ఉమ్మడి పాలనలో కరీంనగర్ అభివృద్ధికి నయా పైసా ఇవ్వలేదు. సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలో రూ. వెయ్యి కోట్లు ఇచ్చారు. ఈ నిధులతో అంతర్గత రహదారులు వేశాం. డ్రైనేజీలను అభివృద్ధి చేసినం. తెలంగాణ రాక ముందు నగరం ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉన్నది ప్రజలు గమనించాలి. ప్రతిపక్షాల మాటలను నమ్మి మోసపోవద్దు. ఆలోచించి పనిచేసే పార్టీని ఆదరించాలి.
– మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ కార్పొరేషన్, సెప్టెంబర్ 30: కరీంనగర్ను రూ. వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ప్రటించారు. సమైక్య పాలకులు ఒక్కరూపాయి కూడా ఇవ్వకుండా అవహేళన చేశారని ఆరోపించారు. కరీంనగరంలోని 9, 10, 11, 32, 46, 48, 49, 21 డివిజన్లల్లో పర్యటించారు. 133 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధి పనులకు శనివారం భూమిపూజ చేశారు. సీతారాంపూర్ సాయి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం అక్కడే మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. కోతిరాంపూర్ చౌరస్తా నుంచి గిద్దెపెరుమాండ్ల దేవాలయం వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా సమస్యలపై వినతిపత్రం ఇచ్చిన మహిళలతో ముచ్చటించారు. ‘కరీంనగర్ ఎలా ఉన్నది..రోడ్లు బాగున్నాయా..డ్రైనేజీలో ఎలా ఉన్నాయి..’ అని అడిగారు. దీనికి వారు రోడ్లు బాగున్నాయని, డ్రైనేజీలు పరిశుభ్రంగా ఉన్నాయని సమాధానం ఇవ్వడంతో మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కాలనీమహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, భవిష్యత్ తరాలకు గొప్ప నగరాన్ని అందించే లక్ష్యంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాకముందు కరీంనగర్ ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత నగరంలో 220 కిలోమీటర్ల రోడ్లను, 147 కిలోమీటర్ల రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. ప్రపంచస్థాయి పర్యాటకులను ఆకర్షించేందుకు నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే కేబుల్ బ్రిడ్జ్ అందుబాటులోకి రాగా, మానేరు రివర్ ఫ్రంట్ ను ఏడాదిలోగా పూర్తి చేస్తామన్నారు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే కరీంనగర్ ఇంకా అభివృద్ధి చెందాల్సినా అవసరం ఉందన్నారు. కరీంనగర్లో జరుగుతున్న అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్రావు, బల్దియా కమిషనర్ ప్రపుల్దేశాయ్, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.