జిల్లాలో కూలిన 355 ఇండ్లకు రూ. 11.63 లక్షల పరిహారం
నేడు పంపిణీ చేయనున్న అధికారులు
రాజన్న సిరిసిల్ల, జూలై 14 (నమస్తే తెలంగాణ) : వానలతో నష్టపోయిన బాధితులకు అమాత్యుడు కేటీఆర్ అండగా నిలిచారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్న 335 ఇండ్లకు రూ. 11, 63, 900 పరిహారాన్ని మంజూరు చేయించారు. ఇంత పెద్దమొత్తంలో పరిహారం మంజూరు చేయడం రాష్ట్రంలోనే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. కాగా, శుక్రవారం రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కలెక్టర్ కార్యాలయంలో బాధితులకు అందజేయనున్నారు.
దెబ్బతిన్న 335 ఇండ్లు ..
భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 335 ఇండ్లు దెబ్బతిన్నాయి. చందుర్తి మండలంలో ఒక ఇల్లు పూర్తిగా కూలిపోగా, 334 ఇండ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. పూర్తిగా కూలిపోయిన ఇంటి బాధిత కుటుంబానికి రూ. 95,100 గాను, 334 ఇండ్లకు మొత్తం రూ. 11లక్షల 63 వేల 900లు పరిహారం అందించనున్నారు. సిరిసిల్ల మండలంలో 39 ఇండ్లకు రూ.1,24,800, తంగళ్లపల్లి మండలంలో 19 ఇండ్లకు రూ. 60,800, ముస్తాబాద్లో 23 ఇండ్లకు రూ. 73,600, గంభీరావుపేట లో 29 ఇండ్లకు రూ. 92,800, ఎల్లారెడ్డిపేటలో 63 ఇండ్లకు రూ. 2,01,600, వీర్నపల్లిలో 31 ఇండ్లకు రూ. 99,200, కోనరావుపేటలో 14 ఇండ్లకు రూ. 44,800, చందుర్తి లో 16 ఇండ్లకు రూ. 51,200, రుద్రంగి మండలంలో 7 ఇండ్లకు రూ. 22,400, వేములవాడ అర్బన్ లో 43 ఇండ్లకు రూ. 1,37.600, వేములవాడ రూరల్ లో 7ఇండ్లకు రూ. 22,400, బోయినపల్లిలో 12 ఇండ్లకు రూ. 38,400, ఇల్లంతకుంట మండలంలో 31 ఇండ్లకు రూ. 99,200 చొప్పున పరిహారం మంజూరైంది.