కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ను మరోసారి దీవించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula) అన్నారు. కరీంనగర్ రూరల్ మండల సర్వ సభ్య సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ స్వయంపాలన లో చేపట్టిన పనులతో పల్లెల రూపు రేఖలు మారిపోయాయని వెల్లడించారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియని తెలంగాణ అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తోనే సాధ్యమయ్యిందని ప్రజలు పూర్తిస్థాయి విశ్వాసంతో ఉన్నారని తెలిపారు.
బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వస్తే చీకటి రోజులు మళ్లీ వస్తాయని గ్రహించిన ప్రజలు వారిని నమ్మే పరిస్థితి లేదని అన్నారు .తెలంగాణలో సంపద పెరగాలని పెరిగిన సంపదను పంచాలని నిర్ణయించి, కోట్ల రూపాయలతో పల్లెలకు కొత్త రూపు తీసుకువచ్చి, ప్రజాజీవన ప్రమాణాలు పెంచారని గుర్తు చేశారు. పనిచేసే ప్రభుత్వానికే ప్రజలు పట్టం కడతారని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉండేందుకు కేసీఆర్ను మరోసారి దీవించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు .
ప్రజా ప్రతినిధులు జవాబుదారీగా పనిచేయాలని, సమస్యలు అనేవి లేకుండా ఉండవని వాటిని అధిగమించుకుంటూ ముందుకు పోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గోపి, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్, జడ్పీ సీఈవో వీర బుచ్చయ్య,ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, జడ్పీటీసీ పురమల్ల లలిత, పాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి, ఎంపీడీవో జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.