చిగురుమామిడి, అక్టోబర్ 10: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించడం ఖాయమని, కేసీఆర్ మూడోసారి సీఎంగా గెలిచి రికార్డు సృష్టిస్తారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 15న ఎన్నికల శంఖారావంలో భాగంగా సీఎం లక్ష మందితో నిర్వహించే ప్రజాఆశీర్వాద సభ స్థలాన్ని మంగళవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్, బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో కలిసి పరిశీలించారు.
అనంతరం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్త సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 15న అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి సీఎం ప్రారంభించడం ఇక్కడి ప్రజలకు గర్వకారణమన్నారు. లక్ష మందికి పైగా ప్రజా ఆశీర్వాద సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాబోయే భవిష్యత్తు అంతా బీఆర్ఎస్దే నన్నారు. బీఆర్ఎస్ విజయం ఎప్పుడో ఖాయం అయిందని ధీమా వ్యక్తం చేశారు.
ముఠా తగాదా రాజకీయాలకు కాంగ్రెస్ పెట్టింది పేరని, గ్రూప్ రాజకీయాలు, టికెట్ల లొల్లితో ఆ పార్టీ కొట్టుమిట్టాడుతున్నదని ఎద్దేవా చేశారు. ఇటువంటి వారు రాష్ట్రాన్ని ఏమి పాలిస్తారని ప్రశ్నించారు. మాటలు ఎకువ.. చేతలు తకువ ఉన్న కాంగ్రెస్ నాయకులను తెలంగాణ ప్రజలు నమ్మబోరన్నారు. తొమ్మిదిన్నరేండ్లలో కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో కరువు లేదని, కాంగ్రెస్ వస్తే మళ్లీ అంధకారంలోకి పోతామన్నారు. నేడు రాష్ట్రం సుభిక్షంగా ఉందని, దేవాదుల, కాళేశ్వరం, గౌరవెల్లి ప్రాజెక్టులతో సాగు, తాగునీటికి కష్టాలు తప్పాయని గుర్తు చేశారు. మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గం నేడు సస్యశ్యామలంగా మారిందన్నారు.
హుస్నాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. సీఎం కేసీఆర్ విడుదల చేసే మేనిఫెస్టోతో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవుతుందన్నారు. కేసీఆర్ అంటే ప్రజలకు నమ్మకం, విశ్వాసం ఉందని, అందుకే మరోసారి భారీ మెజార్టీతో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
సమావేశంలో సిద్దిపేట జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ రాయిన్ రెడ్డి రాజిరెడ్డి, హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, రాష్ట్ర నాయకులు కర్ర శ్రీహరి, చిగురుమామిడి, సైదాపూర్ ఎంపీపీలు కొత్త వినీతా శ్రీనివాస్రెడ్డి, సారబుడ్ల ప్రభాకర్రెడ్డి, జడ్పీటీసీ గీకురు రవీందర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు మామిడి అంజయ్య, సోమారపు రాజయ్య, వైస్ ఎంపీపీలు బేతి రాజిరెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు జంగా వెంకటరమణారెడ్డి, బిల్ల వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సాంబారి కొమురయ్య, రామోజు కృష్ణమాచారి, మారెట్ కమిటీ వైస్ చైర్పర్సన్ రామోజు రజిత, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్లు పెనుకుల తిరుపతి, రావుల రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ అందే సుజాత, సర్పంచుల ఫోరం మండల కన్వీనర్ కొండ గణేశ్, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.