తెలంగాణ దశాబ్ది వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శుక్రవారం అంబరాన్నంటాయి. ఊరూరా ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీల్లో పతాకావిష్కరణలు చేయడంతో ఎటుచూసినా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. జిల్లా కేంద్రంలో నిర్వహించిన అధికారిక కార్యక్రమాల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్, జడ్పీ చైర్పర్సన్ విజయ, మానకొండూర్, చొప్పదండి ఎమ్మెల్యేలు రసమయి, సుంకె, కలెక్టర్ కర్ణన్, సీపీ సుబ్బారాయుడు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీఆర్తో కలిసి పాల్గొన్నారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం పరేడ్గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
కమాన్చౌరస్తా/కలెక్టరేట్, జూన్ 2 : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా మొదలయ్యాయి. 21 రోజుల పాటు సాగనుండగా, ఆరంభ వేడుకలు అదరహో అనిపించాయి. జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ సంబురాలు అంబరాన్నంటాయి. జిల్లా కేంద్రంలో అధికారిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఉదయం 8:30 గంటలకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసంబంధాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మానకొండూర్, చొప్పదండి ఎమ్యెల్యేలు రసమయి బాలకిషన్, మేయర్ వై సునీల్రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి హరిశంకర్, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. అనంతరం పరేడ్ మైదానంలో మంత్రి జెండా ఆవిష్కరించారు.
తర్వాత గ్రౌండ్లో వేడుకలకు హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు, సమరయోధులకు అభివాదం చేశారు. అనంతరం తెలంగాణ ఆవిర్భవించిన దశాబ్దికాలంలో సాధించిన ప్రగతి సందేశాన్ని మంత్రి గంగుల అందించారు. తర్వాత అమరవీరుల కుటుంబాలను సన్మానించి పోలీస్ రక్షణ దినోత్సవ పోస్టర్ను ఆవిషరించారు. జిల్లాలోని వివిధ శాఖలు తెలంగాణ ఆవిర్భావం నుంచి అమలు చేసిన వివిధ పథకాల గురించి వివరిస్తూ ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనను, స్టాళ్లను తిలకించారు. చివరగా శకటాల ప్రదర్శనలో ప్రతిభను కనబరిచిన వ్యవసాయశాఖకు మొదటి బహుమతి, దళితబంధుపై రెండో బహుమతి, పశుసంవర్ధక శాఖకు మూడో బహుమతి, డీఆర్డీవో శాఖకు కన్షొలేషన్ బహుమతి అందించారు.