‘మీకు ప్రభుత్వం ఉంది. మన సీఎం కేసీఆర్ ఉన్నరు. అధైర్య పడకండి.. అండగా ఉంటాం’ అంటూ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ రైతులకు భరోసానిచ్చారు. శనివారం రాత్రి వడగండ్ల వానతో పలు మండలాల్లో పంటలు దెబ్బతినగా, ఆదివారం జగిత్యాల మండలంలోని లక్ష్మీపూర్లో మంత్రి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో మరో మంత్రి గంగుల కమలాకర్ యంత్రాంగంతో కలిసి క్షేత్రస్థాయికి వెళ్లారు. దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తుండగా, పలువురు రైతులు బోరున విలపించడంతో వారు భుజం తట్టి ఓదార్చారు. ‘బాధపడొద్దు.. అన్ని విధాలా ఆదుకుంటాం’ అని హామీ ఇచ్చారు. వీరితో పాటు ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, డాక్టర్ సంజయ్కుమార్, సుంకె రవిశంకర్, దాసరి మనోహర్రెడ్డి, రాజన్న సిరిసిల్ల జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ వరి పంటలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. మరోవైపు సీఎం కేసీఆర్ కలెక్టర్లతో మాట్లాడి నివేదిక తెప్పించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించడంతో, అధికార యంత్రాంగం వ్యవసాయ క్షేత్రాలను సర్వే చేసి, నష్టంపై ప్రాథమిక అంచనా వేసింది.
– కరీంనగర్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ జిల్లాలో శనివారం రాత్రి నుంచి పలు మండలాల్లో వడగండ్లు కురిశాయి. ఇప్పటికే జిల్లాపై రెండు సార్లు కురిసిన వడగండ్లు అపార నష్టాన్ని తెచ్చాయి. తాజాగా కురిసిన వడగండ్లు, గాలి దుమారం, అకాల వర్షంతో గంగాధర, చొప్పదండి, రామడుగు, కరీంనగర్ రూరల్, మానకొండూర్ తదితర మండలాల్లో తీవ్ర ప్రభావం చూపాయి. చేతికి వచ్చిన పంట వడగండ్ల పాలు కావడంతో రైతులు ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో వారికి భరోసా కల్పించేందుకు ఆదివారం మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులకు భరోసా కల్పించారు. బోరున విలపించిన రైతులను ఓదార్చి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు..
కాలికి గాయమై వేధిస్తున్నా క్షేత్రస్థాయికి..
కాలుకు దెబ్బతగిలి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న మంత్రి గంగుల కమలాకర్ వడగండ్లతో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు చేతి కర్ర, స్టాండ్ సాయంతో కదిలారు. కరీంనగర్ మండలం చామన్పల్లి, ఫకీర్పేట, బహద్దూర్ఖాన్ పేట, తాహెర్ కొండాపూర్, చెర్లభూత్కూర్ గ్రామాల్లో పర్యటించారు. తాహెర్ కొండాపూర్కు చెందిన లక్ష్మయ్య అనే రైతు మంత్రి ముందే బోరున విలపించగా మంత్రి ఓదార్చారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నదని, అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కౌలు రైతులకు కూడా న్యాయం జరుగుతుందని భరోసా కల్పించారు. మంత్రి వెంట అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్, జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, మార్కెట్ కమిటి చైర్మన్ రెడ్డవేని మధు తదితరులు ఉన్నారు.
గంగాధరలో ఎమ్మెల్యే సుంకె..
గంగాధర మండలంలో విపరీతంగా దెబ్బతిన్న వరి పంటను వ్యవసాయ అధికారులతో కలిసి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరిశీలించారు. లింగంపల్లి, కొండయ్యపల్లి, ర్యాలపల్లి, బూరుగుపల్లిలో పంట దెబ్బతిన్న రైతులు ఎమ్మెల్యే ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. అధైర్య పడవద్దని, ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ దృష్టికి తీసుకువెళ్లానని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. చొప్పదండి మండలంలోని భూపాలపట్నం, వెదురుగట్ట, చాకుంట గ్రామాల్లో చొప్పదండి మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డితోపాటు అధికారులు పర్యటించి పంటను పరిశీలించారు. ఏమాత్రం ఆశ లేకుండా దెబ్బతిన్న పంటలను చూపుతూ రైతులు కన్నీరు మున్నీరయ్యారు. రామడుగు మండలంలో సర్వే వ్యవసాయ అధికారులు సర్వే నిర్వహించారు. గోపాల్రావుపేటలో మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి తిరుపతి పర్యటించి రైతులను ఓదార్చారు. మానకొండూర్ మండలం ఊటూరు, వేగురుపల్లి, పచ్చునూర్, చెంజర్ల గ్రామాల్లో దెబ్బతిన్న వరి పంటను వ్యవసాయ అధికారులు పరిశీలించి ప్రాథమిక సర్వే చేశారు. శంకరపట్నం మండలం ముత్తారం, లింగాపూర్ గ్రామాల్లో అధికారులు ప్రాథమిక సర్వే చేశారు.
