కార్పొరేషన్, అక్టోబర్ 16: రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తు కోసం తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పోలింగ్ బూత్ కన్వీనర్, కో కన్వీనర్, ఇన్చార్జిలు, డివిజన్ల అధ్యక్షులు, ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ, కరీంనగర్ నియోజకవర్గ చరిత్రలో ఒకసారి గెలిచిన వ్యక్తి మరోసారి గెలవలేదని, తనను నమ్మి మూడు సార్లు గెలిపించారని, ఈ పదవి తనదే అయినా మీరు పెట్టిన భిక్షేనని పేర్కొన్నారు.
మరోసారి ఆశీర్వదిస్తే మరింత గొప్పగా పనిచేస్తానన్నారు. తెలంగాణ సంక్షేమ ఫలాలు భవిష్యత్ తరాలకు అందాలంటే మరోసారి సీఎం కేసీఆర్ చేతులను బలోపేతం చేయాలన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ లేని తెలంగాణ ఊహించుకోలేమన్నారు. మనం తప్పు చేస్తే భవిష్యత్ తరాలు అంధకారం అవుతాయని హెచ్చరించారు. పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టి మన సంపద దోచుకెళ్లాలని చూస్తున్న కాంగ్రెస్, బీజేపీ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పదేళ్ల సీఎం కేసీఆర్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 90కి పైగా సీట్లు సాధించి అధికారంలోకి రానున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం హామీలకే పరిమితమని, వాటిని అమలు చేయదని విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నీటి మూటలు అయ్యాయని పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లోనూ ఒక పంట ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలను ప్రజలు నమ్మే స్థితి లేదన్నారు.
పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు అభివృద్ధి చేసి చూపిందని, అందుకే ప్రజలు కూడా సీఎం కేసీఆర్పై నమ్మకంతో ఉన్నారని పేర్కొన్నారు. 45 రోజులు తన కోసం పనిచేస్తే 5 ఏళ్లు మీకోసం పనిచేస్తానని ప్రమాణం చేశారు. పదవులు ఎన్ని వచ్చినా తాను మారే వ్యక్తిని కాదని, పార్టీ కార్యకర్తలే తమ బలమని పేర్కొన్నారు. ఈ నెల 18న ప్రజాఆశీర్వాద సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సభకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. దీనిని విజయవంతం చేయాలన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఓటరును కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో కూడా చెప్పాల్సినా అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో పదేళ్లు పెంచిన సంపదను పేదలకు పంచుతున్నామని పేర్కొన్నారు. భారీ స్థాయిలో క్యాడర్ ఉన్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు. ఇతర పార్టీలకు ఈ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు లేరన్నారు. పక్కా ప్రణాళికతో ముందుకు సాగి మరోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్, వ్యవసాయ మారెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, పార్టీ మండలాధ్యక్షులు శ్యామ్సుందర్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నాయకులు మహేశ్గౌడ్, వాసాల రమేశ్, పిట్టల రవీందర్, జమీలొద్దీన్ , సాబీర్ పాషా, శౌకత్ అలీ, నవాజ్, వాజ్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు నియోజకవర్గంలోని ప్రతి ఓటరునూ కలుసుకొని బీఆర్ఎస్ కార్యక్రమాలను వివరించాలి. ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో పని చేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలకు అర్థం అయ్యేలా వివరించాలి. సీఎం కేసీఆర్ హామీలపై ప్రజల్లో ఎంతో నమ్మకం ఉంది. కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు అనేక పథకాలను కూడా తీసుకువచ్చిన విషయం ప్రజలకు గుర్తు చేయాలి.
– యాదగిరి సునీల్రావు , నగర మేయర్
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలి. వచ్చే ఎన్నికల్లో మంత్రి గంగుల కమలాకర్ను నాలుగో సారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. డివిజన్ల అధ్యక్షుల నియామకంతో పాటు 390 పోలింగ్ బూత్లకు కన్వీనర్, కో కన్వీనర్, ఇన్చార్జ్జిలను కూడా నియమించాం. కార్యకర్తలు తమ పరిధిలోని ఓటర్లను కలుసుకొని ముందుకు సాగాలి. ప్రతి కార్యకర్త తానే అభ్యర్థిగా భావించుకొని పార్టీని గెలిపించాలి.
– చల్ల హరిశంకర్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు