విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల(వీఆర్ఏ) దశాబ్దాల కల నెరవేరింది. ఎన్నో ఏండ్ల వెట్టిచాకిరీ నుంచి విముక్తి లభించింది. ఇచ్చిన మాట మేరకు సీఎం కేసీఆర్ పేస్కేల్తోపాటు ఉద్యోగ భద్రత కల్పించడంతో కొత్త జీవితం మొదలైంది. విద్యార్హతను బట్టి ఆఫీస్ సబార్డినేట్స్, రికార్డు అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లుగా వివిధ శాఖల్లో నియమించి, తాజాగా సర్దుబాటు నియామకపత్రాలు అందజేయడంతో వీఆర్ఏలు ఆనందంలో మునిగిపోయారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, సిరిసిల్లలో ఎమ్మెల్యేలు రమేశ్బాబు, సుంకె రవిశంకర్ చేతుల మీదుగా ఆ ఉత్తర్వులు అందుకొని సంబురపడ్డారు. తమను ఉద్యోగులుగా మార్చి, ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు చెబుతున్నారు.
– కలెక్టరేట్, ఆగస్టు 10
కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 10 : సీఎం కేసీఆర్ చొరవతోనే వెట్టిచాకిరీ నుంచి వీఆర్ఏలకు విముక్తి లభించిందని, స్వరాష్ట్రంలోనే ఉద్యోగులకు సమానత్వం లభించిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. గ్రామ రెవెన్యూ సహాయకు(వీఆర్ఏ)లను ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తూ గురువారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నియామక ఉత్తర్వు పత్రాలను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ వస్తే ఏమైతది అన్న వారికి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, చేపడుతున్న నియామకాలు, ఇన్నాళ్లూ నోళ్ళు తెరిచిన బీళ్లు సస్యశ్యామలమంగా మారడమే సమాధానమన్నారు. ఉమ్మడి పాలనలో ‘బాంచెన్ దొర’ అన్నట్లుగా ఉన్న బడుగు, బలహీనవర్గాల బతుకులకు తెలంగాణలో ఆత్మగౌరవం ఇనుమడించిందని చెప్పారు. నాడు వీఆర్ఏలను కొందరు అరెయ్, ఒరెయ్ అని పిలిచేవారని, కానీ నేడు సార్ అని పిలిచే అవకాశం సీఎం కేసీఆర్ కల్పించారని కొనియాడారు.
రాష్ట్ర వ్యాప్తంగా 20,555 మందికి, జిల్లాలో 442 మందికి పేస్కేలు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం వారి కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపిందన్నారు. బానిసత్వపు ఛాయలు రూపుమాపేందుకు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో నియామక పత్రాలు అందుకున్న వీఆర్ఏల కళ్ళల్లో ఆనందం తొణికిసలాడుతుందన్నారు. నిన్నటి దా కా సహాయకులుగానే కొనసాగుతూ, దూరదూరం గా ఉండే వారిని ప్రభుత్వోద్యోగులుగా గుర్తించి, సమానత్వం కల్పించేందుకు సీఎం కేసీఆర్ చేసిన కృషి ఎనలేనిదన్నారు. న్యాయపరమైన చిక్కులు రా కుండా అనేక మంది అనుభవజ్ఞులైన ఐఏఎస్ అధికారులతో చర్చించిన తర్వాతనే జీవో నెంబర్ 81 ద్వారా పేస్కేలు కుదిర్చారని చెప్పారు. సర్దుబాటు ప్రక్రియలో కలెక్టర్ డాక్టర్ బీ గోపి కూడా తీవ్రంగా కృషి చేశారని గుర్తు చేశారు. ఉద్యమ ట్యాగ్లైన్ నీళ్ళు, నిధులు, నియామకాలు పక్కా ప్రణాళిక ప్రకారమే రాష్ట్ర ప్రజలకు అందుతున్నాయన్నారు.
బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యం
రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగుతోందనడానికి వీఆర్ఏలు, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడమే నిదర్శనమని మంత్రి స్పష్టం చేశారు. చిరుద్యోగుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రదర్శిస్తున్న అంకితభావానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెలలోనే ఆర్టీసీ కార్మికులను కూడా ప్రభుత్వోద్యోగులుగా గుర్తించటం సీఎం ఉదాత్త స్వభావాన్ని చాటిచెబుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ.6 వేల గౌరవ వేతనంతో జీవనం సాగించిన వీఆర్ఏలు, స్వరాష్ట్రంలో రూ.11,500 పొందారన్నారు. తాజాగా, పీఆర్సీ పరిధిలోకి రావడంతో రూ.కనీసంగా రూ.36 వేల వేతనం పొందబోతున్నారని గణాంకాలతో వెల్లడించారు. ఏ ప్రాంతంలో పనిచేసిన వారికి అదే ప్రాంతంలో ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేసినట్లు తెలిపారు. ఏ శాఖలో ఉద్యోగంలో చేరినా విధుల నిర్వహణలో నిబద్ధత కనబరచాలని సూచించారు. 61 ఏళ్ళు దాటిన వీఆర్ఏల కుటుంబాలకు న్యాయం చేస్తామని ప్రకటించారు.
వీఆర్ఏల సేవలు మరువలేనివి
తక్కువ వేతనమైనా రెవెన్యూ శాఖలో వీఆర్ఏలు అందించిన సేవలు మరువలేనివని అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్ పేర్కొన్నారు. ప్రధానంగా ఎన్నికల్లో వారు నిర్వహించే విధులు అమోఘమని, ఇన్నాళ్లుగా అందించిన సేవలను రెవెన్యూ శాఖ మరిచిపోదన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, పలువురు కార్పొరేటర్లు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కష్టజీవుల గుర్తింపునకు నిదర్శనం : మేయర్ సునీల్రావు
కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు లభిస్తుందనేందుకు వీఆర్ఏల క్రమబద్ధీకరణే నిదర్శనమని కరీంనగర్ మేయర్ సునీల్రావు పేర్కొన్నారు. విద్యార్హతలను బట్టి సర్దుబాటు చేయడంతో భవిష్యత్లో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశముంటుందన్నారు. అరకొర వేతనాలతో బతుకీడుస్తున్న తమ కుటుంబాలు సీఎం చూపిన కరుణతో మెరుగైన జీవనం గడుపనున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 442 మందికి సర్దుబాటు నియామక ఉత్తర్వులు అందజేశారు. అలాగే, క్రమబద్ధీకరణ పొందిన జిల్లాలోని 107 మంది జూనియర్ పంచాయతీ అధికారులకు కూడా ఉత్తర్వులు అందజేశారు.
వీఆర్ఏల కల సాకారం : కలెక్టర్ బీ గోపి
సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతోనే వీఆర్ఏల కల సాకారమైందని కలెక్టర్ బీ గోపి తెలిపారు. వీఆర్ఏలకు వయోపరిమితి లేకపోవడంపై సీఎం దృష్టికి వెళ్ళడంతో ఆయన స్పందించి, పేస్కేల్ ఇస్తూ ప్రభుత్వోద్యోగులుగా గుర్తించేందుకు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు రోజుల తరబడి చర్చోపచర్చలు జరిపి కొలిక్కి తెచ్చినట్లు వెల్లడించారు. విద్యార్హతల ఆధారంగా ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయటం ముఖ్యమంత్రి గొప్ప మనుసుకు నిదర్శనమన్నారు. 61 ఏళ్ళు దాటిన వారి కుటుంబసభ్యులకు త్వరలోనే నియామక ఉత్తర్వులు అందజేయనున్నట్లు తెలిపారు.
నిన్నటి వీఆర్ఏలు.. భవిష్యత్ అధికారులు
నిన్నటి వీఆర్ఏలు భవిష్యత్ అధికారులుగా మారబోతున్నారని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో చిరుద్యోగుల భవిష్యత్ దేదీప్యమానమైందన్నారు. కలలో కూడా సాధ్యం కానిది కళ్ళెదుటే సాధ్యం చేసి చూపించిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. ఊరికి చేసిన సేవ ఊరికే పోదనే నానుడి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో నేడు నిజమైందన్నారు. ఆయన తీసుకున్న అనేక సాహసోపేత నిర్ణయాలతో అతి తక్కువ కాలంలో తెలంగాణ దేశంలోనే అత్యంత ఎక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అవతరించిందన్నారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సాంస్కృతిక కళాకారులను కూడా గుర్తించి, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగావకాశాలు కల్పించారని కొనియాడారు.