మానకొండూర్ రూరల్, జనవరి 10 : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్పష్టం చేశారు. బుధవారం మానకొండూర్ మండలం గంగిపల్లిలో బస్ షెల్టర్లు, ఓపెన్ జిమ్, కొండపల్కలలో ఆర్టీసీ బస్సు, నిజాయితీగూడెంలో జీపీ భవనాన్ని ప్రారంభించారు. అంతకు ముందు కొండపల్కల నుంచి గంగిపల్లి వరకు బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి మాట్లాడారు.
ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను కంప్యూటరీకరణ చేస్తున్నామని, త్వరలోనే అర్హులందరికీ పథకాలను వర్తింపజేసే ప్రక్రియ మొదలుపెడుతామన్నారు. తిమ్మాపూర్లోని డ్రైవింగ్ స్కూల్ ట్రాక్కు చొక్కారావు పేరు అమలు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయని, ఆయన జన్మదినం రోజే కరీంనగర్ వన్టౌన్ పోలీస్ స్టేషన్ చొక్కారావు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు.
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, మీ సేవ, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలు, దళారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజాపాలన నిర్వహించామని తెలిపారు. అంతకు ముందు గ్రామానికి చేరుకున్న మంత్రికి, ఎమ్మెల్యేకు నాయకులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికి, సన్మానించారు. కార్యక్రమంలో ఆర్డీవో మహేశ్వర్, ఎంపీపీ ముద్దసాని సులోచన, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం భూపతి రెడ్డి, డీఆర్డీవో శ్రీలత, జడ్పీ సీఈవో పవన్ కుమార్, డీఈవో జనార్దన్ రావు, తదితరులు పాల్గొన్నారు.