కరీంనగర్ : తెలంగాణ ఏర్పడిన తరువాత గడిచిన 10 ఏళ్లలో రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి చెందిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు అభివృద్ధి, సంక్షేమం కనబడడం లేదని వారు కండ్లున్న కబోదులని ఎద్దేవా చేశారు. కరీంనగర్లోని పీవీఆర్ ప్లాజా ఫంక్షన్హాల్లో జరిగిన మంథని నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ ( BRS ) కార్యకర్తల శిక్షణా కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.
40 ఏండ్ల కాంగ్రెస్ ( Congress ) పాలనలో ప్రాజెక్టులు కట్టలేదని, కరెంటు ఇవ్వలేదని, వ్యవసాయాన్ని అసలుకే పట్టించుకోలేదని విమర్శించారు. వారికి పాలన చేయడం చేతకాదని అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR ) నాయకత్వంలో ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేశామని, నీళ్లు, కరెంటు కష్టాలు తీర్చామని, మన ఊరు మనబడి పేరుతో పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించామన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఏమైనా నెగిటివ్ ఉందో చూపించాలని ప్రతిపక్ష నాయకులను ప్రశ్నించారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గెలుపే లక్ష్యంగా గులాబీ దండు పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈసారి మంథని గడ్డపై గులాబీ జెండా ఎగురడం ఖాయమని అన్నారు. సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, అన్నివర్గాలకు లబ్ధి జరిగేలా ఆలోచన చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలంటే కేసీఆర్ లాంటి నాయకుడు ఉండాలని అన్నారు. దేశంలోనే అత్యధిక ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వమేనని చిన్న జిల్లాలు, మండలాలు, గ్రామాలు, మున్సిపాలిటీల ఏర్పాటుతో ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని పేర్కొన్నారు.
తెలంగాణ వస్తే కరెంటు, నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని నాడు సీఎం కిరణ్కుమార్రెడ్డి అన్నారని, నేడు రైతులకు 24గంటల కరెంటు బదులు మూడు గంటలు చాలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆరోపించారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే ప్రాజెక్టు ప్రయోజనాలను చూడకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు తిప్పి కొట్టాలని సూచించారు. మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, భూపాల పల్లి జిల్లా పరిషత్ చైర్మన్ జక్కు శ్రీహర్షిణీ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.