కరీంనగర్ కల్చరల్, మార్చి 2: ‘ఓ మంచి పుస్తకం. మనిషిని మహోన్నతుడిగా మార్చే శక్తివంతమైన సాధనం. ప్రపంచం మొత్తాన్ని చైతన్యపరిచే శక్తి పుస్తకంలో ఉన్నది’ అంటూ పుస్తకం గొప్పతనాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వివరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా గురువారం కరీంనగర్ జిల్లాకేంద్రంలోని జ్యోతిబాఫూలే మైదానం (సర్కస్ గ్రౌండ్) శ్రీభాష్యం విజయసారథి ప్రాంగణం, పాకాల యశోదారెడ్డి వేదికపై తెలంగాణ బుక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాహిత్య అకాడమీ సౌజన్యంతో కరీంనగర్ పుస్తక మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, టెక్నాలజీ యుగంలోనూ గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్లు ఇప్పటికి పుస్తకాల ద్వారానే సమాచారాన్ని సేకరిస్తున్నాయని చెప్పారు. ప్రతిఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవరుచుకొని అపారమైన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. చిన్నతనంలో చదివిన నవలలు, పుస్తకాల ఆధారంగా లభించిన స్ఫూర్తితో ఉద్యమంలో చురుగ్గా పాల్గొని జ్ఞానాన్ని సంపాదింకున్నామన్నారు.
కవులు, కళాకారులకు పుట్టినిల్లు కరీంనగర్ అని చెప్పారు. దేశానికి ప్రధానిగా పనిచేసిన సాహితీవేత్త, రాజనీతిజ్ఞుడు పీవీ నర్సింహారావు తాను చదివిన పుస్తకాలతో భారతదేశ ఆర్థిక స్థితిని మార్చివేశారని గుర్తు చేశారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సీ నారాయణ రెడ్డి, పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి, నలిమెల భాసర్, అన్నవరం దేవేందర్ వంటి గొప్ప సాహితీవేత్తలను, రచయితలను అందించిన జిల్లా కరీంనగర్ అని అన్నారు. జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ మాట్లాడుతూ.. మహిళలు ఎకడ పూజిపబడితే అకడ దేవతలుంటారని, సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్ సహకారంతో తాను జడ్పీ చైర్పర్సన్ అయ్యానని చెప్పారు. సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ, పుస్తక ప్రదర్శనలను ఓ జ్యోతిగా ముందుకు తీసుకెళ్లాలని, జ్ఞాన తెలంగాణ కోసం పుస్తకాలను ఎగబడి చూసి కొని చదివే రోజులు రావాలని అభిలషించారు.
కలెక్టర్ కర్జన్ మాట్లాడుతూ, పుస్తక పఠనం పాఠశాల స్థాయి నుంచి అలవాటు చేసుకోవాలన్నారు. మహిళను గౌరవవించుకోవడంలో భాగంగా పుస్తక ప్రదర్శన వేదికకు పాకాల యశోదారెడ్డి పేరును పెట్టినట్లు చెప్పారు. అందరికీ చేరువ చేసేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కార్యక్రమం అనంతరం కవులు, కళాకారులకు విజయసారథి పేరిట లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులను ప్రదానం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, సీపీ సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యామ్ ప్రసాద్లాల్, ట్రైనీ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, మేయర్ వై సునీల్ రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, కరీంనగర్, హుజూరాబాద్ ఆర్డీవోలు ఆనంద్ కుమార్, హరిసింగ్, డిప్యూటీ మేయర్ చల్లస్వరూపారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, సీడబ్ల్యూసీ అధ్యక్షురాలు ధనలక్ష్మి, కొత్తపల్లి మున్సిపల్ అధ్యక్షుడు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు.