రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం సిరిసిల్ల ప్రజలతో మమేకమయ్యారు. నియోజకవర్గంలో ఆకస్మికంగా పర్యటించిన ఆయన, పలువురు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మహిళలు, వృద్ధులను ఆప్యాయంగా పలుకరిస్తూ భరోసానిచ్చారు. మధ్యాహ్నం 2.45 గంటలకు వీర్నపల్లి మండలానికి చేరుకున్న ఆయన, నియోజకవర్గంలో రాత్రి 7 గంటల వరకు కలియదిరిగారు. వీర్నపల్లిలో కంటి వెలుగు శిబిరాన్ని, రంగంపేటలో దళితబంధు యూనిట్ ద్వారా ఏర్పాటైన హోటల్ను సందర్శించారు. సిరిసిల్లలో విలేకరుల సమావేశం అనంతరం తంగళ్లపల్లి మండలకేంద్రంలోని ఎల్లమ్మ ఆలయంలో జరిగిన సిద్ధోగం కార్యక్రమానికి హాజరయ్యారు.
– సిరిసిల్ల/ సిరిసిల్లటౌన్/ సిరిసిల్ల రూరల్/ వీర్నపల్లి/ ఎల్లారెడ్డిపేట, జనవరి 30
సిరిసిల్ల/ సిరిసిల్లటౌన్/ సిరిసిల్ల రూరల్/ వీర్నపల్లి/ ఎల్లారెడ్డిపేట, జనవరి 30 : రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం సిరిసిల్ల నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆకస్మికంగా పర్యటించారు. మధ్యాహ్నం 2.45 గంటలకు వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చేరుకున్నారు. ఇటీవల వీర్నపల్లి వైస్ ఎంపీపీ ఈసంపల్లి హేమ భర్త దేవేందర్ మృతిచెందగా, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధైర్య పడద్దని, అండగా ఉంటానని భరోసానిచ్చారు.
దేవేందర్ ఇద్దరు కూతుళ్ల పేరు మీద చెరో 2.50 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు. 3.40 గంటలకు రంగంపేటలో దళితబంధు కింద కుమ్మరి దేవయ్య ఏర్పాటు చేసుకున్న హోటల్ను సందర్శించారు. హోటల్ ఏర్పాటుకు అయిన ఖర్చును అడిగి తెలుసుకున్నారు. ‘యూనిట్ మంజూరుకు ఎవరికైనా లంచం ఇచ్చావా..’ అంటూ ప్రశ్నించగా తాను ఎవరికీ రూపాయి కూడా ఇవ్వలేదని సమాధానిమిచ్చారు. ఆనంతరం స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి తేనేటి విందు స్వీకరించి, దేవయ్యను అభినందించారు. సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతికి ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికే దిక్సూచిలా మారిందని స్పష్టం చేశారు. ఆ తర్వాత నుంచి 4.05 గంటలకు వీర్నపల్లికి చేరుకున్నారు.
రైతు వేదికలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించారు. అక్కడే ఉన్న వృద్ధులను పలుకరించి ‘కండ్లు కనిపిస్తున్నయా..? పరీక్షలు మంచిగా చేస్తున్నరా?’ అంటూ వాకబు చేశారు. వైద్యులకు తగిన సూచనలు చేశారు. అనంతరం నీలం సత్తవ్వకు స్వయంగా కళ్లజోడు తొడిగించారు. ఆ తర్వాత 4.45 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లిలో ఇటీవల మృతిచెందిన సర్పంచ్ కనకట్ల బాలయ్య ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించారు. ఆ తర్వాత ఇంటి నుంచి బయటికి వస్తున్న మంత్రిని పలువురు కలిశారు. ఎనిమిదేళ్ల క్రితం తన భర్తను కోల్పోయానని, పేదరికంతో కూతురును పోషించుకునేందుకు ఇబ్బంది పడుతున్నానని, తనకు ఉద్యోగం ఇప్పించాలని తాట్ల రాధ వేడుకోగా, అమాత్యుడు స్పందించారు.
ఉద్యోగం అవకాశాన్ని పరిశీలించాలని కలెక్టర్ను ఆదేశించారు. అలాగే వెంకటాపూర్కు చెందిన దివ్యాంగుడు మేడిశెట్టి రాజశేఖర్ తనకు స్కూటీ ఇప్పించాలని విజ్ఞప్తి చేయగా, ద్విచక్ర వాహనం ఇవ్వాలని కలెక్టర్కు సూచించారు. ఇదే సమయంలో పెద్ద సంఖ్యలో వచ్చిన విద్యార్థులు మంత్రితో ఫొటో తీసుకొని సంతోషంతో ఉప్పొంగారు. సాయంత్రం 5.30 గంటలకు సిరిసిల్లలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మంత్రి మాట్లాడారు. అనంతరం తంగళ్లపల్లిలో 20లక్షలతో నిర్మించనున్న మోడల్ జీపీ భవన పనులను ప్రారంభించారు. ఇక్కడ తనను కలిసిన గిరిజన డిగ్రీ కళాశాల విద్యార్థులను మంత్రి అభినందించారు.
ఫొటో గ్రఫీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో కలిసి ఫొటోలు దిగారు. వారిని ప్రత్యేకంగా అభినందించి, వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీనిచ్చారు. 6.12 గంటలకు తంగళ్లపల్లిలోని ఎల్లమ్మ సిద్ధోగం వేడుకలకు హాజరయ్యారు. 50 లక్షలతో నిర్మించిన ఆలయాన్ని ప్రారంభించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. చివరగా బద్దెనపల్లిలో సూపర్ మార్కెట్ను ప్రారంభించారు. మంత్రి రాకను తెలుసుకున్న స్థానికులు తమ సమస్యలు చెప్పుకోగా, ఓపికగా వింటూ సానుకూలంగా స్పందించారు. కాగా, మంత్రితో యువత, నేతలు సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు.
వీర్నపల్లి మండలం రంగంపేటలోని హోటల్లో మంత్రి కేటీఆర్ చాయ్ తాగుతుండగా, స్థానిక బీఆర్ఎస్ నేత రాయిని బుగ్గయ్యను పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో మంత్రి స్పందించి ‘మా బుగ్గన్నను వదిలి పెట్టండయ్యా.. ఉద్యమంలో నాతో పాటు పని చేసిన వ్యక్తిని ఆపుతున్నరా..’ అంటూ చమత్కరించారు. పక్కనే ఉన్న కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్కు బుగ్గయ్యను పరిచయం చేశారు. ఉద్యమంలో పనిచేసిన జ్ఞాపకాలను గుర్తు చేశారు. ‘ఇప్పుడంటే పోలీసోళ్లు పక్కనే కూర్చుంటున్నరు గానీ, ఆ సమయంలో దగ్గరికి రానిచ్చేవారు కాదు’ అని చెబుతూ నవ్వులూ పూయించారు.