ధర్మపురి, జనవరి 24: ధర్మపురి క్షేత్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, టెంపుల్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తామని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు. బుధవారం ధర్మపురి క్షేత్రంలో వేదపారాయణం ముగింపు వేడుకలకు మంత్రి శ్రీధర్బాబు, విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్సీ జీవన్రెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు.
అంతకుముందు ధర్మపురి నర్సన్న సన్నిధిలో మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన మంత్రులకు దేవస్థానం పక్షాన అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభ స్వాగతం పలికారు. పూజలు చేయించి ఆశీర్వదించారు. ఈఓ సంకటాల శ్రీనివాస్ స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాలను అందజేసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, ధర్మపురి మహిమాన్విత క్షేత్రమన్నారు. ధర్మపురిలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే లక్ష్మణ్కుమార్ పలుసార్లు తన దృష్టికి తెచ్చారని, అన్నింటికీ పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. అనంతరం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ, ధర్మపురి నియోజకవర్గంపై దృష్టి సారిస్తామని, అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతామన్నారు.