ధర్మారం, సెప్టెంబర్8 : ‘పనిచేసే సర్కారును ఆదరించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసి దీవించాలి’ అని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖ ప్రజలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ విజ్ఞప్తి చేశారు. రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలుపుతున్న కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంగా గెలిపించుకోవాలని కోరారు. శుక్రవారం ధర్మారం మండల పరిషత్ కార్యాలయంలో గొల్లపల్లి మండలంలోని కుల సంఘాలు, సీసీ రోడ్లు, ఓపెన్ జిమ్స్ తదితర అభివృద్ధి పనులకు సంబంధించి దాదాపు 3.8 కోట్ల విలువైన ప్రొసీడింగ్స్ను సంఘాల బాధ్యులకు అందజేశారు. ధర్మారం మండలానికి చెందిన 44 మందికి 13 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ, అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి కండ్లముందు కనిపిస్తున్నదని చెప్పారు. ఉద్యమ కాలంలో ఇచ్చిన హామీ మేరకు నీళ్లు, నిధులు, నియామకాలు ఇక్కడి వారికి అందించడంలో సఫలీకృతులయ్యారన్నారు. మూడున్నరేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి బీడు భూములకు గోదావరి జలాలను మళ్లించారన్నారు.
మిషన్ భగీరథతో తాగునీటి కష్టాలు తీర్చారని చెప్పారు. సంక్షేమ ఫలాలు అందించడంతో పేదలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. ఉద్యోగాల భర్తీతో నిరుద్యోగ యువత ఆనందంగా ఉన్నదని చెప్పారు. పేదల అభ్యున్నతి కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా, రైతాంగం మేలు కోసం రైతుబంధు, రైతుబీమా లాంటి స్కీంలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి అన్నిహంగులతో కలెక్టరేట్లతో పాటు ఆఫీసు సముదాయాలను నిర్మించామన్నారు.
సీఎం కేసీఆర్ మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఒక బొమ్మరిల్లు తయారు చేశారని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నదన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మితే అధోగతి పాలుకాకతప్పదన్నారు. ‘ప్రగల్భాలు పలికేదెవరో.. పనులు చేసేదెవరో’ ప్రజలు ఆలోచించాలని కోరారు. ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి ఐదేండ్లలో 1500 కోట్లు వెచ్చించానని తెలిపారు. కుల సంఘాలకు 33 కోట్లు కేటాయించమని వెల్లడించారు. మళ్లీ గెలిపిస్తే కుల సంఘ భవనాల వద్ద ఉన్న స్థలాల్లో ఫంక్షన్హాళ్ల నిర్మాణానికి కృషి చేస్తానిని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో అభివృద్ధి కొనసాగాలంటే మరో సారి మద్దతివ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ బలరాంరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, బీఆర్ఎస్ గొల్లపల్లి మండలాధ్యక్షుడు రమేశ్, వైస్ ఎంపీపీ ఆవుల సత్యం, ఏఎంసీ మాజీ చైర్మన్ ముస్కు లింగారెడ్డి పాల్గొన్నారు.