కరీంనగర్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ అమర వీరుల త్యాగం వెలకట్టలేనిదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వారి భూమికే కీలకమైనదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. అమరుల కుటుంబాలను ఎప్పటికీ మర్చిపోమని, వారి త్యాగాలను నిత్యం స్మరిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ప్రతి ఘనతంత్ర, స్వాతంత్య్ర వేడుకల్లో, ప్రతి రాష్ట్ర అవతరణ దినోత్సవంలో అమరుల త్యాగాలను స్మరించుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ అధ్యక్షతన గురువారం జరిగిన ప్రత్యేక సమావేశంలో 31 మంది అమరుల కుటుంబసభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో పోలీస్ కిష్టయ్య, శ్రీకాంతా చారి వంటి ఎందరో అమరులు తమ విలువైన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారన్నారు. వారు చేసిన త్యాగాలే తెలంగాణ ఏర్పాటుకు కీలకంగా మారాయన్నారు.
అమరుల కుటుంబాలను సీఎం కేసీఆర్ అక్కున చేర్చుకుని ఆదరించారని గుర్తు చేశారు. పోలీస్ కిష్టయ్య కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆదుకున్నారని, ఆయన భార్యకు, కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని, కూతురు ప్రియాంకను మెడిసిన్ చదివించి డాక్టర్ను చేశారని పేర్కొన్నారు. ఆమె ఇప్పుడు కరీంనగర్లోని బస్తీ దవాఖానలో డాక్టర్గా పనిచేస్తున్నారని చెప్పారు. నాడు సమైక్య పాలకులు మన గోదావరి నీళ్లు, బొగ్గును దోచుకున్నారని, తెలంగాణలో గోదావరి తెలంగాణలో ఎక్కడ కూడా ఆగకుండా పరుగులు తీసేదని, మనకు గోదావరి నది ఉన్నా, ఎన్టీపీసీ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఉన్నా సాగు, తాగు నీటి కోసం, కరెంట్ కోసం అష్ట కష్టాలు పడ్డామని, పవర్, క్రాప్ హాలీడేలు ఇచ్చేవారని మంత్రి గంగుల గుర్తు చేశారు.
గతంలో సరైన అవకాశాలు లేక యువత వలసలు పోయేవారన్నారు. ఇపుడు స్వయం పాలనలో గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించుకుని సాగు, తాగు నీటి కష్టాలు తీర్చుకున్నామని, మన బొగ్గు మనకు రావడంతో కరెంట్కు ఇబ్బందులు లేకుండా పోయాయని, ఈ ఘనత సీఎం కేసీఆర్దని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ, అమరుల త్యాగాల వల్లే తెలంగాణ సాధించుకున్నామన్నారు. వారిని స్మరించుకునేందుకు గురువారం అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలతో పాటు జడ్పీలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరులందరికి సెల్యూట్ చేస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. అమరుల కుటుంబాలను అక్కున చేర్చుకున్న అంశపై జడ్పీ ప్రత్యేక సమావేశంలో తీర్మానం ప్రవేశ పెట్టగా సభ్యులు మూకుమ్మడిగా ఆమోదించారు. ఈ సందర్భంగా అమరుల కుటుంబ సభ్యులను జడ్పీ చైర్పర్సన్, కలెక్టర్తో కలిసి మంత్రి ఘనంగా సన్మానించారు. అమరులను స్మరిస్తూ మౌనం పాటించారు. ఈ కార్యక్రమాల్లో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జడ్పీ సీఈవో ప్రియాంక, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, డీఆర్డీవో ఎల్ శ్రీలతారెడ్డి, డీపీఓ వీరబుచ్చయ్య. జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.