సైదాపూర్, మార్చి14 : వేసవిలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని, ఆ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సైదాపూర్ మండలకేంద్రంలోని వెన్కేపల్లిలో 18 గ్రామాలకు సంబంధించిన 75 లక్షల విలువైన పనులు, అమ్మనగుర్తిలో 2కోట్లతో నిర్మించే 33/11 కేవీ సబ్స్టేషన్ పనులకు ఆయన కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నీటి సమస్య రాకుండా హుస్నాబాద్ నియోజకవర్గానికి 3.5 కోట్ల నిధులు తీసుకువచ్చినట్లు తెలిపారు. విద్యార్థి సంఘం నాయకుడి నుంచి వచ్చిన తనకు పాఠశాలల సమస్యలు తెలుసని, వాటిని పరిష్కరిస్తానన్నారు.
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామన్నారు. వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుపై వైశ్య సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేసి మంత్రిని సన్మానించారు. సర్వాయిపేట బ స్సు నడుపాలని పలువురు కోరగా సమస్యను పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించామని, పాఠశాలల్లో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్రెడ్డి, తహసీల్దార్ మంజుల, ఎంపీడీఓ యాదగిరి, ఎంపీటీసీలు జంపాల సంతోష్, తొంట ఓదెలు, లంకదాసరి అరుణమల్లయ్య, చాంద్పాషా, చైతన్య కొండాల్రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సుధాకర్ పాల్గొన్నారు.