కరీంనగర్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు యాసంగి సీజన్లో పండిన చివరి ధాన్యం గింజ వరకు కనీస మద్ద తు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పా ట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్లోని ఆయన నివాసంలో రాష్ట్ర పౌర సరఫరాల ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ప్రారంభించిన కేంద్రాలు, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లు ఎలా చేశారంటూ ఆరా తీశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రమే దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని, సీఎం కేసీఆర్ రైతు అనుకూల విధానాలు, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వర జలాలతో పంట విస్తీర్ణం ఏటికేడు పెరుగుతూ రికార్డు స్థాయిలో ధాన్యాన్ని సేకరిస్తున్నామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా రైతు పండించిన చివరి ధాన్యం గింజ వరకు మద్దతు ధరతో కొనాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తున్నామన్నారు.
ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా బియ్యం ఉత్పత్తి 20 ఏళ్ల కనిష్ఠానికి పడిపోతున్నదని, అదే తెలంగాణలో మాత్రం ఇందుకు భిన్నంగా బియ్యం ఉత్పత్తి ఆరింతలు పెరిగిందని స్పష్టం చేశారు. ఇది తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సాధించిన ఘనతగా భావించాలన్నారు. నిన్నటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,131 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి వాటి ద్వారా 186 కోట్లు విలువ చేసే లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, అత్యధికంగా నల్గొండ, నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు కొనుగోళ్లు జరిగాయని వివరించారు. కోతలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు స్థానిక యంత్రాంగం నిర్ణయం తీసుకుంటుందని, లక్ష్యం మేరకు సేకరణకు అవసరమైన 7,031 పైచిలుకు కొనుగో లు కేంద్రాలు, గన్నీ బ్యాగులు, మాయిశ్చర్ మిషన్లు, వేయింగ్ మిషన్లు, హమాలీలను సమకూర్చుకున్నామని తెలిపారు. అకాల వర్షాల నేపథ్యంలో టార్పాలిన్లను సైతం అందుబాటులో ఉంచామన్నారు. రైతులు ఫెయిర్ యావరేజీ క్వాలిటీ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలని కోరారు.
జిల్లాలో 353 కేంద్రాల ఏర్పాటు
కరీంనగర్ జిల్లాలో 353 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 50 కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇంకా కొనుగోళ్లు ప్రారంభించ లేదని అన్నారు. ఈ నెల 25 నుంచి కొనుగోళ్లు ముమ్మరమయ్యే అవకాశాలు ఉన్నందున, ప్రతి కేంద్రాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించి రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో సివిల్ సప్లయీస్ కమిషనర్ అనిల్ కుమార్, పౌర సరఫరాల సంస్థ జీఎం రాజారెడ్డి, కరీంనగర్ అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, డీఎస్వో సురేశ్ రెడ్డి, సివిల్ సప్లయ్స్ డీఎం ఎం శ్రీకాంత్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.