కరీంనగర్ రూరల్ మండలంలోని దెబ్బతిన్న పంటల పరిశీలనకు మంత్రి గంగుల కమలాకర్ పలు గ్రామాల్లో పర్యటించినపుడు కొందరు రైతుల పరిస్థితిని ప్రత్యక్షంగా చూసి చలించి పోయారు. దగ్గరకు రమ్మని పిలిచి ఓదార్చారు. ‘లచ్చన్న ఏడ్వకు.. నేనున్నా.. మన సారు కేసీఆర్ ఉన్నరు.. ఏ రైతు కూడా అధైర్య పడవద్దని’ లక్ష్మయ్యతోపాటు అక్కడున్నవారిని ఓదార్చారు. ఇలాంటి సంఘటనలే ప్రతి చోట కనిపించాయి. చేతికి వచ్చిన పంట వడగండ్ల పాలైందని రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి గంగులతోపాటు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, అధికారులు వారికి ఎంతో భరోసా కల్పించారు. ప్రభుత్వం తప్పకుండా నష్ట పరిహారం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు.
23,709 ఎకరాల్లో పంట నష్టం
వడగండ్లు భారీ నష్టాన్నే తెచ్చి పెట్టాయి. ఇప్పటికే రెండు సార్లు జిల్లాపై ప్రభావం చూపిన వడగండ్లు మరోసారి కోలుకోలేని దెబ్బతిశాయి. ఈసారి 12 మండలాల్లో ప్రధానంగా వరి పంటకు నష్టం కలిగించాయని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అంచనా వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్ తెలిపారు.
వరికే తీవ్ర నష్టం..
వడగండ్ల కారణంగా వరి పంటకే ప్రధానంగా చొప్పదండి, కరీంనగర్ రూరల్ మండలాలు సహా రాష్ట్రంలో వడగండ్లతో దెబ్బతిన్న పంటల నష్టాన్ని అంచనా వేసి, వివరాలు అందజేయాలని సీఎం కేసీఆర్ సీఎస్ శాంతికుమారిని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రంగంలోకి దిగిన యంత్రాంగం, నష్టం అంచనాలు రూపొందింది. 16,404 మంది రైతులకు చెందిన 22,120 ఎకరాల్లో దెబ్బతిన్నది. 284 మందికి చెందిన 334 ఎకరాల్లో మక్క, 451 మందికి చెందిన 1,172 ఎకరాల్లో మామిడి, 58 మందికి చెందిన 83 ఎకరాల్లో కూరగాయ దెబ్బతిన్నాయి. మొత్తంగా 17,197 మంది రైతులకు చెందిన 23,709 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు డీఏఓ శ్రీధర్ తెలిపారు. అదే మండలాలవారీగా చూసుకుంటే చొప్పదండిలో 5,757 మంది రైతులకు చెందిన 8,176 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో 7,537 ఎకరాల్లో వరి పంటనే పాడైంది. ఇక రామడుగు మండలంలో 2,824 మంది రైతులకు చెందిన 3,362 ఎకరాల్లో దెబ్బతినగా, 3,330 ఎకరాల్లో వరి పంటే ఉంది. గంగాధర మండలంలో 790 మంది రైతులకు చెందిన 1,595 ఎకరాల్లో ఒక్క వరే 1,171 ఎకరాలు ఉంది. అలాగే హుజూరాబాద్ మండలంలో 4,013 మందికి చెందిన 3,871 ఎకరాలు, జమ్మికుంటలో 281 మందికి చెందిన 362 ఎకరాలు, ఇల్లంతకుంటలో 95 మందికి చెందిన 124 ఎకరాలు, వీణవంకలో 1,132 మందికి చెందిన 1,570 ఎకరాలు, మానకొండూర్లో 648 మందికి చెందిన 1,402 ఎకరాలు, తిమ్మాపూర్లో 8 మందికి చెందిన 8 ఎకరాలు, కరీంనగర్లో 1,536 మందికి చెందిన 2,980 ఎకరాల్లో, కొత్తపల్లిలో 9 మంది రైతులకు చెందిన 25 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు.