Minister KTR | రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ)/సిరిసిల్ల రూరల్/వీర్నపల్లి(ఎల్లారెడ్డిపేట) : రాష్ట్ర ఐటీ, మున్సిపల్ పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పర్యటించనున్నారు. పలు గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. ఉదయం 10.30 గంటలకు తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చేరుకుంటారు. గ్రామంలో అంబేద్కర్, చాకలి ఐలమ్మ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అనంతరం అదే గ్రామంలో రూ.19.50 లక్షలతో చేపట్టిన ఎస్సీ , రూ.5 లక్షలతో చేపట్టిన ముదిరాజ్ సంఘ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
తర్వాత రూ.1.50 కోట్లతో ఏర్పాటు చేసిన సబ్స్టేషన్ను ప్రారంభిస్తారు. అనంతరం లక్ష్మీపూర్లో పల్లె దవాఖానను ప్రారంభిస్తారు. 11.30 గంటలకు పాపయ్యపల్లెలో రూ.26 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు గోపాల్రావుపల్లెలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తంగళ్లపల్లిలోని పీహెచ్సీలో ఫిజియోథెరపీ సేవలను ప్రారంభిస్తారు. ఒంటిగంటకు మండెపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు గండిలచ్చపేటకు చేరుకుంటారు. గ్రామంలో అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావుఫూలే విగ్రహాలను ఆవిష్కరిస్తారు. తర్వాత కేసీఆర్ ప్రగతి ప్రాంగణాన్ని ప్రారంభించనున్నారు.
దళితబంధు పథకం కింద మంజూరైన పౌల్ట్రీఫాంను ప్రారంభించి లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలానికి చేరుకుంటారు. మండలంలోని దుమాల గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత చిట్టివాగుపై నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభిస్తారు. అనంతరం రూ.10 లక్షలతో నిర్మించిన గౌడ సంఘ భవనం, రూ.10 లక్షలతో మహిళా సంఘ భవనం, చిట్టివాగుపై రూ.4 కోట్లతో నిర్మించిన వంతెన ప్రారంభిస్తారు.
యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మల్లన్న పట్నాలకు హాజరు కానున్నారు. అక్కడి నుంచి 3.30 గంటలకు బుగ్గరాజేశ్వర తండా చేరుకొని రూ.20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని, రూ.9.60లతో నిర్మించిన గిరిజన కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు రాచర్ల గుండారంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 5 గంటలకు గంభీరావుపేట మండలం గోరంట్యాలలో అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు. కాగా, అమాత్యుడి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
గ్రామ గ్రామాన అంబేద్కర్ విగ్రహాలు
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక గౌరవం కల్పించింది. రాజ్యాంగ బద్ధంగా ముందుకు పోతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నది. ఏప్రిల్ 14న బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నది. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రారంభానికి సిద్ధం చేసిన అంబేద్కర్ విగ్రహాలను ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. తంగళ్లపల్లి మండలంలోని చీర్లవంచ, గోపాల్రావుపల్లె, మండెపల్లి, గండిలచ్చపేట, ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల, రాచర్లగుండారం, గంభీరావుపేట మండలంలోని గొరింట్యాలలో విగ్రహాలను నేడు ఆవిష్కరించనున్నారు.
దళిత బంధు లబ్ధిదారులతో లంచ్..
నాడు అన్నల కంచుకోట అయిన గండి లచ్చపేటకు మంత్రి కేటీఆర్ రానుండడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దళితబంధు తొలివిడుతలో తమ గ్రామాన్ని ఎంపిక చేయడంతో దళిత కుటుంబాలు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా మంత్రి స్వయంగా వచ్చి, దళిత బంధు యూనిట్ను ప్రారంభించడంతోపాటు తమతో కలిసి భోజనం చేయనుండడంతో సంబురపడుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.
తంగళ్లపల్లి మండలం చీర్లవంచ, చింతలఠాణా గ్రామాలు ఎస్ఆర్ఆర్(మధ్యమానేరు)లో పూర్తిగా ముంపునకు గురయ్యాయి. చీర్లవంచ శివారులోనే ఆర్అండ్ఆర్ కాలనీ ఏర్పాటు చేసుకున్నారు. ముంపు గ్రామమైనప్పటికీ చీర్లవంచ ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధిలో ముందంజలో ఉన్నది. రూ.1.50 కోట్లతో సబ్స్టేషన్ ఏర్పాటు చేశారు. రూ.80 లక్షలతో సీసీ రోడ్లు, డ్రేనేజీలు, రూ.15 లక్షలతో పాఠశాల అభివృద్ధి, 6, 7 తరగతులకు అప్గ్రెడేషన్ చేశారు. రూ.20 లక్షలతో రెండు అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5 హైమాస్ట్ లైట్లు ఏర్పాటు, శ్మశాన వాటిక, డంప్ యార్డు, పల్లె ప్రకృతివనం, 2 బతుకమ్మ తెప్పలు, నర్సరీ, దోభీఘాట్ నిర్మించారు. 150 విద్యుత్ స్తంభాలు, 90 మంది ఇళ్లకు సుమారు రూ.5 కోట్ల పరిహారం అందించారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతోనే నిధులు మంజూరు కాగా, గ్రామం ఇప్పుడు ప్రగతి పథంలో నడుస్తున్నది. ఇటీవలే గ్రామానికి సాంఘిక భద్రతగల విభాగంలో అమాత్యుడి చేతుల మీదుగా సర్పంచ్ జక్కుల రవీందర్ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నారు.
చిట్టివాగుపై రూ.4 కోట్లతో నిర్మించిన వంతెన
ఒకే గ్రామంలో ఉన్నా వరదలొస్తే చిట్టివాగు అవతల 40 కుటుంబాలు జీవిస్తున్న రామిండ్ల వాడకు రాకపోకలు నిలిచిపోయేవి. వరదలు వచ్చినప్పుడు నిత్యావసర సరకులు తెచ్చుకునేందుకు నానా కష్టమయ్యేది. ఒక్కోసారి ప్రాణాలు ఆరచేతిలో పెట్టుకొని వాగు దాటేవారు. 2012లో వరదలు వచ్చినప్పుడు సరుకులు తెచ్చుకునేందుకు దుమాల ఊరిలోకి వెళ్లిన శివరాత్రి బాలవ్వ అనే వృద్ధురాలు తిరుగు ప్రయాణంలో వాగు దాటేప్పుడు కొట్టుకుపోయి దుర్మరణం పాలైంది. అనంతరం నాటి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి కేటీఆర్ గ్రామానికి వచ్చినప్పుడు గ్రామస్తులు సమస్యను విన్నవించారు. చలించిపోయిన రామన్న రాష్ట్రం సిద్ధిస్తే రామిండ్ల (చిట్టి)వాగుపై వంతెన నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రం ఏర్పడిన ఆనంతరం రూ.4 కోట్లతో చెక్ డ్యాం, వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ప్రస్తుతం బహుళార్థక ప్రాజెక్టుగా చెక్డ్యాంతో కూడిన వంతెన నిర్మాణ పనులు పూర్తి కాగా అమాత్యుడు నేడు ప్రారంభించనున్నారు. మాట నిలబెట్టుకున్న మంత్రికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.