జగిత్యాల, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజకీయ వ్యవస్థకు కలంకంగా మారాడని, 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఇంతటి దుర్మార్గమైన రాజకీయ నాయకులెరెవరూ లేరని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, వృద్ధులు, దివ్యాంగులు, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో గురువారం రాత్రి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాజకీయాల్లో నీచాతి నీచమైన పద్ధతులు, దుర్మార్గాలకు బండి సంజయ్ తెరలేపారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ వ్యవస్థను కలుషితం చేస్తున్నాడంటూ దుయ్యబట్టారు. బండి సంజయ్ మొదలు పెట్టిన నీచ సంస్కృతి, ఇష్టారాజ్య ఆరోపణల వ్యవస్థ రానున్న రోజుల్లో ఒక దరిద్రమైన పద్ధతిగా మారిపోయే ప్రమాదం ఉందన్నారు.
రాజకీయాలంటే విలువలతో కూడినవని, అందుకు భిన్నంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏది పడితే అది మాట్లాడుతున్నాడని, నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడడం సిగ్గుచేటని హితవుపలికారు. సీఎం కేసీఆర్ బుధవారం కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని పరిశీలించి, మూడున్నర గంటల పాటు కొండగట్టు క్షేత్రంపై సమీక్షా సమావేశం నిర్వహించి, అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలని, కొండగట్టు అభివృద్ధికి అవసరమైతే రూ.వెయ్యి కోట్లనైనా మంజూరు చేస్తారని ప్రకటిస్తే.. బండి సంజయ్ ఈ విషయపై నీచంగా మాట్లాడడం అత్యంత అసహ్యంగా ఉందన్నా రు. కొండగట్టు పవిత్ర పుణ్యక్షేత్రమని, తెలంగాణ, ఆంధ్రా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తారని, అలాంటి క్షేత్ర అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని సీఎం ప్రకటిస్తే, దాన్ని విమర్శించడం ఎంత వరకు సబబు అంటూ ప్రశ్నించారు.
ఆలయ అభివృద్ధి కోసం పర్యటిస్తే, నీచంగా బంధువుల భూములు ఉన్నాయని అందుకే నిధులు అన్నారంటూ అసహ్యకరమైన ఆరోపణలు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకే ఆలయాల అభివృద్ధి ప్రారంభమైందని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయాలకు నేరుగా నిధులను కేటాయించి, వాటిని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. బాసర, భధ్రాది రామయ్య క్షేత్రం, వేములవాడ, ధర్మపురి వంటి పుణ్యక్షేత్రాలకు వేలాది కోట్ల రూపాయలు మంజూరు చేసి, వాటిని అభివృద్ధి చేస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. యాదగిరి పుణ్యక్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, ప్రపంచంలోనే గొప్ప పుణ్యక్షేత్రంగా, మరో తిరుపతిలా మార్చిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందన్నారు. ఆలయాల్లో ఎలా అభివృద్ధి జరుగుతుందో చూడాలని అనుకుంటే ధర్మపురికి రావాలని, రూ.వందల కోట్ల నిధులతో జరుగుతున్న అభివృద్ధి కనిపిస్తుందని హితవుపలికారు. పొద్దున లేచినప్పటి నుంచి దేవుడి పేరుతో రాజకీయాలు చేసే బండి సంజయ్, రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ఒక్క రూపాయైనా తెచ్చారా? అంటూ ప్రశ్నించారు.
జై శ్రీరామ్ అని నినాదాలు చేసే బీజేపీ రాముడు నడిచిన భధ్రాది అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ఊ అంటే భాగ్యలక్ష్మి టెంపుల్ అంటూ మాట్లాడే బండి సంజయ్, ఆ ఆలయ అభివృద్ధికి ఏం నిధులు తెప్పించారో చెప్పాలని ప్రశ్నించారు. కొండగట్టు అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేస్తుంటే, కడుపు మంటతో తప్పుడు ఆరోపణలు చేసిన బండి సంజయ్, అంజన్న భక్తులను అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంజన్న భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ఆయన భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
“కొండగట్టు అభివృద్ధికి మేం నిధులు ఇవ్వం.. నువ్వు తీసుకువస్తావా?.. కొండగట్టు అభివృద్ధిని ఆపేయమంటావా?.. ఆలయ అభివృద్ధికి నువ్వు వ్యతిరేకమా? చెప్పాలి. దమ్ముంటే కొండగట్టుకు వచ్చి సమాధానం ఇవ్వాలి” అని బండి సంజయ్కి సవాల్ విసిరారు. మతిభ్రమించిన ఉన్మాదిలా వ్యవహరిస్తున్న ఆయనకు ప్రజలు బుద్ది చెబుతారన్నారు. బండి సంజయ్ మాట్లాడే భాష చూసి, ఆయనలాగే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ లాంటి వాళ్లు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మివేస్తూ, పబ్లిక్ సెక్టార్ను నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. పేదలకు బుక్కెడు బువ్వ పెట్టే ఎన్ఆర్ఐజీని, ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించి పేదల నోటికి ముద్ద అందకుండా చేస్తుందన్నారు. పేదలను కొట్టి, తమ స్నేహితులైన అదాని, అంబానిలకు దేశాన్ని దోచిపెడుతుందని ధ్వజమెత్తారు. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ, పత్రిక, మీడియా రంగాలపై సైతం ఆంక్షలు విధిస్తున్న కేంద్ర ప్రభుత్వ తప్పులను ప్రజలు లెక్కిస్తున్నారని చెప్పారు. ప్రజాబాహుళ్యంలో బీజేపీకి భంగపాటు తప్పదు అంటూ హెచ్చరించారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్గౌడ్, జగిత్యాల ఇన్చార్జి మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, డీసీఎంస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు బాదినేని రాజేందర్, టీఆర్ఎస్ పట్టణశాఖ అధ్యక్షుడు గట్టు సతీశ్ పాల్గొన్నారు.