు ఆడబిడ్డలు, కోలాట మహిళలు,డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా బతుకమ్మలతో, బోనాలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు ఆకుల ప్రకాశ్, గడ్డం నాగరాజు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.