జగిత్యాల, జూలై 4 : పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు లబ్ధి చేకూర్చాలనే తపనతో సీఎం కేసీఆర్ పట్టాల పంపిణీ చేపట్టారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, దివ్యాంగులు, వృద్ధులు, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాల జిల్లాలో పోడు భూముల పంపిణీ కార్యక్రమం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, కలెక్టర్ యాస్మిన్ బాషా ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ.. పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు పట్టాలను అందజేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 1.51లక్షల మంది గిరిజన రైతులకు ఈ నిర్ణయంతో లబ్ధి చేకూరుతుందన్నారు. పట్టాల పంపిణీతో రైతుబంధు, రైతు బీమా, బ్యాంకు ద్వారా వచ్చే లోన్లు పొందవచ్చని తెలిపారు. ఇక ముందు కూడా సర్వే చేసి అర్హులైన రైతులకు పోడు పట్టాలు అందజేస్తామని చెప్పారు.
పట్టాల పంపిణీ విషయంలో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, ప్రజా సేవకులు ఎవరో గుర్తించాలని గిరిజనులకు సూచించారు. అటవీ భూములకు పట్టాలు ఇవ్వడం సాహసోపేత నిర్ణయమని, పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న వారి సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం చేసిందన్నారు. అనంతరం జిల్లాలోని 15 మంది రైతులకు 19.22 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి పట్టాదార్ పాస్బుక్లను అందించారు. అంతకుముందు తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 76వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి కొప్పుల, ఎమ్మెల్యేలు పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్లు, గిరిజన సంక్షేమాధికారి, తదితరులు పాల్గొన్నారు.
చరిత్రలో నిలిచిపోతుంది
పోడు పట్టాల పంపిణీ చరిత్రలో లేదు. సీఎం కేసీఆర్ చేసి చూపించారు. పట్టాలు అందుకున్న గిరిజనులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు వర్తిస్తాయి. జగిత్యాల నియోజకవర్గంలోని సారంగాపూర్, బీర్పూర్ గ్రామాల్లో అటవీ భూములపై అటవీ అధికారులు, రెవెన్యూ అధికారులకు సమస్యలు వచ్చాయి. వీటికి శాశ్వత పరిష్కారం చూపాలి.
– డాక్టర్ సంజయ్కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే
ఇదో సువర్ణ అధ్యాయం
గిరిజనులు ఎన్నో ఏండ్ల నుంచి పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు. పట్టాలు ఇవ్వాలని అడుగుతున్నారు. కానీ, నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలించింది. గిరిజనులకు పట్టాలు పంపిణీ చేసింది. ఇది రాష్ట్రంలోనే సువర్ణ అధ్యాయం. నిజమైన లబ్ధిదారులను ఎన్నుకున్న అధికార యంత్రాంగానికి అభినందనలు.
– విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే
అభినందనీయం
ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. గిరిజనులకు పట్టాలు పంపిణీ చేయడం అభినందనీయం.
– దావ వసంత, జడ్పీ చైర్పర్సన్ (జగిత్యాల)