వెల్గటూర్, నవంబర్ 11: “ఎన్నికలు వచ్చాయని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్, ఈ దేశాన్ని, రాష్ర్టాన్ని 60 ఏండ్లు పాలించి స్కాంలు తప్ప చేసిందేమీ లేదు. ప్రజలను నిండా ముంచింది. కాంగ్రెస్ అంటే స్కాంలు. బీఆర్ఎస్ అంటే స్కీంలు. ఇలా ప్రతి పనిలో అవినీతికి పాల్పడే కాంగ్రెస్ కావాలా..? తొమ్మిదిన్నరేండ్లలోనే అనేక పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన బీఆర్ఎస్ కావాలా..? మీరే ఆలోచించుకోవాలని” ప్రజలకు ధర్మపురి అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు.
ఎండపల్లి మండలం కొండాపూర్లో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించగా, మహిళలు బ్రహ్మరథం పట్టారు. యువకులు బైక్లతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మంత్రి కొప్పుల మాట్లాడారు. సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలోనే రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమంలో నంబర్వన్ స్థానంలో నిలిపారని కొనియాడారు. మాయ మాటలు చెప్పి అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, ఇప్పుడు మరో అవకాశం ఇవ్వాలని ఏ మొఖం పెట్టుకొని అడుగుతుందో చెప్పాలని ప్రశ్నించారు.
అలాంటి వారికి అవకాశం ఇస్తే రాష్ట్రం 50 ఏండ్లు వెనక్కిపోతుందని, మళ్లీ స్కాంలే జరుగుతాయన్నారు. రేవంత్రెడ్డి అధికార ఆరాటంతో అడ్డగోలుగా మాట్లాడుతూ సాగుకు మూడు గంటల కరెంట్ సరిపోతదని, 24 గంటలు ఎందుకని దుర్మార్గంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఈ విషయమై కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు అది చేస్తాం.. ఇది చేస్తాం అని మాట్లాడుతున్నారని, మరి వారి పాలనలో ఇలాంటి పథకాలు ఎందుకు గుర్తు రాలేదని ప్రశ్నించారు. ఎన్నికలు పూర్తి కాగానే నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు అందజేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీజేవైఎం అధ్యక్షులు ప్రమోద్కుమార్ ఆధ్వర్యంలో 100 మంది యువకులు బీఆర్ఎస్లో చేరగా, మంత్రి కొప్పుల వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, కొండాపూర్కు చెందిన ఇప్పల నాగరాజు కూతురు తన కిడ్డీ బ్యాంక్ డబ్బులను ఎన్నికల ఖర్చు కోసం అందజేయగా, ఆమెను మంత్రి ఈశ్వర్ అభినందించారు. ఇక్కడ ఎంపీపీ కునమల్ల లక్ష్మి, ఏఎంసీ చైర్మన్ పత్తిపాక వెంకటేశ్, సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీ మండల అద్యక్షులు సింహచలం జగన్, నాయకులు గాజుల మల్లేశం, గూడ రాంరెడ్డి, గ్రామ శాఖ గంగాధరి శేఖర్, ఆలయ కమిటీ చైర్మన్ పదిరే నారాయణరావు, రాజ్కుమార్, రవి ఉన్నారు.