సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్/ ఎల్లారెడ్డిపేట, జూన్ 20 : రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేటతోపాటు సిరిసిల్లలో దాదాపు ఐదు గంటలపాటు పర్యటించిన ఆయన, ఆయాచోట్ల దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన విద్యా దినోత్సవాలకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో కలిసి హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి బయలు దేరిన అమాత్యుడు, ముందుగా ఉదయం 11:16 గంటలకు గంభీరావుపేట మండలం గోరంట్యాల చేరుకున్నారు. 50 లక్షలతో నిర్మించిన 5 అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గోరంటాల బడిని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం డీఏ పెంచిన సంధర్బంగా టీఎన్జీవో జిల్లా అద్యక్షుడు ఎలుసాని ప్రవీణ్ మంత్రి కేటీఆర్కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి అక్కడి నుంచి బయలు దేరి, 11:55 గంటలకు ఎల్లారెడ్డిపేటకు చేరుకున్నారు. 8.50 కోట్లతో కార్పొరేట్కు దీటుగా నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల సముదాయాన్ని ప్రారంభించారు. మొదట పాఠశాల ప్రాంగణంలో పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసి సరస్వతీ విగ్రహానికి వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా వేదికపై పాఠశాల నిర్మాణం, భవిష్యత్తు విద్యాభివృద్ధిపై ఆసక్తిగా ప్రసంగించారు.
ఎల్లారెడ్డిపేట పాఠశాలను చూస్తే మళ్లీ చదువుకోవాలనిపించేంత అందంగా నిర్మాణమైందని, ఏజ్ బార్ కావడం వల్ల చదువుకునే అదృష్టం లేకుండా పోయిందన్నారు. పాఠశాల ఇంత అందంగా నిర్మించడంలో కలెక్టర్ అనురాగ్జయంతి, గివ్ తెలంగాణ ఫౌండేషన్ ప్రతినిధి సాకేత్రావును, సహకరించిన మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులను అభినందించారు. నవమాసాలు మోసిన బాధ తల్లికి తెలుసని, ఏడాదిపైగా అదే బాధను అనుభవించిన కూలీ సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక్క తరం చదువుకుని బాగుపడితే ఆటోమెటిక్గా వారు వెనక్కి తిరిగి చూడకుండా డెవలప్ అవుతారని చెప్పారు. తాను పెట్టుబడుల కోసం అమెరికా, లండన్ పోయినప్పుడు మన పిల్లలు కలుస్తుంటారని, వారిని చూసి గర్వపడేంత ఎదిగే అవకాశం ఇచ్చిన సుమారు రెండు లక్షల మంది ఉపాధ్యాయులను అభినందించాల్సిందేనన్నారు. అనంతరం పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యధునిక సైన్స్ ల్యాబ్ను ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టుల వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థులతో సరదగా కాసేపు ముచ్చటించారు. అక్కడే పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులకు కంప్యూటర్విద్యపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన కంప్యూటర్ చాంప్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2:10 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లికి వెళ్లారు.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త, మాజీ సర్పంచ్ మందాటి రాజు కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులెవ్వరూ అధైర్య పడవద్దని, అన్ని విధాలుగా ఆదుకుంటామని కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. మధ్యాహ్నం 3:20 గంటలకు సిరిసిల్లలోని పద్మనాయక పంక్షన్హాల్లో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ చేశారు. దివ్యాంగులకు ఆర్థిక పునరావసం చెక్కులను అందించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, దివ్యాంగులు తమ హృదయంలో ఉన్నారని మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. మనసున్న కేసీఆర్ ఇటీవలే దివ్యాంగులకు వెయ్యి అదనంగా పింఛన్లను పెంచారని గుర్తు చేశారు. దేశంలోనే దివ్యాంగులకు అత్యధిక పింఛన్ ఇస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణేనని వెల్లడించారు. ఇలాంటి పథకాలు అందించాలంటే మనసున్న కేసీఆర్ను మరోసారి సీఎం చేయాల్సిన బాధ్యత మీదేనని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం వికలాంగుల కోరకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని, న్యాయ సలహాలను , ఆపదలో ఉన్న వారిని రక్షించేందుకు దేశంలో ఇతర రాష్ర్టాల్లో లేని విధంగా ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ 155326 ఏర్పాటు చేసిందని వెల్లడించారు.
