‘లచ్చన్నా ఏడ్వకు.. నేనున్నా.. మన సారు కేసీఆర్ ఉన్నరు.. ఏ రైతు కూడా అధైర్య పడద్దు” అని కరీంనగర్ రూరల్ మండలం తాహెర్ కొండాపూర్కు చెందిన రైతు పూరెళ్ల లక్ష్మయ్యను మంత్రి గంగుల కమలాకర్ ఓదార్చారు.. కాలికి గాయమై వేధిస్తున్నా మండలంలోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను ఆదివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ గ్రామానికి వెళ్లిన సమయంలో లక్ష్మయ్య తన మూడెకరాలతోపాటు ఇదే గ్రామంలో మరో 10 ఎకరాలు, బహద్దూర్ఖాన్ పేటలో మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశానని, వర్షంతో పంట మొత్తం దెబ్బతిన్నదని పరిస్థితిని ప్రత్యక్షంగా చూపుతూ చేనులో పడి బోరున విలపించాడు. ఆయనను చూసిన మంత్రి గంగులతో పాటు అక్కడున్నవాళ్లందరూ చలించిపోయారు. మంత్రి రైతును దగ్గరకు రమ్మని పిలిచి ఓదార్చారు.
కరీంనగర్ రూరల్:ఏప్రిల్ 23: ‘గతంలో ఎన్నడూలేనివిధంగా ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం జరిగింది. నష్టపోయిన ప్రతిరైతుకూ పరిహారం అందిస్తాం. ఆగం కావద్దు.. బాధిత రైతాంగానికి కేసీఆర్ సర్కారు అండగా ఉంటది’ అంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి భరోసానిచ్చారు. అధికారులతో సర్వే చేయించి దెబ్బతిన్న ప్రతి గింజకూ పరిహారం ఇప్పించే పూచీ తనదని చెప్పారు. ఆదివారం ఆయన కరీంనగర్ మండలంలోని చామనపల్లి, బహద్దూర్ఖాన్పేట, తాహెర్కొండాపూర్, చెర్లభూత్కూర్, ఫకీర్పేట, జూబ్లీనగర్ గ్రామాల్లో పర్యటించారు. క్షేత్రస్థాయికి పంట నష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 5 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. ఇందులో కరీంనగర్ మండలంలోని ఆరు గ్రామాల్లోనే 3144 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఈ మేరకు అధికారులు ప్రాథమిక అంచనాలను రూపొందించారని తెలిపారు. కాగా, తాహెర్కొండాపూర్కు చెందిన రైతు లక్ష్మయ్య మంత్రి గంగుల ఎదుట గోడు వెళ్లబోసుకున్నాడు. తనకున్న 3 ఎకరాలతో పాటు, 25 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగుచేసినట్లు చెప్పాడు. వర్షం కారణంగా ఒక్కగింజకూడా చేతికందే పరిస్థితిలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన గంగుల అధైర్య పడవద్దని, పూర్తిస్థాయిలో పరిహారం ఇప్పిస్తానని భరోసానిచ్చారు.
గతంలో నష్టపోయిన పంటలకు సీఎం కేసీఆర్ ఎకరానికి రూ. 10 వేల చొప్పున పరిహారం అందించారని చెప్పారు. జిల్లాలోని ఆయా ప్రాంతాలకు సంబంధించిన రూ. 8.50 కోట్లు విడుదల చేశారన్నారు. త్వరలోనే రైతుల ఖాతాల్లో జమవుతాయని తెలిపారు. ప్రస్తుతం జరిగిన పంట నష్టంపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిహారం మంజూరు చేయిస్తానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ముందుచూపుతో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతో కొంత మేర నష్టాన్ని తగ్గించగలిగామని చెప్పారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని పౌరసరఫరాలశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. కౌలు రైతులకు కూడా న్యాయం జరిగేవిధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వారు బ్యాంకు ఖాతా, భూ యజమానుల వివరాలను రెవెన్యూ అధికారులకు సమర్పించాలని సూచించారు. ఈ సందర్భంగా తాహెర్కొండాపూర్, బహద్దుర్ఖాన్పేట రైతు లక్ష్మయ్య, శంకర్, ప్రభాకర్, ప్రశాంత్ను ఒదార్చాడు. మంత్రి వెంట అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్, డీఏవో శ్రీధర్, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, కరీంనగర్ ఏఎంసీ చైర్మన్ రెడ్డవేణి మధు, వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ కాశెట్టి శ్రీనివాస్, కరీంనగర్ సింగిల్ విండో చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, జడ్పీటీసీ పురుమల్ల లలితా శ్రీనివాస్, ఎంపీటీసీ బుర్ర తిరుపతి, సర్పంచులు బోగొండ లక్ష్మి, తప్పట్ల భూమయ్య, మడికంటి మమత, దబ్బెట రమణారెడ్డి, నందు, సుంకిశాల సంపత్రావు, బొగొండ ఐలయ్య, కూర శ్యాంసుందర్రెడ్డి, ఆరె శ్రీనివాస్, చెలమయ్య, చింతల లక్ష్మణ్,గోష్కుల శంకరయ్య, అకమల్ల శ్రీనివాస్, తహసీల్దార్ నారాయణ, ఏవో సత్యం, ఆర్ఐ రజనీకాంత్ పాల్గొన్నారు.