చొప్పదండి/విద్యానగర్/ గంగాధర/ హుజూరాబాద్ టౌన్/ వీణవంక, జనవరి 19 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం గురువారం కనుల పండుగలా ప్రారంభమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన శిబిరాలను ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పెద్దపల్లి, ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్లో మరో మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించి, పలువురికి కళ్లద్దాలు పంపిణీ చేశారు.
మానకొండూర్, చొప్పదండి, కోరుట్ల, రామగుండం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, కల్వకుంట్ల విద్యాసాగర్రావు, కోరుకంటి చందర్, హుజూరాబాద్, మంథని నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ శిబిరాలను ప్రారంభించారు. మొదటి రోజు కంటి వ్యాధులతో బాధపడుతున్న వారు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఎక్కడ చూసినా బారులు తీరి కనిపించగా, వారికి అధికారులు పలు రకాల సదుపాయాలు కల్పించారు. బృందాలు కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి కళ్లద్దాలను అందించారు.
ప్రైవేట్ల చూపించుకున్నా పాయిదా లేకుండె
కొద్దిరోజుల సంది నా కండ్లు సరిగ్గా కన్పిస్తలేవు. ఖర్సయినా పర్వాలేదని ఓ ప్రైవేట్ దవాఖానకు పోయిన. డాక్టర్లు చూసి మందులు ఇచ్చిన్రు. అద్దాలు కూడా తీసుకున్నా. రూ.1500 బిల్లు వసూలు చేసిన్రు. కానీ ఏం పాయిదా లేదు. పోక ముందు ఎట్ల కనిపించినయో.. ఇప్పుడు అట్లనే మసక కొడుతున్నయి. ఏం పాయిదా లేదు. కానీ కేసీఆర్ సారు పెట్టిన కంటి వెలుగు శిబిరానికి వచ్చిన. వైద్యులు పరీక్షలు చేసి నాకు దూరపు చూపు తగ్గిందని అన్నరు. వెంటనే అద్దాలు ఇచ్చారు. ఇప్పుడు చూపు సక్కగ కనిపిస్తుంది.
– రామగిరి అవ్వ, ఇందిరా నగర్
ఫ్రీగా పరీక్షలు చేసిన్రు
నేను, నా భర్త రాజయ్య ఏ పనిదొరికితే ఆ పని చేసుకుంట బతుకుతం. మాకు కొడుకుల్లేరు. ఇద్దరు ఆడబిడ్డలే. పెండ్లి చేసినం. ఓ బిడ్డ మాపై ఆధారపడే బతుకుతంది. నా భర్తకు నాకు కొన్నేండ్ల సంది కంటి సమస్య ఉంది. బతుకుడే కష్టమైతుంటే దవాఖానకు ఏం పోతం? గతంల కంటి వెలుగు పెట్టినప్పుడు మా భర్తకు చూపిస్తే అద్దాలు ఇచ్చిన్రు. నాకు మందులు ఇచ్చిన్రు. ఇప్పుడు నా కండ్లు మస్క మస్క కనిపిస్తున్నయ్. మా దగ్గర పెట్టిన శిబిరంలో చూపించుకున్న. వారం రోజుల్లోగా నాకు అవసరమైన అద్దాలు తెప్పించి ఇస్తామమన్నరు. రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా పరీక్షలు చేయిస్తున్న సీఎం కేసీఆర్ సార్కు నేను, నా కుటుంబం రుణపడి ఉంటం.
– గజ్జెల భూలక్ష్మి, 24వ వార్డు (హుజూరాబాద్ టౌన్)
ఇంటికచ్చి పిలిచిండ్రు
సర్కారోళ్లు దేవుడోలే వచ్చిన్రు. అమ్మా నీకు కండ్లు మంచిగ కనపడుతున్నయా అని ఇంటికి వచ్చి అడిగిన్రు. ఎందుకో అనుకున్న. సక్కగా కనిపిస్తలేవని చెప్పంగనే పేరు రాసుకున్నరు. ఇయ్యాళ్ల శిబిరానికి రమ్మన్నరు. ఈడికి వచ్చిన. అన్ని పరీక్షలు జేసి అద్దాలు ఇచ్చిన్రు. చాన సంబురమైంది. ప్రైవేట్ల చూపెట్టుకుందమంటే మస్తు పైసలయితయ్. మాఅసొంటోళ్లు ఎంతోమందికి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ మంచి పని జేత్తుండు.
