ధర్మపురి, ఆగస్టు20 : యువత అందదండలతోనే రాష్ట్రం పురోగతి సాధించిందని, యువత తీసుకునే నిర్ణయాలు భావితరాలకు మార్గదర్శకంగా ఉండాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. హైదరాబాద్లో స్థిరపడిన ధర్మపురి నియోజకవర్గ యువతతో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం టూరిజం ప్లాజాలో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. తెలంగాణ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, విద్యా విధానం, నియోజకవర్గ స్థితిగతులపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సంక్షేమం, అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిందని కొనియాడారు. ముఖ్యంగా రాష్ట్రంలో యువత అందదండలతో ఇది సాధ్యమైందని అభిప్రాయపడ్డారు.
యువత నిర్ణయాలతోనే ప్రజల్లో మార్పు వస్తుందని, నాయకులు ఎకడ గొప్పగా ఆలోచన చేస్తారో అకడ అభివృద్ధి ఉంటుందని, అందుకు యువత ప్రోత్సాహం కూడా ఉపయోగపడుతుందని మంత్రి వివరించారు. గత పాలకులు పల్లె సీమల అభివృద్ధిని విస్మరించారని, ఇది గుర్తించిన సీఎం కేసీఆర్ పెరిగిన జనాభాకు అనుగుణంగా జిల్లాల సంఖ్య పెంచి మౌలిక సదుపాయాలు కల్పించారని వివరించారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచారని చెప్పారు. గతంలో ఆదరించిన విధంగా రాబోయే ఎన్నికల్లో యువత అంతా సహకరించాలని కోరారు. అనంతరం యువతతో కలిసి భోజనం చేశారు. సమ్మేళనంలో ధర్మపురి నియోజకవర్గానికి చెందిన యువకులు కుంటాల రమేశ్, గంగాధర్, అశోక్, భాగ్య, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.