సారంగాపూర్, జూలై 19: ప్రకృతి విపత్తుతో బీర్పూర్, ధర్మపురి మండలాలకు భారీ నష్టం వాటిల్లిందని, ఎవరూ ఆందోళన చెందవద్దని, అండగా ఉంటామని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసా ఇచ్చారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్ట్ పాత కట్టతెగిపోవడంతో పంటపొలాల్లో ఇసుక తెట్టెలు పెట్టడంతో మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, కలెక్టర్ రవి, అధికారులతో కలిసి మంత్రి ఈశ్వర్ ప్రాజెక్ట్ వద్ద తెగిన కట్టను పరిశీలించారు. కట్ట తెగడంతో సుమారు 1200 ఎకరాల్లో పంటపొలాల్లో ఇసుక తెట్టెలు పెట్టడంతో పంటపొలాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతు రోళ్లవాగు ప్రాజెక్ట్ పరిధిలోని బీర్పూర్, ధర్మపురి మండలాల్లోని సుమారు 25వేల నుంచి 30వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే సంకల్పంతో ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులకోసం సీఎం కేసీఆర్ సుమారు రూ. వందకోట్లు నిధులు మంజూరు చేయగా పనులు చివరి దశకు చేరుకునే లోపు భారీ విపత్తుతో నష్టం వాటిల్లిందన్నారు. బీర్పూర్ మండలంలోని సుమారు 1200 ఎకరాల్లో, ధర్మపురి మండలంలోని 1300 ఎకరాల్లో నష్టం వాటిల్లి రైతాంగానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు. సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, బాధిత రైతాంగాన్ని ఆదుకుంటామని, ఎవరూ ఆందోళన చెందకుండా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
రోళ్లవాగు ప్రాజెక్ట్ శాశ్వత పరిష్కారం కోసం రెండు, మూడు రోజుల్లో సీఎం కేసీఆర్కు నివేదిక అందిస్తామన్నారు. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతు చేపట్టి సాగుకు వినియోగమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ భారీ వర్షాలకు రోళ్లవాగు పాత కట్ట, అరగుండాల ప్రాజెక్ట్, రహదారులు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కొట్టుకుపోయాయన్నారు. సమస్యను మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రతిపక్ష నాయకులు రాజకీయం చేయకుండా ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన నష్టాన్ని గ్రహించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో డీసీసీబీ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జిల్లా రైతుబంధు సమితి సభ్యుడు కొల్ముల రమణ, ఎంపీపీ మసర్తి రమేశ్, వైస్ఎంపీపీ బల్మురి లక్ష్మణ్ రావు, పార్టీ అధ్యక్షుడు నారపాక రమేశ్, ప్రధాన కార్యదర్శులు శీలం రమేశ్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రావు, రామకిష్టు గంగాధర్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నల్ల మైపాల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ ముక్క శంకర్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మెరుగు రాజేశం, సీఈ సుధాకర్ రెడ్డి, డీఈ చక్రునాయక్, తహసీల్దార్ శ్రీలత, ఎంపీడీవో మల్లారెడ్డి, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.