గొల్లపల్లి, నవంబర్ 4: ‘ధర్మపురి ప్రజలే నా బలం. నా బలగం. మీరు పెట్టిన భిక్షతోనే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్న. చీఫ్విప్గా, మంత్రిగా ఎదిగినా మీలో ఒకడిగా ఉన్న. ఆపదొస్తే ఆదుకున్న. కష్టాల్లో తోడున్న. నాపై మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఏనాడూ వమ్ముచేయలే. మరోసారి దీవించండి. నా ప్రాణం ఉన్నంత వరకూ మీకు సేవ చేస్తూనే ఉంటా’ అని ప్రజలకు ధర్మపురి అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ విజ్ఞప్తి చేశారు. గొల్లపల్లి మండలం రాఘవపట్నం, గంగదేవిపల్లె, మల్లన్నపేట, వెంగళాపూర్ గ్రామాల్లో శనివారం ఆయన ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టగా, ఊరూరా మహిళలు ఘన స్వాగతం పలికా రు. ఆయాచోట్ల గ్రామాల్లో వీధివీధినా తిరిగి, ప్రజలను కలిసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు.
అనంతరం రాఘవపట్నం సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ రాష్ర్టాన్ని కాం గ్రెస్ అరవై ఏండ్లు పాలించి చేసిందేమీ లేదని మం డిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమం పట్టని పార్టీ, ఇప్పుడు మరొక అవకాశం ఇవ్వాలని, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్ప డం హాస్యాస్పదంగా ఉందన్నారు. అప్పుడు చేయనోళ్లు.. ఇప్పుడు చేస్తరా..? ఒకసారి ఆలోచించాలని కోరారు. ప్రజలను మోసం చేయడానికే కొత్త ఎత్తులు వేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంట్ లేదు, విత్తనాలు, ఎరువులు అందలేదని, ఎరువుల బస్తాల కోసం చెప్పులు లైన్లలో పెట్టాల్సిన దుస్థితి ఉండేదన్నారు. ఆనాడు 200కు మించి పింఛన్ ఇవ్వని వాళ్లు.. ఇప్పుడు 4వేలు ఇస్తానంటే నమ్ముదామా..? ఒకసారి ఆలోచించాలని కోరా రు. వాళ్ల మాటలు నమ్మితే బతుకులు ఆగమైపోతాయని, మళ్లీ పాత కథే పునరావృతమవుతుందని చెప్పారు.
ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు కేసీఆర్ సీఎంగా ఉన్నందునే మన అవసరాలను గుర్తించి అడుగకుండానే అనేక పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. రైతు బాగున్న చోటే రాజ్యం బాగుంటుందని భావించి, 24 గంటల కరెంట్, సాగునీరు అందిస్తున్నారని, అలాగే రైతు బంధు, రైతు బీమాను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. మిషన్ కాకతీయ ద్వారా 46 వేల చెరువులను పునరుద్ధరించుకున్నామని, వృథాగా పోతున్న వాగులపై చెక్డ్యాంలు నిర్మించుకుని సాగును స్థిరీకరించినట్లు పేర్కొన్నారు. ఇక్కడ సర్పంచ్లు రాగం శంకరయ్య, సుజాత, నర్సయ్య, రమ్యా, ఎంపీటీసీ మధుకర్ రెడ్డి, రాజన్న ఎంపీపీ శంకరయ్య, జడ్పీటీసీ జలంధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మాండ్లు, వైస్ చైర్మన్ లింగా రెడ్డి, పాక్స్ అధ్యక్షులు రాజ సుమన్ రావు, మాధవ రావు, నాయకులు తిరుపతి గౌడ్, అశోక్ రావు, జలంధర్, మల్లా రెడ్డి, కిషన్, సత్యం ఉన్నారు.
‘నేను ఏ పదవిలో ఉన్నా మీకు అందుబాటులోనే ఉన్నా. మీ సేవ కోసమే ఈ జీవితం. ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచా. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిగా పనిచేస్తా. నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గంలోని దళితులందరికీ ఒకేసారి దళితబంధు ఇస్తామని ఇటీవల ధర్మపురి సభలో సీఎం కేసీఆర్ ప్రకటించడం ఆయన మం చితనానికి నిదర్శనం. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఆసరా పింఛన్ రూ.5016కు పెరుగుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలు, కొత్తగా ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను చూసి ఓటేయాలి’ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలను కోరారు.