హుస్నాబాద్, మే 4: ఒకప్పుడు కరువు కాటకాలతో అల్లాడిన హుస్నాబాద్ ప్రాంతం ఇప్పుడు ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. సీఎం కేసీఆర్కు సెంటిమెంట్ గల నియోజకవర్గం కావడం, మంత్రులు తన్నీరు హరీశ్రావు, కేటీఆర్, ఎమ్మె ల్యే వొడితెల సతీశ్కుమార్ ప్రత్యేక కృషితో హు స్నాబాద్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఒకప్పటి హుస్నాబాద్కు ఇప్పటి పట్టణానికి చాలా తేడా ఉందని పలువురు మేధావులు సైతం చర్చించుకోవడం విశేషం. హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి మరింత ఊతం ఇచ్చేందుకు శుక్రవారం రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మొదటిసారి పర్యటించనున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ ఆధ్వర్యం లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. హుస్నాబాద్ ప ట్టణం మొత్తం గులాబీమయమైంది. ఆర్టీసీ డిపో సమీపంలోని గ్రౌండ్లో పెద్ద ఎత్తున బహిరంగసభ వేదికను ఏర్పాటు చేశారు. మంత్రి ప్రారంభించబోయే, శంకుస్థాపన చేయబోయే ప్రాంతా ల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మినీస్టేడియంలో హెలీప్యాడ్ సిద్ధంగా ఉంది. ఎమ్మెల్యే ఏడు మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ మంత్రి పర్యటన విజయవంతం కోసం కృషి చేస్తున్నారు.
అధిక సంఖ్యలో తరలిరావాలి
మంత్రి కేటీఆర్ మొట్ట మొదటిసారి హుస్నాబాద్కు వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభకు నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలి. మంత్రి కృషితో హుస్నాబాద్తో పాటు చుట్టుపక్కల మండలాల్లో ఎంతో అభివృద్ధి జరిగింది. ఆయన పర్యటనతో ఇంకా అభివృద్ధి పనులు ఊపందుకోనున్నాయి. కావాల్సిన నిధులు, చేయాల్సిన పనులను వివరిస్తాం. హుస్నాబాద్ ప్రాంతంలో బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ చదివిన వందలాది మంది విద్యార్థుల కోసం ఐటీహబ్ ఏర్పాటు చేయాలని కోరుతాం. నియోజకవర్గంలో యువతకు ఉపాధి కల్పించే విధంగా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఇస్తాం.
– వొడితల సతీశ్కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే
నేడు మంత్రి కేటీఆర్ పర్యటన
మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం 10 గంటలకు హుస్నాబాద్కు హెలీకాప్టర్ ద్వారా చేరుకుని, మినీస్టేడియంలో ఏర్పాటు చేసిన డిగ్రీ కళాశాల భవనం, ఇండోర్స్టేడియం, డబుల్ బెడ్రూం ఇండ్లు, ఎస్టీ ఉమన్స్ హాస్టల్ భవన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. తర్వాత టీచర్ ట్రైనింగ్ సెంటర్, బస్తీ దవాఖాన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. అనంతరం మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభిస్తారు. తర్వాత ఎల్లమ్మ చెరువు ఆధునీకరణ పనులు, దోభీఘాట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం డిపో గ్రౌండ్లో భారీ బహిరంగసభలో పాల్గొంటారు. ఆయనతో పాటు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి హాజరుకానున్నారు. కేటీఆర్ రాక నేపథ్యంలో పట్టణంలో భారీ ఏర్పాట్లు చేశారు.
33.51 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
మంత్రి కేటిఆర్ హుస్నాబాద్ పట్టణంలో 33.51కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. 2.25 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం, రూ.కోటితో నిర్మించిన ఎస్టీ ఉమన్స్ హాస్టల్ భవనం, రూ.2కోట్లతో నిర్మించిన టీచర్ ట్రైనింగ్ సెంటర్ భవనం, 10 లక్షలతో నిర్మించిన బస్తీ దవాఖాన భవనం, 16.46 లక్షలతో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు, 1.20కోట్లతో నిర్మించిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, కోటి నిధులతో నిర్మించిన ఇండోర్ స్టేడియంను మంత్రి ప్రారంభిస్తారు. అలాగే, 3.50 కోట్లతో ఎల్లమ్మ చెరువు ఆధునీకరణ పనులు, 2 కోట్లతో నిర్మించబోయే దోభీఘాట్, 2.50కోట్లతో నిర్మించబోయే హుస్నాబాద్ సబ్స్టేషన్ నుంచి మహ్మదాపూర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేస్తారు.
మరో 60 కోట్లతో పనులకు ప్రతిపాదనలు
హుస్నాబాద్ పట్టణ అభివృద్ధికి మంత్రి కేటీఆర్ ఇప్పటికే 34కోట్ల నిధులు మంజూరు చేయగా పట్టణంలో సీసీరోడ్లు, డ్రైనేజీలు దాదాపుగా పూర్తి కావచ్చాయి. మరో 60కోట్ల పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి మంత్రికి ఇవ్వనున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్ తెలిపారు. పట్టణంలోని ప్రధాన రహదారులైన డిపో రోడ్డు, నాగారం రోడ్డు, రామవరం రోడ్లలో సెంట్రల్ లైటింగ్ సిస్టం, డివైడర్ల ఏర్పాటు, బైపాస్ రోడ్డు నిర్మాణం, అన్ని కుల సంఘాలకు కమ్యూనిటీ హాళ్లు, ఇంకా మిగిలి ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరనున్నట్లు ఆమె చెప్పారు. అలాగే ఐటీ హబ్, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.