వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు మా అభ్యర్థిత్వాలను ఖరారు చేసిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడుతాం. ఉమ్మడి జిల్లాలో 13 స్థానాల్లో గెలుస్తాం. పలువురు ఎమ్మెల్యేలపై కొంత మంది కావాలని దుష్ప్రచారం చేశారు. కానీ, మా అధినేత కేసీఆర్ ఆదేశాలతో మేమెప్పుడూ ప్రజల్లో ఉన్నాం. వారి ఆశీస్సులే మమ్మల్ని మరోసారి గెలిపిస్తాయి. ప్రజల కోసం పనిచేసే మాకు సీఎం కేసీఆర్ మరోసారి అవకాశం ఇచ్చారు. ఒకేసారి ఇంతమంది అభ్యర్థులను ప్రకటించడం కేసీఆర్ ధైర్యానికి ప్రతీక. కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థులను ఎందుకు ప్రకటించలేక పోతున్నాయి. ఆ పార్టీలు ఎన్నికలకు ముందే టికెట్లు అమ్ముకుంటున్నాయి. అధికారంలోకి వస్తే తర్వాత రాష్ర్టాన్ని అమ్ముకుంటాయి.
– మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు తమ అభ్యర్థిత్వాలను ఖరారు చేసిన బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. సోమవారం ఒకేసారి రాష్ట్రంలోని 115 నియోజకవర్గాలకు సంబంధించి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత జిల్లాలో ఆ పార్టీ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తమపై నమ్మకంతో సీఎం కేసీఆర్ తమ అభ్యర్థిత్వాలను తిరిగి ఖరారు చేశారని తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉండే తమను గుర్తించి మరోసారి అవకాశాన్ని కల్పించారని చెప్పారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిత్యం ప్రజల్లో ఉండి విజయాన్ని సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాల్లో గెలుస్తామని మంత్రి ధీమాగా చెప్పారు.
ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలపై కొంత మంది కావాలని దుష్ప్రచారం చేశారని, వీళ్లకు టికెట్లు వస్తాయా? రావా? అనే సందేహాలు వ్యక్తం చేశారని, కానీ తమ అధినేత కేసీఆర్ ఆదేశాలతో తామెప్పుడూ ప్రజల్లో ఉన్నామని, వారి ఆశీస్సులే తమను మరోసారి గెలిపిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. ఉద్యమ నేత కేసీఆర్ కారణంగానే తెలంగాణ సాధ్యమైందని తలచిన ప్రజలు 2014లో ఆయన సీఎం కావాలని తమకు ఓట్లు వేశారని, ఆ తర్వాత కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి 2018లో కూడా మరోసారి కేసీఆరే సీఎం కావాలని మళ్లీ తమనే గుర్తించారని, ఇప్పుడు కూడా అదే విధంగా ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు 11 స్థానాలు తమవేనని, వచ్చే ఎన్నికల్లో మాత్రం హుజూరాబాద్, మంథని నియోజకవర్గాల్లోనూ తామే గెలిచి 13 స్థానాలను కైవసం చేసుకోబోతున్నామని చెప్పారు. అందుకే ప్రజల్లో ఉండి, ప్రజల కోసం పనిచేసే తమకు సీఎం కేసీఆర్ మరోసారి అవకాశం ఇచ్చారని తెలిపారు.
తెలంగాణరాక ముందు దరిద్రమైన పాలన జరిగిందని, ఈ కొన్నేళ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని ఒకసారి చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ పాలనలో ఇప్పుడు ఎక్కడా బీడు భూములు లేవని, ఎక్కడా కరెంట్ సమస్యలు లేవని అన్నారు. ఉద్యోగులను ఆదరించామని, ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుకున్నామని, మరోసారి అవకాశం ఇస్తే రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందిస్తామన్నారు. తమ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ దేశ చరిత్రలో ఏ పార్టీ చేయని సాహసం చేశారని, రాష్ట్రంలోని 115 నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ధైర్యానికి ఇది ప్రతీకని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థులను ఎందుకు ప్రకటించలేక పోతున్నాయని ప్రశ్నించారు. ఆ పార్టీలు ఎన్నికలకు ముందే టికెట్లు అమ్ముకుంటున్నాయని, అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ర్టాన్ని అమ్ముకుంటాయని విమర్శించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి పాలన ఉండేదో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని, కరీంనగర్లో ఎక్కడ చూసినా గుంతలమయమైన రోడ్లు, శిథిలమైన డ్రైనేజీలు, పందుల స్వైర విహారంతో నగర పరిసరాలు నిండి ఉండేవని, ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా బ్రహ్మాండమైన అభివృద్ధి కనిపిస్తుందని అన్నారు.
కాంగ్రెస్, బీజేపీ కొత్త పార్టీలు ఏమీ కాదని, ఏండ్లకేండ్లు పాలించి ప్రజలను ఇబ్బందులు పెట్టినవేనని అన్నారు. ఒక పార్టీ అవినీతి, బంధు ప్రీతితో దేశాన్ని దోచుకుతింటే, మరో పార్టీ కుల, మతాల మధ్య చిచ్చు రేపి హిందూ, ముస్లింల మధ్య కొట్లాటలు పెట్టించాయని అన్నారు. కేసీఆర్ పాలనలో హిందూ, ముస్లింలు అన్నదమ్ముల్లాగా ఎంతో స్నేహభావంతో కలిసి ఉంటున్నామని, శాంతియుతమైన, అవినీతి రహిత పాలన రాష్ట్రంలో సాగుతోందని అన్నారు. తమ అధిష్టానం ప్రజలేనని, ప్రజల్లో ఉన్నవాళ్లకే సీఎం కేసీఆర్ మరోసారి అవకాశం ఇచ్చారని, కాంగ్రెస్, బీజేపీది అలా కాదని, ఢిల్లీ అధిష్టానం సీట్లు కేటాయించాల్సి ఉంటుందని, నామినేషన్ల చివరి క్షణం వరకు కూడా ఆ పార్టీల బీఫాంలు తేలవని అన్నారు. తాము నిత్యం ప్రజల్లోనే ఉన్నామని, ఇప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటామని, ప్రజలు కోరుకున్న విధంగా పనులు చేస్తామని చెప్పారు. కొన్ని నియోజకవర్గాల్లో విబేధాలు ఉన్నాయని, కానీ అవి అంత పెద్దవి కాదని, పార్టీ లైన్లో కూర్చుండి మాట్లాడుకుంటే సమసిపోతాయని, అందరం కలిసి మాట్లాడుకుంటామని, సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.