జగిత్యాల టౌన్, అక్టోబరు 7: ‘జిల్లా ఏర్పాటుతోనే సమూల మార్పులు వచ్చాయి.. సర్కారు మంజూరు చేస్తున్న నిధులతో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి’ అంటూ రాష్ట్ర ఎస్సీ, దివ్యాంగ, వృద్ధుల సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాకు మెడికల్కాలేజీ రావడంతో విప్లవాత్మక మార్పులు వస్తాయని చెప్పారు. నిరుపేదలకు నాణ్యమైన వైద్యమందే అవకాశం ఉంటుందన్నారు. ఈ ప్రాంతానికి చెందిన చాలామందికి డాక్టర్లయ్యే అవకాశం కలుగుతుందని చెప్పారు. గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్క్యాంపులో జిల్లా గ్రంథాలయ నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, జిల్లా కలెక్టర్ జీ రవి, స్టేట్ ఫైనాన్స్ చైర్మన్ రాజేశంగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్గౌడ్తో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా ఏర్పాటుతో నేడు మనం అనేక మార్పులు చూడగలుగుతున్నామని, గ్రంథాలయ భవ నం కావచ్చు, కొత్త కలెక్టరేట్ కావచ్చు ఏ అభివృద్ధి కార్యక్రమైనా చేసుకుంటున్నామనంటే జగిత్యాల జిల్లా కావడమే కారణమన్నారు.
ప్రస్తుతం జిల్లాలో అన్ని హంగులు సమకూర్చుకుంటున్న తరుణంలో ఒక మంచి గ్రంథాలయాన్ని ఏర్పాటుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు మంజూరు చేయడం హర్షనీయమన్నారు. గ్రంథాలయ భవనాన్ని 14 గుంట స్థలంలో రూ.99 లక్షలతో ఈ రోజు నిర్మాణం చేసుకోబోతున్నామని చెప్పారు. త్వరలోనే భవనాన్ని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి వచ్చేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత సూచన మేరకు మంత్రి కేటీఆర్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారన్నారు. చదువు ప్రాముఖ్యత తెలిసిన జిల్లా కలెక్టర్ నేతృత్వంలో నూతన భవనాన్ని పూర్తి చేస్తామన్నారు. బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరగానే బీసీ స్టడీ సర్కిల్ మంజూరు చేశారని, ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాల జగిత్యాలకు ఒక తలమానికంగా నిలుస్తుందన్నారు. నర్సింగ్ కళాశాలకు సుమారు రూ. 20 కోట్లు వెచ్చించామన్నారు. వైద్య కళాశాలకు రూ. వందల కోట్లు మంజూరు చేయడంతో 230 పడకల అదనపు దవాఖానను నిర్మించుకొనే అవకాశం కలిగిందన్నారు. వైద్యుల నియామకం, ఇతర సౌకర్యాల కల్పన కోసం మరో రూ. 130 కోట్లు మంజూరయ్యాయన్నారు. ప్రధానంగా వ్యవసాయ ప్రాంతమైన జగిత్యాలలో వ్యవసాయ కళాశాల అరకొర వసతులతో ఉండేదన్నారు. దీనికి రూ. 21 కోట్లు కేటాయిందచి అత్యాధునికమైన అన్ని వసతులు కల్పించామన్నారు.
హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఏ క్లాస్ జరిగితే అది ఇక్కడ మన విద్యార్థులకు, శాస్త్రవేత్తలకు పరిజ్ఞానం అందే విధంగా ఏర్పాటు చేసుకున్నామన్నారు. జిల్లా కేంద్రంలో సరైన వృత్తి విద్యా కోర్సుల కళాశాలలు లేనందున వాటిని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ను కోరారు. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రైవేటు కళాశాలకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రతి సంవత్సరం సుమారు రూ. 12 కోట్లు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఎస్టీ విద్యార్థుల కోసం పోస్టు మెట్రిక్ బాయ్స్ హాస్టల్ లేదు కావున దాన్ని మెడికల్ కళాశాల వద్దనే స్థలాన్ని కలెక్టర్తో కలిసి చూశామన్నారు. దీనికి కూడా త్వరలోనే భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. కలెక్టరేట్ సమీపంలోనే ప్రెస్ క్లబ్ భవనాన్ని ఏర్పాటు చేయడానికి మంత్రిని, కలెక్టర్ను కోరుతున్నానన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి కోరిక మేరకు డీసీఎంఎస్ భవనం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. స్టేట్ ఫైనాన్స్ చైర్మన్ రాజేశంగౌడ్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాకు జాతీయ స్థాయి అవార్డు రావడానికి కృషి చేసిన జిల్లా కలెక్టర్ రవి, మంత్రి కొప్పుల ఈశ్వర్లకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్గా డాక్టర్ చంద్రశేఖర్గౌడ్ పదవి చేపట్టిన సంవత్సరంలోనే నూతన భవన నిర్మాణాన్ని చేపడుతున్నందున వారికి ధన్యవాదాలు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ రూ. కోటితో నూతన గ్రంథాలయ భవన నిర్మాణం చేసుకోవడం సంతోషకరమన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ డాక్టర్ ఎల్లా శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణంతో విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్గౌడ్ మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ భవనాన్ని 14 గుంటల స్థలంలో రూ. 99 లక్షలతో నిర్మాణం చేపట్టడం సంతోషకరమన్నారు. ఇప్ప టి వరకు రూ.1.80 కోట్ల సెస్ను సేకరించుకున్నామన్నారు. ప్రస్తుతం కొడిమ్యాల, మల్లాపూర్, ఇబ్రహీపట్నంలో గ్రంథాలయాల ఏర్పాటుకు ఫండ్ కేటాయించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మాధురి, మున్సిపల్ కమిషనర్ గంగాధర్, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీ పాల్గొన్నారు.