వేములవాడ, జూన్ 27: వేములవాడ పట్టణంలో చేపట్టనున్న రూ.100 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన, భూమి పూజకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు మంగళవారం వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి పనులపై అమాత్యుడితో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు హైదరాబాద్లోని సచివాలయం లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చర్చించిన అంశాలను వివరించారు. నియోజకవర్గంలో ఇప్పటికే ప్రారంభమైన అభివృద్ధి పనులు ఆగస్టు చివరిలోగా పూర్తిచేసేలా చూడాలని, చేపట్టాల్సిన కొత్త పనులను కూడా జూలైలోగా ప్రారంభించాలని మంత్రి ఆదేశాలిచ్చారని చెప్పారు.
ముంపు గ్రామాల సమస్యలన్నింటినీ కలెక్టర్తో సమావేశమై పరిషరించుకోవాలని సూచించినట్లు వివరించారు. కలికోట సూరమ్మ ప్రాజెక్టు తుది కోసం చర్చించినట్లు చెప్పారు. రూ.ఐదు కోట్లతో చేపట్టే పనులు ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయని, మంగళపల్లి, లింగంపేట, మామిడిపల్లి, బావుసాయిపేట్- వెంకట్రావుపేట మధ్య వంతెనలు, గోవిందారం డబుల్ రోడ్డు, మోహన్రావు పేట- దేశాయిపేట డబుల్రోడ్డు, ప్రతి గ్రామానికి 30 లక్షల నిధులు కూడా అందుబాటులో ఉన్నాయని వాటిని విడుదల చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. వేములవాడలో ఉన్న 1200 కుటుంబాల ఇంటి సమస్యను తొలగిస్తామని, అందులో 800 మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు, 400 మందికి నివాసాల పట్టాలు అందజేస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దళితబంధు పథకం ద్వారా 1100 మంది లబ్ధిదారులను అత్యంత పారదర్శకంగా ఎంపిక చేయాలని మంత్రి సూచించారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా వేములవాడ నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేసి ఎన్నికల్లో మరోసారి విజయానికి అన్ని కార్యక్రమాలు ముందుండి నిర్వహించాలని మంత్రి కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.