– రాచర్ల శోభ, బీడీ కార్మికురాలు, ఆనంద్నగర్ కాలనీ (కోరుట్ల)
ఆపరేషన్ ఫ్రీగా చేస్తమని చెప్రిన్రు
నాకు 65 ఏండ్లుటయ్. ఇప్పటిదాకా నాకు ఏ రోగాలు లేవు. రెండు నెలల సంది కండ్లు మస్క మస్క కనబడుతున్నయ్. కంటి వెలుగుల చూత్తరని తెలిసి ఇయ్యాళ శిబిరానికి అచ్చిన. కంటి పరీక్షలు చేసిన్రు. కంటిపై పొర వచ్చిందని, ఆపరేషన్ రెండు నెలల తర్వాత చేస్తమని డాక్టర్లు చెప్పిన్రు. చుక్కల మందు ఇచ్చిన్రు. ప్రైవేట్ల అయితే కంటి పొర ఆపరేషన్ చేయించుకుంటే యాభై వేల దాకా అయితయ్. అసొంటిది కంటి వెలుగు ద్వారా ఫ్రీగ జేస్తమని చెప్పిండ్రు. సీఎం కేసీఆర్కు రుణ పడి ఉంట. – తోటపల్లి సత్తయ్య, పెద్దపల్లి
నాలాంటి పేదోళ్లకు కేసీఆర్ సారే దేవుడు
నాకు కొద్ది రోజుల సంది కండ్లు మసక, మసక కనబడుతున్నయ్. కరీంనగర్కు పోయి వేలకు వేలు పెట్టి చూపించుకునేట్టు లేదు. గట్లనే కాలం ఎల్లదీత్తున్న. నా భర్త రవి సానా రోజుల కింద పాణం మంచిగ లేక చనిపోయిండు. కొడుకు కూడా చిన్నతనంల చనిపోయిండు. బిడ్డకు పెండ్లి చేసి పంపిన. నేను ఒక్కదానినే కైకిలి, కూలీ చేసుకుంటున్న. కండ్లను చూపించుకుంటే మంచిగుండు అనుకుంటన్న. గింతల్నె మా ఊర్లనే కండ్ల పరీక్ష చేసి అద్దాలు ఇత్తరట అని చాటింపు చేయించిన్రు. పైసలు తీసుకోకుండనే అట్టిగనే పరీక్షలు చేయించి అద్దాలు ఇచ్చిన్రు. నాలాంటి పేదోళ్లకు కేసీఆర్ సారే దేవుడైండు. గిప్పుడు గా అద్దాలు పెట్టుకుంటే మంచిగ కనిపిత్తుంది. – రాంపెల్లి సరోజన, నిరుపేద కూలీ, కొలనూర్(ఓదెల)
దగ్గరి చూపు సమస్యతో బాధపడే వారే ఎక్కువ
కంటి వెలుగులో మొదటి రోజు వచ్చిన వారిలో దగ్గరి చూపు సమస్యతో బాధపడే వారే ఉన్నారు. ఇలాంటి వారికి వైద్య పరీక్షలు చేసి అప్పటికప్పుడే అద్దాలు అందజేశాం. ఎక్కువ పాయింట్ ఉన్న వారి వివరాలు నమోదు చేసుకున్నాం. వారికి ఇంటికే అద్దాలు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. తప్పనిసరి పరిస్థితి అయిన వారికి ఆపరేషన్లు చేసేందుకు కొందరి వివరాలు నమోదు చేసుకున్నాం. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ సురేశ్, ఆప్తాల్మిక్ ఆఫీసర్ (విద్యానగర్)