గోదావరిఖని, జనవరి 24 : రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన గోదావరిఖనిలో ఎంపీ వెంకటేశ్నేతకాని, ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా పట్టణంలోని చౌరస్తాలో రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి నిధులు రూ.1.16 కోట్లతో ‘ఖని’ ప్రధాన చౌరస్తా, రాజేశ్ థియేటర్ తీన్ రాస్తాలో సుందరీకరణ పనులను ప్రారంభించారు. చౌరస్తాలో అమరవీరుల స్తూపాన్ని ప్రారంభించి, తీన్రాస్తాలో ఏర్పాటు చేసిన జ్యోతిరావుఫూలే విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, ఉపకరణాలు, మహిళలకు కుట్టుమిషన్లు అందజేశారు. సామూహిక అక్షరాభాస్యం వాల్పోస్టర్ అవిష్కరించి, జీవో 76 ద్వారా ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి మాట్లాడారు. దివ్యాంగులకు అత్యధిక పెన్షన్ ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిపోతుందన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జీవో నెంబర్ 76 ద్వారా ఇళ్ల పట్టాలు అందించామని, దీని ద్వారా ఆ స్థలాలకు బ్యాంకు రుణాలు వచ్చే అవకాశముంటుందన్నారు. నియోజకవర్గంలో 500 మంది దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లు అందించే కార్యక్రమంలో భాగంగా మంగళవారం మొదటి విడతలో 70 మందికి అందించినట్లు చెప్పారు.
ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని అనతికాలంలోనే దేశానికి దిక్సూచిగా నిలిపిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. తెలంగాణ రాష్ర్టాన్ని చిన్నాభిన్నం చేసేందుకు ప్రయత్నించడం, సింగరేణిని పూర్తిగా నిర్వీర్యం చేసేలా 4 బొగ్గు బ్లాకులను వేలం వేయాలని చూస్తున్న బీజేపీపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. బీజేపీ ప్రజావ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరూ ఎండగట్టాలని, పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా ప్రజలను జాగృతం చేసేందుకు, బీజేపీని గద్దె దించేందుకు బీఆర్ఎస్ కృషి చేస్తున్నదని చెప్పారు. మంగళవారం ఎమ్మెల్యే చందర్ ఆధ్వర్యంలో గోదావరిఖని టీబీజీకేఎస్ కార్యాలయంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి బెంద్రం రాజిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు దాసరి ఆనంద్, కాంగ్రెస్ నాయకులు మెరుగు చంద్రమౌళి ఆధ్వర్యంలో సుమారు 800 మంది నాయకులు బీఆర్ఎస్లో చేరగా, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్నేత హాజరై బీఆర్ఎస్ కండువాలు కప్పి ఆహ్వానించి, మాట్లాడారు. బీఆర్ఎస్లో చేరిన నాయకులకు తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎనిమిదేండ్లలోనే ఎన్నో అద్భుతాలు జరిగాయని, ప్రజలకు మౌళిక వసతులతో పాటు ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయన్నారు. ఇక్కడ రామగుండం మేయర్ బంగి అనిల్కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్రావు, జడ్పీటీసీ అముల నారాయ్ణ, నాయకులు మూల విజయారెడ్డి, పీటీ స్వామి, పాతిపెల్లి ఎల్లయ్య, తోడేటి శంకర్గౌడ్, టీబీజీకేఎస్ నాయకులు కెంగర్ల మల్లయ్య, మిర్యాల రాజిరెడ్డి, కార్పొరేటర్లు ఇంజపురి పులేందర్, పెంట రాజేశ్, కుమ్మరి శ్రీనివాస్, రమణరెడ్డి, దొంత శ్రీనివాస్, కల్వచర్ల క్రిష్ణవేణి, దాతు శ్రీనివాస్, కవిత సరోజిని, సాగంటి శంకర్, పాముకుంట్ల భాస్కర్, బాలరాజ్కుమార్, అయిత శివకుమార్, నాయకులు అడ్డాల రామస్వామి, మెతుకు దేవరాజు, నూతి తిరుపతి, అచ్చే వేణు, నారాయణదాసు మారుతి, పర్లపల్లి రవి, మండ రమేశ్, మేకల పోశం, బొడ్డు రవీందర్, శ్రీనివాస్, సంజీవ్, బేగ్, బాలరాజు, మోహిద్ సన్నీ, కళావతి, శాంతలక్ష్మి, నాగలక్ష్మి, చంద్రకళ ఉన్నారు.
