ధర్మపురి, జూలై 26: ఆపదలో ఉన్న పేదలకు రాష్ట్ర సర్కారు ఎల్లప్పుడూ అండగా ఉంటున్నదని, వివిధ పథకాల ద్వారా సాయం అందిస్తూ ఆదుకుంటున్నదని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ధర్మపురి మండలం దోనూర్ గ్రామానికి చెందిన ఆర్ మంజుల అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతూ సహాయం కోసం మంత్రిని ఆశ్రయించగా.. ఆయన స్పందించి ఆదుకున్నారు. నిమ్స్ హాస్పిటల్లో మెరుగైన చికిత్స కోసం రూ.2.50 లక్షల విలువైన ఎల్వోసీని మంజుల కుటుంబ సభ్యులకు మంగళవారం హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో కార్పొరేట్ వైద్యశాలలో చికిత్స చేయించుకున్న పేదలకు ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్య ఖర్చులు చెల్లిస్తున్నదన్నారు. అలాగే ముందుగా వైద్యశాల ఖర్చులు చెల్లించుకోలేని వారికి లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్వోసీ)అందజేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధికి వచ్చిన దరఖాస్తులను అధికారులు వెనువెంటనే పరిశీలించి లబ్ధిదారుల పేరున చెక్కులు సిద్ధం చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారు కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్తో పాటు మంత్రి ఈశ్వర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.