కమాన్చౌరస్తా, జనవరి 28: జిల్లా కేంద్రంలోని మారెట్ రోడ్డు శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం శనివారం భక్తజన సంద్రంగా మారింది. ఆలయ షష్ఠమ వార్షిక బ్రహ్మోత్సవాలతో పాటు శనివారం రథసప్తమి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు. ఈ క్రమంలో ఆలయంలో ఉదయం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం వైభవంగా చేశారు. అనంతరం స్వామి వారు సూర్యప్రభ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ కనువిందు చేశారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామి వారు విహరించారు. ఈ కార్యక్రమాల్లో ఉత్సవాల ప్రధాన నిర్వాహకుడు, మంత్రి గంగుల కమలాకర్, కుటుంబ సభ్యులు, మేయర్ వై సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్మలు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, ఈవో వెంకన్న, ఉత్సవ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు, సినీ నటుడు కిరణ్ అబ్బవరం, యాంకర్ రవి, నాయకులు, వివిధ సంస్థల కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
గోగుల ప్రసాద్ నేతృత్వంలో ఉదయం శ్రీహనుమాన్ సేవా సమితి, బోగ శ్రీనివాస్ బృందం, శ్రీవేణుగోపాలస్వామి భజన మండలి సభ్యులు భజన చేశారు. జయంత్ శర్మ, శ్యాంసుందర్, సతీశ్ కీర్తనలు, సాయంత్రం, రాత్రి పద్మాసిని, గొల్లపల్లి రవీందర్ శిష్య బృందం, కట్ట మంజుల సిస్టర్స్ భక్తి కీర్తనలు, రతన్కుమార్ బృందం పేరిణి నాట్యం, రాత్రి శ్రీలేఖ, కుమారి, ధనశ్రీ కీర్తనలు అలరించాయి.
నేటి కార్యక్రమాలివే..
ఆదివారం ఉదయం తిరుమల పండితులచే సుప్రభాతసేవ, అన్నకూటోత్సవం, కల్పవృక్షవాహనసేవ, పద్మశాలీ సమాజం తరఫున పట్టు వస్ర్తాలు, తలంబ్రాలు, సారె సమర్పిస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి అశ్వ, గజ వాహన సేవలతో భారత్ టాకీస్ సమీపంలోని వీరాంజనేయ స్వామి ఆలయం నుంచి ఎదురోలు వేడుక నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం, రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.