ధర్మపురి, సెప్టెంబర్ 7 : కాంగ్రెస్, బీజేపీ పాలి త రాష్ర్టాల్లో అమలుకు సాధ్యంకాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని, వాళ్లు రేపు మనలను కూడా మోసం చేయడానికి వస్తారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి, నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ సూచించారు. ఆ రెండు పార్టీల నాయకుల బోగస్ మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో ఆదర్శంగా నిలుస్తున్నదని, పనిచేసే బీఆర్ఎస్ సర్కారును ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ దెబ్బకు రాష్ట్రంలో కాంగ్రేస్, బీజేపీలు దాదాపుగా ఖాళీ అవుతున్నాయని, ఊరికి ఒకరిద్దరు మోపయ్యారని, వాళ్లకు బుద్ధి చెపాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. గతంలో ధర్మపురి పట్టణం వసతులలేమితో కళావిహీనంగా ఉండేదని, కానీ, స్వరాష్ట్రంలో సకల హంగులతో శోభిల్లుతున్నదని పేర్కొన్నారు. ధర్మపురిని అభివృద్ధి ఘనత బీఆర్ఎస్ సర్కారుకే దక్కుతుందన్నారు. గురువారం ఆయన ధర్మపురి లక్ష్మీనృసింహుడి సన్నిధిలో పూజలు చేశారు. అనంతరం పట్టణంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొన్నారు. గుండయ్యపల్లి, ఎస్సీ కాలనీ, సంగివాడ, గంపల వాడ, కుమ్మరివాడ, ముదిరాజ్కాలనీ, కాశెట్టివాడ, బోయవాడ, బ్రాహ్మణవాడ, వివేకానంద చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా తదితర వార్డుల్లో కాలినడకన కలియదిరిగారు. ఆయాచోట్ల మహిళలు మంగళహారతులు, బతుకమ్మలతో సాదర స్వాగతం పలికారు. ప్రజలను ఆప్యాయంగా పలుకరిస్తూ ముందుకుసాగారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ, బీఆర్ఎస్ మరోసాకి అధికారంలోకి వస్తే బంగారు తెలంగాణ పరిపూర్ణమవుతుందన్నారు. యాదాద్రి తరహాలో ధర్మపురి క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారని, ఇప్పటికే 110 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. అలాగే ధర్మపురి మున్సిపాలిటీకి 35 కోట్లు కేటాయించామని, ప్రస్తుతం 145 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. తొమ్మిదేండ్లలో నియోజకవర్గ అభివృద్ధికి 1600 కోట్లు కేటాయించామని, ఒక్క ధర్మపురికే 300 కోట్లు వెచ్చించామని చెప్పారు. ధర్మపురిలో ఏటా వానకాలంలో తీరప్రాంత వాసులు గోదావరి వరదనీటితో ఇబ్బందులు పడుతున్నారని, నీరు ఇండ్లకు చేరడం వల్ల ఇండ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సివస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం గోదావరి ఒడ్డున బలమైన రక్షణగోడ (కరకట్ట) నిర్మిస్తామన్నారు. అలాగే ధర్మపురి నుంచి గోదావరిలో మురుగునీరు కలువడంతో భక్తులు స్నానాలు చేసే చోట ఇబ్బందులు పడ్డారని. ఈ క్రమంలో 6.50 కోట్లు వెచ్చించి మహా డ్రైనేజీని నిర్మించామన్నారు. పట్టణ నడిబొడ్డున మురికి కూపంలా ఉన్న చింతామణి చెరువును 1.30 కోట్లు వెచ్చించి సుందరీకరించామన్నారు. ఒకప్పుడు పట్టణవాసులు, భక్తులు చింతామణి చెరువు వద్దకు వెళ్లడానికే ఇబ్బంది పడే పరిస్థితి నుంచి నేడు ఆహ్లాదకరంగా తయారైందన్నారు. పట్టణంలో కూడళ్లనింటినీ సుందరీకరించామన్నారు. 4కోట్లతో ఇంటిగ్రేటేడ్ మార్కెట్ను నిర్మించుకున్నామన్నారు.
ఈ మార్కెట్ అభివృద్ధికి మరో 2.50 కోట్లు మంజూ రు చేశామని చెప్పారు. మరో మురికి కూపం తమ్మళ్లకుంటను కూడా 65 లక్షలతో సుందరీకరించామన్నారు. పట్టణానికి మిషన్ భగీరథ నీటి అందిస్తూనే 2 కోట్లతో బోలిచెరువు రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించుకున్నామన్నారు. 6కోట్లతో పట్టణ పరిధిలో జాతీయ రహదారిని నాలుగువరుసల రహదారిగా తీర్చిదిద్దామని చెప్పారు. ధర్మపురి క్షేత్రానికి వచ్చే భక్తులకు ఘన స్వాగతం పలికేలా రాయపట్నం, నర్సయ్యపల్లి స్టేజీల వద్ద అందమైన ఆర్చ్గేట్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ధర్మపురి నుంచి జైన, దొంతాపూర్ వరకు డబుల్ రోడ్డు నిర్మించామన్నారు. పట్టణంలో ప్రతీవార్డు అభివృద్ధిపై దృష్టిసారించి సీసీరోడ్డు, మురుగుకాలువల నిర్మాణాలు చేపట్టామన్నారు. కమలాపూర్రోడ్డు, నక్కలపేట రోడ్డు వైపుగల ఇందిరమ్మకాలనీలో సీసీరోడ్లు, డ్రైనేజీలు నిర్మించామన్నారు. అక్కపెల్లి చెరువును గోదావరి నీటితో నింపేందుకు ఎత్తిపోతల పథకం కోసం 76కోట్లు మంజూరు చేశారని, పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు.
విద్యారంగానికి పెద్దపీట
ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసిందని మంత్రి అన్నారు. పట్టణంలో 1.70 కోట్ల ఈఐ నిధులతో నిర్మించిన ఎస్టీ హాస్టల్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్పొరేట్ స్థాయిలో విద్యనందించే లక్ష్యంతో గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు స్థాపించిన ఘనత బీఆర్ఎస్ సర్కారుకే దక్కిందన్నారు. ‘మన ఊరు- మన బడి’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని చెప్పారు. సంక్షేమ వసతి గృహాల్లో సదుపాయాలు మెరుగపడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎమ్మెస్ చైర్మన్ డా.ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, జడ్పీటీసీ బత్తిని అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ సత్తెమ్మ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, ఏఎంసీ వైస్ చైర్మన్ అక్కనపల్లి సునీల్కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు అనంతుల విజయలక్ష్మి-లక్ష్మణ్, వొడ్నాల ఉమాలక్ష్మి-మల్లేశం, సయ్యద్ యూనుస్, తిర్మందాసు అశోక్, అయ్యోరి వేణు, తరాల్ల కార్తీక్, పురాణపు కిరణ్మయి-సాంబమూర్తి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు అలీమ్, వసంత్, ఉజ్మాతబుస్సమ్-షబ్బీర్, దేవస్థానం రెనోవేషన్ కమిటీ సభ్యులు ఇనుగంటి రమావేంకటేశ్వరరావ్, గునిశెట్టి రవీందర్, చుక్క రవి, వేముల నరేశ్, సురేందర్, సురేశ్, పద్మశ్రీనివాస్, గిరిజన సంక్షేమశాఖ డీఈ మధు, డీటీడీవో జనార్దన్, తదితలు ఉన్నారు.