కరీంనగర్, నవంబర్ 21(నమస్తే తెలంగాణ)/చిగురుమామిడి: “కాంగ్రెస్ను నమ్మితే ఆగమవుతం.. ఆరు గ్యారంటీల మాట దేవుడెరుగు. ఆరు నెలలకో ముఖ్యమంత్రి మారుతడు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చేతిలో రాష్ట్రం ఉంటేనే బాగుంటుంది. అదే కాంగ్రెస్ దొంగల చేతికి పోతే ఆగమవుతుంది. ఎన్నికలంటే మూడొద్దుల పండగ కాదు.. ఐదేండ్ల మన భవిష్యత్తు. మనం ఎవరికి ఓటేస్తే బాగుపడతామో ఆలోచించాలి. కాంగ్రెస్ అంటే మోసకారి పార్టీ. ఇది నేనంటున్న మాట కాదు. కర్నాటక ప్రజలు అంటున్నారు. కట్కేస్తే వచ్చే కరెంటు కావాలా..? కర్ణాటక చీకట్లు కావాలా..? ఆలోచించి ఓటేయండి. హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ మంచి మనిషి. ఆయనను గెలిపించండి. ఆరు నెలల్లో గౌరవెల్లి నీళ్లిస్త.. ఒగులాపూర్ రైతుల సమస్యలు పరిష్కరిస్త..” అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సతీశ్కుమార్కు మద్దతుగా చిగురుమామిడి, హుస్నాబాద్ మండల కేంద్రాల్లో నిర్వహించిన భారీ రోడ్ షోల్లో ఆయన ప్రసంగించారు.
కాంగ్రెస్ను నమ్మితే ఆగమవుతామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. మంగళవారం హుస్నాబాద్, చిగురుమామిడి, కోహెడ, అక్కన్నపేట మండలకేంద్రాల్లో నిర్వహించిన భారీ రోడ్ షోల్లో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ అంటే మోసకారి పార్టీ అని కర్ణాటక ప్రజలు అంటున్నారని, ఆ రాష్ట్రంలో ఐదు గ్యారంటీలు అమలు చేస్తమని చెప్పిన రాహుల్, ప్రియాంకా గాంధీ ఇప్పుడు పత్తా లేకుండా పోయారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఉన్న కరంట్, బస్సులు బంద్ అయ్యాయని, విద్యార్థులకు ఇచ్చే స్కాలర్ షిప్ల్లో కోతలు పెట్టారని, కరంట్ బిల్లులు డబుల్ చేశారని కర్ణాటక ప్రజలు ఇక్కడికి వచ్చి చెబుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి తాము మోసపోయామని అంటున్నారని, తెలంగాణ ప్రజలు మోసపోవద్దని అప్రమత్తం చేస్తున్నారని పేర్కొన్నారు. అక్కడ కాంగ్రెస్ గెలిచిన తర్వాత పొద్దంత రెండు గంటలు, రాత్రి మూడు గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమారే తాండూరు మీటింగ్లో స్వయంగా చెప్పారని, 24 గంటల కరెంట్ ఇస్తున్న తెలంగాణ గడ్డ మీద ఉద్దారుకం చేసినమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఇటు ఆ పార్టీ నాయకుడు రేవంత్రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతదని అంటున్నారని, మూడు గంటల కరెంట్తోని 10 హెచ్పీ మోటర్లు పెట్టుకుని మూడెకరాలు పారించుకోవాలని అంటున్నారని, ఇది ఎలా సాధ్యమని మంత్రి ప్రశ్నించారు. అంటే కాంగ్రెస్ నాయకులు ఎంత తెలవని తనంతో, ఎన్ని మాయమాటలు మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పుట్టు పూర్వోత్తరాలు ప్రజలకు తెలుసని, తెలంగాణ రాకముందు ఇదే కాంగ్రెస్ అధికారంలో ఉందని, పొన్నం ప్రభాకర్ ఎంపీగా, శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నారని, అప్పుడు 24 గంటల కరెంట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎరువు బస్తాల కోసం పోలీసు స్టేషన్లలో లైన్లో నిలబడితే ఒక్క బస్తా కూడా దొరికేది కాదని, దొంగ రాత్రి కరెంట్ కోసం పోయి, పాములు కుట్టి, కరెంట్ షాక్లు కొట్టి చచ్చిపోయిన వాళ్లు లేరా? అని ప్రశ్నించారు. బాయిల కాడ తువ్వాళ పర్చుకుని పండుకున్న రోజులు రావద్దన్నారు. కట్కేస్తే వచ్చే కరెంట్ కావాల్నా, కర్ణాటక మాదిరి చీకట్లు కావాల్నా? ఒక్కసారి ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో కంటే మన మ్యానిఫెస్టో నూరువాళ్లు నయమన్నారు. కాంగ్రెస్ నాయకులు తెలంగాణల పింఛన్లు పెంచుతామని చెప్పుతున్నారే గానీ, ఇప్పటికే అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. అక్కడ ఇవ్వని వాళ్లు ఇక్కడ ఇస్తమంటే జనం చెవులో పువ్వులు పెట్టడమే అవుతుందన్నారు.
మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. జనవరి నుంచి సోనామసూరి బియ్యం ఇస్తామని కేసీఆర్ చెబుతున్నారని తెలిపారు. మహిళల సంక్షేమం కోసం కేసీఆర్ చేసినంత కృషి ఇప్పటివరకు ఎవరూ చేయలేదని స్పష్టం చేశారు. అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఉంటేనే భద్రంగా ఉంటుందని, ఇప్పుడిప్పుడే వచ్చిన తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చేతిలో ఉండాలా..? దొంగల చేతిలో పడాలా? అని ప్రశ్నించారు. ఆలోచన చేయాలని సూచించారు.
తుపాకీ రాముడు రేవంత్రెడ్డి
ద్రోహుల చేతిలో తెలంగాణ పెట్టవద్దని, ఉద్యమంలో మనమంతా ప్రాణాలొడ్డి పోరాటం చేస్తుంటే జై తెలంగాణ అంటే కాల్చి పారేస్తానని తుపాకీ దగ్గర పెట్టుకొని రేవంత్రెడ్డి కరీంనగర్ మీటింగ్కు రాలేదా? అని ప్రశ్నించారు. పేగులు తెగేదాకా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నదేమో మనమైతే తుపాకీ చేతుల పెట్టుకుని తిరిగిన తుపాకీ రాముడు రేవంత్రెడ్డి అని, ఇలాంటి ద్రోహుల చేతిలో తెలంగాణను పెడితే ఆగం కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్లది శృతి లేని సంసారమని, ఆ పార్టీలో మూడు గ్రూపులు ఉంటాయని, ఇదే కరీంనగర్ జిల్లాలో శ్రీధర్బాబుది ఒక గ్రూపు, పొన్నం ప్రభాకర్ది మరొక గ్రూపు, జీవన్రెడ్డిది ఇంకో గ్రూపు ఉంటదని, వీళ్లు ఒకరి మాటలు ఇంకొకరు వినరని ఎద్దేవా చేశారు. ఏబుల్ లీడర్.. స్టేబుల్ గవర్నమెంట్ అంటే అది కేసీఆర్, బీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు.
కాలువలు తవ్వించి నీళ్లు తెచ్చాం..
