‘సీఎం కేసీఆర్ పాలనలో కుల వృత్తులన్నీ బాగుపడ్డాయి. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని కులాలను గౌరవించింది. గీత కార్మికుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. త్వరలోనే సిరిసిల్లలో నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. భవిష్యత్తులో మండల కేంద్రాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు చేస్తాం. జిల్లాకేంద్రంలో గౌడ సంఘం భవనానికి రెండెకరాల స్థలం కేటాయిస్తూ ప్రొసీడింగ్ పత్రాలు ఇప్పించాం. భవన నిర్మాణానికి నావంతుగా రూ.2 కోట్లు మంజూరు చేస్తా. నూతన టెక్నాలజీతో నిర్మిస్తున్న సేఫ్టీ మోకులను సిరిసిల్ల జిల్లాలో మొదటగా కేటాయిస్తాం.’ అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన సిరిసిల్లలో ఉత్సాహంగా పర్యటించారు. మరో మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి నర్సింగ్ కాలేజీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించి, ఆ తర్వాత ఎల్లమ్మ ఆలయం వద్ద గౌడ కమ్యూనిటీ ఫంక్షన్ హాల్కు శంకుస్థాపన చేశారు. మానేరువాగు కరకట్ట ప్రాంతంలో డబుల్ డెక్కర్ బోటును ప్రారంభించి, మానేరులో విహరించారు. సాయంత్రం పద్మనాయక కల్యాణ మండపంలో పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
– సిరిసిల్ల/ సిరిసిల్లటౌన్, ఆగస్టు 18
సిరిసిల్ల/ సిరిసిల్లటౌన్, ఆగస్టు 18 : సీఎం కేసీఆర్ పాలనలో అన్ని కులవృత్తులకు పెద్దపీట వేస్తున్నారని, తాతల నాటి వృత్తి పనులన్నీ బాగుపడ్డాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం సర్దార్ సర్వాయిపాపన్నగౌడ్ జయంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణం మొదటి బైపాస్ రహదారిలోని నర్సింగ్ కళాశాల చౌరస్తాలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయిపాపన్నగౌడ్ భారీ విగ్రహాన్ని మంత్రి శ్రీనివాస్గౌడ్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం పద్మనాయక కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసింది ఆత్మగౌరవ పోరాటమని, కేవలం పది మంది సైన్యంతో అంచెలంచెలుగా ఎదిగి గోల్కొండ ఖిల్లాపై జెండా ఎగురవేశారని, అదే పద్ధతిలో కేసీఆర్ తెలంగాణ పోరాటం చేసి అదే గోల్కొండ ఖిల్లాపై జెండాను ఎగురవేశారని గుర్తు చేశారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఒక కులానికి సంబంధించిన వాడు కాదని, అందరి వాడని స్పష్టం చేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని కులాలను గౌరవించిందని, గీత కార్మికుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నామన్నారు. నాడు సిరిసిల్లలో నీటి గోస ఉండేదని, సీఎం కేసీఆర్ జలదీక్షతో కోనసీమ, పాపికొండల్లా తలపిస్తున్నదని మంత్రి శ్రీనివాస్గౌడ్ తనతో అనడం సంతోషం కలిగించిందన్నారు. వేములవాడ నియోజకవర్గంలోని మల్కపేట రిజర్వాయర్ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారని, దీని ద్వారా సింగసముద్రం, బట్టల చెరువు ద్వారా ఎగువమానేరులోకి శాశ్వత జలకళ వస్తుందన్నారు. ఇప్పటికే మల్లన్నసాగర్ నుంచి కూడవెల్లి ద్వారా వేసవిలో సైతం ఎగువమానేరు మత్తడి దూకుతుందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జలవనరులు నిండు కుండలా మారుతున్నాయన్నారు. గోదావరి జలాల ఎత్తిపోతలతో పుష్కలంగా నీరు చేరి మత్స్య సంపద పెరిగి, పలు కులాలకు ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు. కులమతాలకు అతీతంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని, అన్ని కులాలకు కుటుంబ పెద్దగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యార్థులకు రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. బీసీ, ఎస్సీ విద్యార్థుల విదేశీ విద్యకు స్కాలర్షిప్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణేనని స్పష్టం చేశారు.
త్వరలోనే సిరిసిల్లలో నీరా కేఫ్
రాష్ట్ర ప్రభుత్వం నీరా కేఫ్ పాలసీని ప్రారంభించి అమలు చేస్తున్నదని, త్వరలోనే సిరిసిల్లలో నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. భవిష్యత్తులో మండల కేంద్రానికి విస్తరించడానికి ప్రణాళికలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా సిరిసిల్లలో జిల్లా గౌడ సంఘం భవనానికి రెండెకరాల స్థలం కేటాయిస్తూ ప్రొసీడింగ్ పత్రాలను జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గోవర్ధన్గౌడ్, ప్రధాన కార్యదర్శి బుర్ర నారాయణగౌడ్కు మంత్రి శ్రీనివాస్గౌడ్ చేతుల మీదుగా అందించారు. సంఘ భవన నిర్మాణానికి తనవంతుగా 2 కోట్లు మంజూరు చేస్తానని ప్రకటించారు. గీత వృత్తిని పెంచడానికి గ్రామాల్లో స్థలం ఉంటే సొసైటీలకు ఇవ్వడానికి కలెక్టర్కు వేదికపై నుంచి ఆదేశాలు జారీ చేశారు. ఈ స్థలాల్లో గిరిక తాళ్లను పెంచి వనాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. గీత కార్మికులకు చెట్ల పన్ను మినహాయింపు ఎక్స్గ్రేషియా చెల్లించాలని సూచించారు. నూతన టెక్నాలజీతో నిర్మిస్తున్న సేఫ్టీ మోకులను సిరిసిల్ల జిల్లాలో మొదటగా కేటాయిస్తామని ప్రకటించారు. జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడి వినతుల మేరకు వాగుల వెంట ఈత, తాటి వనాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
మేలు చేసినవారి వెన్నంటే ఉంటాం
సిరిసిల్లలో నేతన్న, గీతన్నలిద్దరికీ అవినాభావ సంబంధం ఉంటుంది. సమైక్య రాష్ట్రంలో నేతన్న, గీతన్నలు అష్టకష్టాలు పడ్డా ఆనాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఆంధ్రాలో కొబ్బరి చెట్లకు పైసలిచ్చిన ప్రభుత్వాలు తెలంగాణలో మనుషులు చనిపోయినా ఇవ్వలేదు. నాగరికత నేర్పిన కులవృత్తులను కేసీఆర్ ఆదరించారు. హైదరాబాద్లోని అత్యంత ఖరీదైన కోకాపేట ప్రాంతంలో 500 కోట్ల విలువైన 5 ఎకరాల స్థలాన్ని గౌడ సంఘ భవనానికి కేటాయించడం హర్షణీయం. మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం. ఇక్కడి ప్రజలు రాష్ట్రంలో ఎక్కడి కెళ్లినా గౌరవం దక్కే ఘనత ఆయన కల్పించారు. తమకు చేసిన మేలును కౌండిన్య వారసులుగా గౌడన్నలు మరిచిపోరు. ప్రభుత్వం వెన్నంటే ఉంటాం.
– రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్