కార్పొరేషన్, నవంబర్ 4: హైదరాబాద్ తర్వాత కరీంనగర్ను రెండో గొప్ప నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. పెయింటర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మ్యాక రమాకాంత్ సహా వంద మంది యువకులు శనివారం నగరంలో మంత్రి గంగుల సమక్షంలో పార్టీలో చేరారు. యువకులకు మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసే పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారని, పార్టీలో చేరిన యువత భవిష్యత్ బాధ్యతను తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ రాకముందు కరీంనగర్ అన్ని రంగాల్లో వెనుకబడి ఉందన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వందల కోట్లు విడుదల చేయగా, నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
నగరం రాత్రిపూట జిగేల్ మంటున్నదని, కరీంనగర్ను పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఢిల్లీ పార్టీలు అని, బీఆర్ఎస్ ఒకటే మన ఇంటి పార్టీ అని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచన అంతా తెలంగాణ అభివృద్ధి అని, దేశానికి అన్నం పెట్టె స్థాయిలో తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ చేతులు బలోపేతం చేయాలని యువతకు పిలుపునిచ్చారు. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, మంత్రి కేటీర్ సహకారంతో హైదరాబాద్కు పెద్ద ఎత్తున విదేశీ కంపెనీలు తరలి వస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాగుల మల్యాల సర్పంచ్ నాయిని ప్రసాద్, ఎంపీటీసీ కొమ్ము హేమలత, రవికిరణ్, ఆర్టీఏ మెంబర్ తోట శ్రీపతి, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.