అనంతరం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని శ్రీనిధి మహిళ స్లమ్ సమాఖ్య అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధూప్ స్టిక్స్ను మంత్రి ఆవిష్కరించారు. ఆ తర్వాత 25లక్షల చెక్ను జిల్లా దివ్యాంగుల సహాయనిధికి అందించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘సర్కారు బడి.. సరికొత్త ఒరవడి’ ఆడియో సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికారులు 1,220 మంది దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. 4:20 గంటలకు మంత్రి సిరిసిల్ల పట్టణంలోని రాజీవ్నగర్లోని మినీస్టేడియానికి చేరుకున్నారు. వాలీబాల్ అకాడమీని మంత్రి ప్రారంభించి, క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. క్రీడలు దేహధారుడ్యంతో పాటు మానసికోల్లాసానికి దోహదం చేస్తాయని చెప్పారు. క్రీడల్లో రాణించిన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అక్కడి నుంచి 4:30 గంటలకు హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు.
దివ్యాంగులకు, సీనియర్ సిటీజన్ల కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారు. వికలాంగులకు మరో వెయ్యి పెంచి పింఛన్ ఇస్తామని వారి జీవితాల్లో వెలుగులు నింపారు. సీనియర్ సిటీజన్ల చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. రాబోయే రోజుల్లో సీనియర్ సిటీజన్లకు క్లబ్లు ఏర్పాటు చేస్తాం. ఆహ్లాదకరమైన వాతావరణం కలిస్తాం. వృద్ధులకు దినపత్రికలు,చెస్, క్యారం బోర్డు లాంటి ఆటలతో వారికి మానసిక ఉల్లాసాన్ని కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వృద్థులకు బీపీ, షుగర్ మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నది. దివ్యాంగులకు పరికరాలు, పథకాలను అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణే.
– బోయినపల్లి వినోద్కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
సీఎం కేసీఆర్ నాయకత్వంలో దివ్యాంగులకు ఎటువంటి దరఖాస్తులు లేకుండానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. గత ప్రభుత్వ హయంలో రెండు మూడు వందలు ఉన్న పింఛన్ను రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ పదింతలు పెంచారు. దశాబ్ది ఉత్సవాల ప్రారంభంలో ఈ పింఛన్ను 4వేలు చేశారు. దివ్యాంగుల సంక్షేమ పథకాల అమలులో మన రాష్ట్రం దేశానికి రోల్మాడల్గా నిలిచింది. గతంలో సబ్సిడీపై దివ్యాంగులకు ఉపకరణాలు ఇచ్చిన ప్రభుత్వాలను చూశాం. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో ఉపకరణాలను అందిస్తున్నది. 40 వేల మంది దివ్యాంగులకు 40 కోట్ల విలువైన ఉపకరణాలను పంపిణీ చేసింది. మంత్రి కేటీఆర్ తన బర్త్డే సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం ద్వారా దివ్యాంగులకు ట్రైసైకిళ్లను అందించారు. మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా ట్రైసైకిళ్లు, అంబులెన్స్లు పంపిణీకి ముందుకొచ్చిన ఎమ్మెల్యేలు, నేతలకు నా కృతజ్ఞతలు. ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు, విద్యలో ఐదు శాతం , సంక్షేమ పథకాలలో ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే. సిరిసిల్లకు చెందిన దివ్యాంగుడు శ్రీనివాస్ మరణించిన సందర్భంలో మంత్రి కేటీఆర్ సహకారంతో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందిచడంతోపాటు డబుల్ బెడ్రూం ఇంటిని మంజూరు చేశారు. – వాసుదేవారెడ్డి, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్