రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం సిరిసిల్ల నియోజకవర్గంలో ఉత్సాహంగా పర్యటించారు. విద్యార్థుల సాంకేతిక చదువులకు చేయూతనిస్తూ.. పేదలకు భరోసానిస్తూ ముందుకు సాగారు. ముందుగా మోహినికుంటలో బంధువులను పరామర్శించిన ఆయన, అనంతరం ఎల్లారెడ్డిపేటలో 2125 మంది విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు. వారి మధ్యన కూర్చొని ట్యాబ్ పనితీరును వివరించి, మీరంతా ప్రపంచంతో పోటీ పడి విజేతలుగా నిలువాలని ఆకాంక్షించారు. అనంతరం వృద్ధుల డే కేర్ సెంటర్ను ప్రారంభించి వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. క్యారమ్ ఆడుతూ.. మెళకువలు చెబుతూ ఉత్తేజ పరిచారు. అక్కడే సహపంక్తి భోజనం చేశారు. ఆ తర్వాత సిరిసిల్లలో పేరుపేరునా లబ్ధిదారులను పిలుస్తూ, 400 మందికి డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను అందజేశారు.
సిరిసిల్ల/ ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 28 : రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, సిరిసిల్ల మండలాల్లో పర్యటించారు. ఉదయం 10.45 గంటలకు ముస్తాబాద్ మండలం మోహినికుంటలో తన పెద్దనాన్న కల్వకుంట్ల చక్రధర్రావు రావు గత నెల 16న గుండెపోటుతో మృతి చెందగా, ఆయన కుటుంబసభ్యులను మంత్రి పరామర్శించారు. చక్రధర్రావు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. తర్వాత చక్రధర్రావు భార్య పరంధామ, కొడుకు వరప్రసాద్, కూతుళ్లు రజనీ నాగేందర్రావు, వసుధ రత్నాకర్రావుతో మాట్లాడారు. అన్ని విధాలా అండగా ఉంటామని ధైర్యాన్నిచ్చారు. అనంతరం ఎల్లారెడ్డిపేట మండలం 24లక్షలతో రాగట్లపల్లిలో జీపీ భవనాన్ని ప్రారంభించి, ఎల్లారెడ్డిపేటలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్కు చేరుకున్నారు.
గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు 2,125 ట్యాబ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అమాత్యుడు విద్యార్థులతో సెల్ఫీలు దిగారు. గ్యాలరీల వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చారు. విద్యార్థుల మధ్య కూర్చొని ట్యాబ్ పనితీరును వివరించారు. మార్కెట్లో ట్యాబ్ విలువ 10 వేలు ఉంటుందని, మెటీరియల్ విలువ 75 వేలు అవుతుందని చెప్పారు. విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. అక్కడే మినీ స్టేడియం పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోనే మొదటగా ఎల్లారెడ్డిపేటలో 25 పడకల సామర్థ్యంతో నిర్మించిన వృద్ధుల డే కేర్సెంటర్ (సంరక్షణ కేంద్రం)ను ప్రారంభించారు.
40లక్షలతో బొప్పాపూర్ జీపీ భవనాన్ని ప్రారంభించి, మధ్యాహ్నం 3గంటలకు రాచర్ల గొల్లపల్లిలో ఎల్లమ్మ సిద్ధోగానికి హాజరయ్యారు. 24 లక్షలతో వెంకటపూర్లో నూతన జీపీ భవనాన్ని ప్రారంభించారు. తర్వాత 53 మందికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సాయంత్రం 5.30 గంటలకు సిరిసిల్ల కలెక్టరేట్కు చేరుకున్నారు. అక్కడే 400 మందికి డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాల పంపిణీ చేశారు. లబ్ధిదారులను పేరు పేరునా పిలిచి ఓపికతో గంట పాటు పట్టాలు పంపిణీ చేశారు. మహిళలతో వారి ఆనందాన్ని, అభిప్రాయాన్ని స్వయంగా తెలుసుకుంటూ, ఒక్కొక్కరికి స్వయంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు కేటీఆర్కు స్వయంగా కృతజ్ఞతలు తెలుపుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తర్వాత బతుకమ్మ ఘాట్ వద్ద బలగం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరయ్యారు.
