సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 28: సిరిసిల్లలో సినీ బృందం సందడి చేసింది. జిల్లాకేంద్రానికి చెందిన బీవైనగర్కు చెందిన వెల్దండి వేణు దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్లో జిల్లాలోని మూరుమూల గ్రామాల్లో చిత్రీకరణ జరుపుకున్న ‘బలగం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రోగ్రాం మంగళవారం సిరిసిల్లలో అట్టహాసంగా జరిగింది. మానేరు తీరంలోని బతుకమ్మ ఘాట్ వేదికగా నిర్వహించిన కార్యక్రమానికి నటీనటులు ప్రియదర్శి, కావ్యాకళ్యాణ్రామ్తో పాటు దర్శకుడు వేణు, సినీ ప్రొడ్యూసర్ దిల్ రాజు, డీజే టిల్లు ఫేమ్ హీరో జొన్నలగడ్డ సిద్దు, చిత్ర నిర్మాతలు హర్షిత్రెడ్డి, హన్షిత, సినీప్రముఖులు, పట్టణ ప్రజలు భారీగా తరలిరాగా, ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.
సిరిసిల్లకు సినిమాను తెచ్చిన బలగం చిత్ర దర్శకుడు వెల్దండి వేణుకు అభినందనలు తెలిపారు. ఈ వేడుకలో తెలంగాణ ఫిల్మ్డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం, నటులు సుడిగాలి సుధీర్, రాంప్రసాద్, రచ్చ రవితో పాటు న్యాఫ్స్కాబ్ చైర్మన్ రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్ పాల్గొన్నారు.
కేసీఆర్తోనే మన భాషకు గుర్తింపు
ఒకనాడు తెలంగాణ యాస మాట్లాడాలంటేనే మొహమాటపడిన పరిస్థితులను మనం చూశాం. ఇప్పుడు అదే భాష, యాసను సినిమాలో చూపిస్తుంటే మనందరి హృదయాలు గర్వపడుతున్నాయి. దానికి కారణం సీఎం కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మిడ్మానేరు, అన్నపూర్ణ, కొండపోచమ్మ, మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ వంటి అనేక ప్రాతాలు సినిమా స్పాట్స్, చిత్రీకరణకు అవసరమైన సుందరదృశ్యాలుగా ఆవిష్కృతమయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బలగం సినిమా చిత్రీకరణ జరగడం, ఇందులో వేణు దర్శకత్వం వహించడం మనందరికీ గర్వకారణం. ఈ నెల3న విడుదల కాబోతున్న బలగం సినిమా భారీ విజయం సాధించాలి.