గొల్లపల్లి, సెప్టెండర్ 19: ‘కాంగ్రెస్వన్నీ ఉత్త హామీలే. ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలిచ్చి మోసం చేయాలని చూస్తున్నరు. దమ్ముంటే ముందుగా వారి పాలిత రాష్ర్టాల్లో అమలు చేసి చూపించాలని’ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు. రాష్ర్టాన్ని దశాబ్దాల పాటు పాలించి ఏం చేయలేదని, మళ్లీ గెలిచినా చేసేదేం ఉండదని దుయ్యబట్టారు. తాయిలాల పేరిట మభ్య పెట్టాలని చూస్తున్న ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మంగళవారం గొల్లపల్లి మండల కేంద్రంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టారు. గ్రామంలోకి వచ్చిన మంత్రికి పొలిమేర నుంచి ఒగ్గుడోలు కళాకారుల వాయిద్యాలు, డప్పుల చప్పుళ్లు, బతుకమ్మలు, డీజే సౌండ్ల మధ్య ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్.. దారి వెంట ప్రజలను, వృద్ధులను ఎలా ఉన్నారు..? పింఛన్ వస్తుందా..? అంటూ ఆప్యాయంగా పలుకరించారు. గ్రామంలో పూర్తి చేసిన సీసీ రోడ్డు, మురుగు కాల్వలు, కుల సంఘ భవనాలను ప్రారంభించారు. అలాగే కొత్తగా మంజూరైన పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా..? లేదా..? ఇంకా ఏమైనా ప్రభుత్వం తరపున చేయాల్సి ఉందా..? తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే యాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. మొన్న హైదరాబాద్కు వచ్చిన కాంగ్రెస్ నాయకులు అన్నీ అబద్ధాలే మాట్లాడారని, ప్రజలను మోసం చేసేందుకు భారీ స్కెచ్ వేశారని, ఇందుకు వారిచ్చిన హామీలే నిదర్శనమన్నారు. తానొక్కటే ప్రశ్నిస్తున్నానని, దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు నాలుగు ఉన్నాయని, ఇక్కడ ప్రకటించిన హామీలను ఆయా రాష్ర్టాల్లో అమలు చేసి చూపించాలన్నారు. అప్పుడే వారు చెప్పినవన్నీ నమ్ముతామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కాంగ్రెస్, బీజేపీ నాయకుల కండ్లకు కనిపించడం లేదన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం లేకుంటే, సీఎం కేసీఆర్ సీఎం కాకపోతే ఇంతటి అభివృద్ధి సాధ్యపడేదా..? అని ప్రశ్నించారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వచ్చేదా? ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు వచ్చేదా?. రైతు బంద్, రైతు భీమా ఇచ్చేవారా..? ఒక్కసారి ఆలోచించాలని ప్రజలకు సూచించారు. ప్రజల కష్టాలు తెలిసిన ఉద్యమ నేత సీఎం కావడం వల్లే, ప్రజలు అడుగకుండానే వారి అవసరాలకు అనుగుణంగా పథకాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం..
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. గురుకుల పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.1.20 లక్షలు వెచ్చిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. కోట్లాది నిధులతో సర్కారు దవాఖానలను అభివృద్ధి చేసి, అధునాతన పరికరాలను ఏర్పాటు చేయడం వల్లే ఈ రోజు 90 శాతం జననాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేసి వైద్య విద్యకు ప్రాధాన్యమిచ్చిన రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే అన్నారు. ఆపదలో ఉన్నవారు ‘అన్నా అంటే నేనున్నానంటూ’ అందుబాటులో ఉండి సేవచేసే అవకాశాన్ని సీఎం కేసీఆర్ తనకు కల్పించడం పూర్వజన్మ సుకృతం అన్నారు. మనకంటే ముందు పదేండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలకులకు ఇవన్నీ కనిపించలేదా..? అని ప్రశ్నించారు. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా ఉండాలని, కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ఎంపీపీ శంకరయ్య, గొల్లపల్లి ప్యాక్స్ చైర్మన్ రాజసుమన్ రావు, మర్కెట్ కమిటీ చైర్మన్ హన్మాండ్లు, వైస్ ఎంపీపీ ఆవుల సత్తయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ లింగా రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్, కో ఆర్డినేటర్ గంగాధర్, యూత్ అధ్యక్షులు రవీందర్, కో ఆర్డినేటర్ రాంచందర్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు జలందర్, నాయకులు రాఖేశ్, వీరస్వామి, రత్నం, రమేశ్, వెంకటేశ్, వెంకటరమణ, సత్తన్న, సంపత్, తిరుపతి రెడ్డి, నారాయణ రెడ్డి, గంగాధర్ పాల్గొన్నారు.