మిడ్ మానేరు పూర్తి చేసి చిగురుమామిడి మండలంలోని రేకొండ, బొమ్మనపల్లి, రామంచ, ఇందుర్తి, ముదిమాణిక్యం, లంబాడిపల్లె, సీతారాంపూర్, చిన్న ముల్కనూర్ గ్రామాలకు కాలువలు తవ్వించి నీళ్లు తెచ్చి ఇచ్చింది ఇదే గులాబీ జెండా అని మంత్రి స్పష్టం చేశారు. ఒకప్పుడు ఇదే చిగురుమామిడి నుంచి మస్కట్, దుబాయికి వలస పోతుండేవారని గుర్తు చేశారు. రైతు రుణమాఫీ రూ.14 వేల కోట్లు ఇచ్చామని, ఇంకో రూ.4 వేల కోట్లు మిగిలిందని, అది చ్చేందుకు కూడా ఎన్నికల కమిషన్ను అడిగామని, రెండు సార్లు లేఖలు రాశామని, అనుమతి ఇస్తే వారంలో పూర్తి చేస్తామని చెప్పినట్లు తెలిపారు. అనుమతి ఇవ్వక పోయినా రంది పడాల్సిన అవసరం లేదని, డిసెంబర్ 3 తర్వాత వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మిత్తితో సహా రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. రైతు బంధు కింద రూ.73 వేల కోట్లు ఇచ్చామని, ఇంత పెద్ద మొత్తం రైతులకు ఇచ్చిన కేసీఆర్ రూ.4 వేల కోట్ల రుణమాఫీ ఇవ్వలేడా? అని అన్నారు. కాంగ్రెస్ వాళ్లు చాలా అందంగా రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, వాళ్ల మ్యానిఫెస్టో పోస్టర్ల మీద ఉన్న విషయాన్ని గమనించాలని సూచించారు. ప్రతి రైతుకు రూ.15 వేలు అని రాశారని, కేసీఆర్ మాత్రం ప్రతి ఎకరానికి రూ.16 వేలు ఇస్తామని అంటున్నారని, మీకు మూడెకరాలు ఉన్నా కాంగ్రెస్ వాళ్లు ఉత్తదే రూ.15 వేలు ఇస్తారని, అదే మూడెకరాలు ఉంటే కేసీఆర్ రూ.48 వేలు ఇస్తారని, కాంగ్రెస్ మర్మాన్ని గుర్తించాలని సూచించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రతి ఏటా అని ఉందని, ప్రతి ఎకరాకు అని ఎక్కడా లేదని, అవి కూడా ఇస్తారో ఎగపెడతారో తెలియదని అన్నారు. అందుకే తస్మాత్ జాగ్రత్త అని సూచించారు.
సతీశ్కుమార్ చాలా మంచి వ్యక్తి
హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ మంచి వ్యక్తి అని, ఆయనను ఎవరు కూడా విమర్శించరని, ఎవరైనా ఆయన ఇంటికి వెళ్తే.. అన్నం తినివచ్చారా? అని ఆయన ఇల్లు అడుగుతుందని, కడుపు నిండా అన్నం పెట్టే ఇల్లు వాళ్లదని మంత్రి కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో 14 ఏండ్ల పాటు కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇల్లే ఉద్యమకారులకు అన్నం పెట్టిందని గుర్తు చేశారు. అలాంటి కుటుంబాన్ని పట్టుకుని కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సతీశ్కుమార్కు కులం, మతం పట్టింపులు లేవని, తలలో నాలుకలా, అందరి వాడిగా ఉంటారని, అలాంటి మంచి మనిషిని గెలిపించాలని కోరారు.
మిడ్మానేరుతో నీళ్లు వస్తున్నాయని, గౌరవెల్లి ప్రాజెక్టు కూడా పూర్తి చేశామని, త్వరలో ఆ కాలువలు కూడా పూర్తి చేసి ఆరు నెలల్లో నీళ్లందించే బాధ్యత తనదేనన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు కాలు అడ్డం పెట్టి అడ్డుకోవాలని చూసిన కాంగ్రెస్ వాళ్లు గెలవాలా?, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రాజెక్టు కట్టి చూపించిన బీఆర్ఎస్ అభ్యర్థి సతీశ్కుమార్ గెలవాలా? ఆలోచించాలని కోరారు. కోర్టుల్లో కేసులు వేశారని, అయినా ఓపికతో పనిచేసి ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు. కాలువలు తవ్వితే ఆరు నెలల్లో నీళ్లు వస్తాయన్నారు.
ఒగులాపూర్ రైతులు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కావాలా?, మీ భూములు మీకు కావాలా?, మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలా?, మీరు ఏది కోరుకున్నా మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి సూచించారు. ఒగులాపూర్ గురించి ఎమ్మెల్యే సతీశ్ అన్ని విషయాలు చెప్పారని, తానే స్వయంగా ఒగులాపూర్కు వచ్చి చర్చించి, తృప్తికలిగే విధమైన సహాయాన్ని తప్పకుండా తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. వైద్య సేవలు మెరుగుపర్చుకుందామని, హుస్నాబాద్లో వంద పడకల దవాఖాన మంజూరు చేయించామని, చిగురుమామిడి దవాఖానను కూడా అప్గ్రేడ్ చేసి, డాక్టర్లను పెంచి మంచి సదుపాయాలు కల్పిస్తామన్నారు. అనంతరం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో రైతులు తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే అనేక అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావాలని కోరారు.