వృద్ధులతో ఆప్యాయంగా..
ఎల్లారెడ్డిపేటలో వృద్ధుల సంరక్షణ కేంద్రం (డే కేర్ సెంటర్)ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, కాసేపు వృద్ధులతో గడిపారు. ఆప్యాయంగా పలుకరించి యోగ క్షేమాలను తెలుసుకున్నారు. క్యారంబోర్డ్ ఆడారు. ఆటలో మెళకువలను వివరించారు. మలి సంధ్యలో ఆదరణకు నోచుకోని వృద్ధులు ఆత్మగౌరవంతో బతికేందుకు ఈ డే కేర్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంరక్షణ కేంద్రంలో కలియదిరిగి ‘వసతులు బాగున్నాయి’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం వృద్ధులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందనేది ఫ్లెక్సీలు కట్టిపెడుతం. కరీంనగర్ పార్లమెంటుకు ఎంపీగా బండి సంజయ్ ఏం చేశాడో చెప్పగలడా? ఏమన్నా అంటే అండ్ల ఆరు పైసలు మావే.. అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నడు. చేసిన పని చెప్పకుండా మసీదులు తవ్వుతం.. సెక్రటేరియట్ కూల్చుతం.. అంటూ మతతత్వాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నడు. కులమతాల పేరుతో చిల్లరమల్లర మాటలు మాట్లాడుతూ ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్న వారిని నమ్మవద్దు. మేం సిరిసిల్లను జిల్లాను చేసి, కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతోపాటు, అనేక కార్యాలయాలు, సంస్థలు తెచ్చి పాలనా సౌలభ్యాన్ని కల్పించాం. నరేంద్ర మోదీ రాష్ర్టానికి ఏం చేసిండని దేవుడైండు..
– ఎల్లారెడ్డిపేట మండలంలో జరిగిన పలు కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్
ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో రేణుకామాతకు మొక్కులు చెల్లించుకుంటూ..
ఎల్లారెడ్డిపేటలో దివ్యాంగుడికి స్కూటీ అందిస్తూ..
ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ట్యాబ్ల గురించి వివరిస్తున్న మంత్రి కేటీఆర్
ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్లో నూతన జీపీ భవనాన్ని ప్రారంభించిన అనంతరం సర్పంచ్ బాల్రెడ్డిని కుర్చీలో కూర్చోబెట్టి అభినందిస్తున్న మంత్రి
ట్యాబ్ను ఫస్ట్ టైం చూస్తున్న
మా నాన్న కొన్నేండ్ల కిందనే చనిపోయిండు. మా అమ్మ ఇండ్లల్లో పనిచేస్తూ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తుంది. నాకు తమ్ముడు ఉన్నడు. వాడు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నడు. స్మార్ట్ఫోన్ కొనే స్థోమత లేని మాకు మంత్రి కేటీఆర్ సార్ 86 వేల విలువైన ట్యాబ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మా ఇంటికి ఇప్పటి వరకు వచ్చిన పెద్ద విలువైన వస్తువు ఇదే. ట్యాబ్ను ఫస్ట్ టైం చూస్తున్న. దీనిని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదుగుత.
– ఎస్ ఉమ, ఇంటర్ సెకండియర్, సీఈసీ,
కేజీబీవీ (తంగళ్లపల్లి) జీవితంలో మరిచిపోలేం
ఇంటర్ చదివే మాకు ట్యాబ్లు అందించడం సంతోషంగా ఉంది. ట్యాబ్లు ఇస్తున్నారని మా లెక్చరర్స్ చెప్పగానే ఉత్సాహంగా ఎదురుచూసినం. పేద విద్యార్థుల చదువు కోసం మంత్రి కేటీఆర్ సార్ సహకారం జీవితంలో మరిచిపోలేం. పట్టుదలతో కృషి చేసి మంచి భవిష్యత్తు కోసం కష్టపడుతం. సిరిసిల్ల నియోజకవర్గంలో చదువుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నం. సార్కు మేమంతా రుణపడి ఉంటం.