‘ఖని’ చరిత్రలోనే నిలిచిపోయే రోజు
ఉద్యమాల పురిటిగడ్డగా పేరుగాంచిన గోదావరిఖని చౌరస్తాలో ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్తూపం చరిత్రలో నిలిచిపోతుందని, ఈరోజు మరచిపోలేనిదని మంత్రి కొప్పుల పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సింగరేణి కార్మికులు 45 రోజుల సమ్మె చేశారని, ఎన్నో పోరాటాలు చేశారని, వాటన్నింటికీ గుర్తుగా అమరవీరుల స్తూపం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని మాట్లాడుతూ 14 ఏళ్లపాటు అలుపెరుగని పోరాటం చేసిన కేసీఆర్కు ఆనాడు కొప్పుల ఈశ్వర్, కోరుకంటి చందర్ వెన్నంటి ఉన్నారని, తెలంగాణ కోసం ఎంతో కొట్లాడారని గుర్తు చేశారు. గోదావరిఖని నడిబొడ్డున అమరవీరుల స్తూపం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.
సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి, సంక్షేమం : ఎమ్మెల్యే
సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతోందని, మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో రామగుండంను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తున్నట్లు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. తెలంగాణ అమరవీరుల కోసం ఖని చౌరస్తాలో స్తూపాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దీనిని తాను జీవితాంతం మరచిపోలేని రోజుగా గుర్తుంచుకుంటానన్నారు. నియోజకవర్గంలో దివ్యాంగుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో రామగుండం మేయర్ బంగి అనిల్కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్రావు, జిల్లా సంక్షేమాధికారి రవూఫ్, టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
తెలంగాణ పాటతో దుమ్మురేపిన ఎమ్మెల్యే
తెలంగాణ అమరవీరుల స్తూపం ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి ఉద్వేగానికి లోనయ్యారు. ఉద్యమం నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ‘జై బోలో తెలంగాణ’ పాటను స్వయంగా పాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన పాట పాడుతుంటే అక్కడున్న తెలంగాణ గాయకులు, ఉద్యమకారులు ఆయనకు తోడుగా స్వరం కలిపారు. దీంతో చౌరస్తా ప్రాంతం దుమ్మురేగిపోయింది.
బీజేపీని గద్దె దించడమే లక్ష్యం
రాష్ట్రంలో అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. బంగారు తెలంగాణ దిశగా రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సబ్బండవర్గాలకు నష్టం కలిగిస్తున్న బీజేపీని గద్దె దింపే లక్ష్యంతోనే బీఆర్ఎస్ను ముందుకు తెచ్చారు. పార్టీకి సంపూర్ణ మద్దుతు పలుకుతామని, కలిసి నడుస్తామంటూ కాంగ్రెస్తోపాటు ఇతర రాజకీయ పార్టీల నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు చేరుతున్నారు. ఈ క్రమంలోనే గోదావరిఖనిలో కాంగ్రెస్ నుంచి ముఖ్య నాయకులతో పాటు వందలాది మంది కార్యకర్తలు చేరారు.
– బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, పెద్దపల్లి ఎంపీ
ప్రజల గుండెచప్పుడు కేసీఆర్, కేటీఆర్
తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎప్పటికీ ఉంటారు. ఇంటింటీకీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. గులాబీ సైనికులను కంటికి రెప్పలా కాపాడుతూ ముందుకు సాగుతున్నారు. అధినేత కేసీఆర్ రాబోయే రోజుల్లో దేశంలో బీఆర్ఎస్ పార్టీను విజయతీరాల వైపు తీసుకెళ్లడం ఖాయం. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన సోమారపు సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకుడు మక్కాన్సింగ్ తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేశారు. ఆ కారణంగానే ఆ పార్టీల నుంచి భారీగా బీఆర్ఎస్లో చేరుతున్నారు.
– కోరుకంటి చందర్, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే