విద్యానగర్, మే 3: రాష్ట్రంలోని ప్రతి కార్మికుడు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్ జ్యోతినగర్లో తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఆధ్వర్యంలో ఉచిత పరీక్షల ల్యాబ్ను ప్రారంభించి, మాట్లాడారు. శ్రామికుల శ్రేయస్సు దృష్ట్యా కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నదని చెప్పారు. ముంబాయి సీఎస్సీ హెల్త్ కేర్ ఆధ్వర్యంలో మొత్తం 19 రకాల 140 పరీక్షలు ఉచితంగా అందిస్తామని చెప్పారు. కార్మికుల్లో ఉన్న వ్యాధిని నిర్ధారించడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, అప్పుడే చికిత్స సులువవుతుందని వివరించారు. భవన నిర్మాణ, ఆధార్ కార్డు ఉన్న ప్రతి కార్మికుడికి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఏడు ల్యాబ్లను ప్రారంభించినట్లు చెప్పారు. ప్రతి కార్మికుడి పేరిట హెల్త్ ప్రొఫైల్ను సిద్ధం చేస్తామని, వ్యాధి నిర్ధారణ అయిన వారికి అవసరమైతే అధునాతనమైన వైద్య చికిత్స అందిస్తామని తెలిపారు. కరీంనగర్ ల్యాబ్లో జిల్లాతో పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, సిద్దిపేట, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు చెందిన కార్మికులకు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. జిల్లాలో ఇప్పటికే లక్ష మంది కార్మికులను గుర్తించామని, మిగతా వారి కోసం ప్రత్యేకంగా ఎన్రోల్మెంట్ క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ వై సునీల్ రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ రమేశ్ బాబు, వైద్యులు ఉన్నారు.