– బీ ప్రత్యూష, సీఈసీ, సెకండియర్,
ప్రభుత్వ జూనియర్ కళాశాల (ముస్తాబాద్)
పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగం
కేటీఆర్ సార్ అందించిన ట్యాబ్లు పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగపడుతయ్. తరగతి నోట్స్తోపాటు ఐఐటీ, జేఈఈ, నీట్, పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావచ్చు. వీటిని సద్వినియోగం చేసుకొంటం. మాకు ట్యాబ్లు ఇస్తున్నరని మా ఇంట్లో చెబితే అందరూ సంతోషపడ్డరు. ఇంటిల్లిపాదికి ఈరోజు పండుగలా అనిపించింది. అనివార్య కారణాలతో క్లాస్లు వినని పరిస్థితుల్లో ట్యాబుల్లో రికార్డెడ్ క్లాసులు వినే వెసులుబాటు ఉండడం ఆనందంగా ఉంది. సబ్జెక్ట్కు మిస్ కాకుండా ఉంటుంది.
– ఏ అఖిల, ఎంపీసీ, మొదటి సంవత్సరం,
గురుకుల పాఠశాల (దుమాల)
కేటీఆర్ సాబ్కు రుణపడి ఉంటం
మా ఆయన తలీబ్ బస్టాండులో పండ్లు అమ్ముతడు. మాకు ఒక బాబు ఉన్నడు. మేం కిరాయి ఇంట్లో ఉంటున్నం. డబుల్ బెడ్రూం ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నం. ఆశ పడ్డట్లే డబుల్ బెడ్రూం వచ్చింది. ఇంతకు ముందే మాకు ఇల్లు ఇచ్చిన్రు. ఇయాల కేటీఆర్ సార్ చేతులమీదుగా పట్టా తీసుకోవడం దిల్ ఖుష్గా ఉన్నది. కేటీఆర్సాబ్కు రుణపడి ఉంటం.
– ఎండీ నజియా పర్వీన్, లబ్ధిదారురాలు
నా కల నెరవేరింది
మాది నిరుపేద కుటుంబం. మా ఆయన దివ్యాంగుడు. అద్దె ఇంట్లో ఉంటూ కష్టాలు వెల్లదీసినం. డబుల్ బెడ్రూం కు దరఖాస్తు పెట్టుకున్నం. కేసీఆర్నగర్లో డబుల్ బెడ్రూం ఇచ్చిన్రు. ఇప్పుడు అందులోనే ఉంటున్నం. నేను బీడీలు చుడుతూ మా ఆయనకు వచ్చే దివ్యాంగ పెన్షన్తో కుటుంబాన్ని వెల్లదీస్తున్న. ఇప్పుడు అద్దె భారం తప్పింది. మా సొంతింటి కల నెరవేరింది. మా జీవితంలో ఇల్లు వస్తుందని ఎన్నడూ అనుకోలేదు. కేసీఆర్ సార్, కేటీఆర్ సార్ దయతో ప్రభుత్వమే ఇల్లు ఇచ్చింది. ఇయాల కేటీఆర్ సార్ చేతుల మీదుగా పట్టా తీసుకోవడం జీవితంలో మరిచిపోలేను.
– దాసరి వినీత, లబ్ధిదారురాలు
మనసు మంచిగలేక అచ్చిన
మాది కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఖాజీపూర్. నాకు ఇద్దరు కొడుకులున్నరు. ఎవల పనిమీద ఆళ్లు పోతరు. నాకు మనుసు మంచిగలేక ఇంట్లకెయి అచ్చిన. ఎములాడ గుడికాడ 15 రోజులున్న. ఎల్లారెడ్డిపేటల ఆశ్రమం ఉందంటే ఉప్పోసోలె ఉంటదని సోమారం ఈడికచ్చిన. అన్నం పెట్టిన్రు, ఇప్పుడు టిఫిన్ గూడా పెట్టిచ్చిన్రు సౌలత్లు మంచిగున్నయ్.
– ఉల్లెందుల లక్ష్మీనర్సయ్య, ఖాజీపూర్,
కొత్తపల్లి మండలం (కరీంనగర్ జిల్లా)