కరీంనగర్పై సీఎం కేసీఆర్కు ఉన్న ప్రత్యేక ప్రేమకు నిదర్శనం మానేరు రివర్ ఫ్రంట్ అని.. అతి త్వరలోనే ప్రాజెక్టు పట్టాలెక్కబోతున్నదని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. హైదరాబాద్ జలసౌధ కార్యాలయంలో ఇరిగేషన్, టూరిజం, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో మానేరు రివర్ ఫ్రంట్పై మంత్రి గంగుల ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి.. గతంలోనే రూ.410 కోట్లు మానేరు రివర్ ఫ్రంట్ కోసం మంజూరు అయ్యాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నారని, రాబోయే బడ్జెట్లో సైతం సమర్పించాల్సిన ప్రతిపాదనలపై చర్చించామన్నారు. ప్రాజెక్టులో అంతర్భాగమైన తీగల వంతెన కూడా ప్రారంభానికి సిద్ధమైందని మంత్రి తెలిపారు.
దాదాపు పది కిలోమీటర్ల మేర నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులో మొదటి విడతగా 2.6 కిలోమీటర్ల మేర నిర్మాణాలకు సంబంధించిన డీపీఆర్ పనులు పూర్తయి టెండర్లు పిలిచామని వెల్లడించారు. రిటైనింగ్ వాల్, అప్పర్ ప్రామినాడ్, లోయర్ ప్రామినాడ్ మధ్య నిర్మాణాలకు సంబంధించి సమావేశంలో కీలకంగా చర్చించామన్నారు. రాబోయే తరాలకు అందంగా మానేరు రివర్ ఫ్రంట్ను రూపుదిద్దేలా చర్యలు తీసుకుంటామని మంత్రి గంగలు వెల్లడించారు.
మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో బోటింగ్, అమ్యూజ్ మెంట్ పార్కులు, వాటర్ స్పోర్ట్స్, పౌంటేన్లు, చిల్డ్రన్ పార్క్స్, కిడ్స్ ప్లే ఏరియాలు, ఆడిటోరియం, మ్యూజియం, సీనియర్ సిటిజన్ గార్డెన్స్, ఫ్లవర్ గార్డెన్లు, రాక్ గార్డెన్లు, లేజర్ షోలు, విశాలమైన లాండ్ స్కేపింగులు, ఇంకా స్పోర్ట్ ఎన్ క్లేవ్స్లో భాగంగా టెన్నిస్, వాలిబాల్ ఇతర స్పోర్ట్స్ కోర్టులు, ప్రాజెక్టు పొడవునా వాకింగ్, జాగింగ్ ట్రాకులతో భారత దేశానికే తలమానికంగా మానేరు రివర్ ఫ్రంట్ రూపకల్పన జరుగుతోందని మంత్రి ఈసందర్భంగా స్పష్టం చేశారు.