“స్వరాష్ట్రం కోసం పోరాడిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకపోతే, తెలంగాణ మళ్లీ ఆంధ్రోళ్ల చేతుల్లోకి పోయి ఆగమైతది. రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరైతది. కాపాడుకోవడం మనందరి బాధ్యత. పదేండ్ల కేసీఆర్ పాలన, అభివృద్ధిపై గ్రామాల్లో చర్చించాలి. కారు గుర్తుకు ఓటేసి మన ఇంటి పార్టీ అయిన బీఆర్ఎస్ను ఆశీర్వదించాలి. అత్యధిక మెజార్టీతో నన్ను నాలుగోసారి గెలిపించండి.’ అని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన కరీంనగర్ రూరల్ మండలంలోని నగునూర్లో ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. సాయంత్రం నగరంలోని 37, 38, 55వ డివిజన్లలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ప్రసంగించారు.
-కార్పొరేషన్/ కరీంనగర్ రూరల్, నవంబర్ 19
కార్పొరేషన్, నవంబర్ 19: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడుతున్నాడని ఆ పార్టీ అధిష్ఠానం బండి సంజయ్ని పదవి నుంచి తొలగించిందని, అలాంటి వ్యక్తికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడిగా టికెట్లు అమ్ముకోవడంతో పాటు పాదయాత్ర పేరిట పార్టీ ఫండ్ను దుర్వినియోగం చేశాడని ఆ పార్టీ అధిష్ఠానం మెడలు పట్టి గెంటేసిందని విమర్శించారు. తనకు ఎక్కడా ఎంపీ టికెట్ రాదోనన్న భయంతో ఇప్పుడు ఎమ్మెల్యేగా బరిలో దిగారని దుయ్యబట్టారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం ఆయన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో కలిసి నగరంలోని 55, 37, 38వ డివిజన్లలో ప్రచారం చేశారు. ఆయా డివిజన్లలో బీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు మంగళహారతులతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, బండి సంజయ్ ఎంపీగా గెలిచిన తర్వాత ఎప్పుడు ప్రజల ముఖం చూడలేదన్నారు. ప్రజలను ఓట్లు అడిగే అర్హత లేక ప్రలోభాలతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. నాలుగున్నర ఏళ్లలో సంపాదించిన అవినీతి సొమ్ముతో ఓటుకు రూ.20 వేలు, సెల్ఫోన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. గెలిచిన తర్వాత ప్రజలను పట్టించుకోని నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దొంగల చేతుల్లో పెట్టవద్దన్నారు. సమైక్యాంధ్ర పాలనలో పడ్డ అరిగోసలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసే పార్టీలేనని పేర్కొన్నారు. ఒక్క తప్పు జరిగితే మరోసారి 50 ఏళ్ల వెనక్కి పోతామన్నారు.
50 ఏళ్ల దారిద్య్రం కావాలో పదేళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో రౌడీ షీటర్కు టికెట్ ఇచ్చిందని విమర్శించారు. ఆయనకు ఓటు వేస్తే మన భూములు ఉంటాయా అని ప్రశ్నించారు. వేల కోట్ల నిధులు తీసుకువచ్చి నగరాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. సీసీ రోడ్లు, చౌరస్తాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దామన్నారు. నాలుగేళ్ల క్రితం గుండెపోటు డ్రామాతో ప్రజల సానుభూతి పొంది ఎంపీగా గెలిచాడని విమర్శించారు. కరోనా కాలంలో మంత్రిగా నేను మీ మధ్యలో ఉంటే ఆయన మాత్రం ఢిల్లీలో ఎంజాయ్ చేశారని విమర్శించారు. ఎంపీగా ఏం పని చేయని బండి సంజయ్ని ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏం పని చేస్తాడని ప్రశ్నించారు. స్మార్ట్సిటీ నేనే తెచ్చానని అంటే నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. స్మార్ట్సిటీ తెచ్చానని గుడిలో ప్రమాణం చేస్తావా అని బండి సంజయ్కి సవాల్ చేశారు. ఈ కార్యక్రమాల్లో నగర మేయర్ యాదగిరి సునీల్రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్, కార్పొరేటర్ కచ్చు రవి, కో-ఆప్షన్ సభ్యురాలు రమ, నాయకులు ఎం రాజేందర్, కర్రె అనిల్, చంద్రశేఖర్, రవి, వంగ హరీశ్, చిన్న, రాజు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, నవంబర్ 19 : తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్ సీఎంగా లేకపోతే, రాష్ట్రం ఆంధ్రోళ్ల చేతుల్లోకి పోయి ఆగమవుతుందని, వాళ్ల నుంచి కాపాడుకుందామని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ మండలంలోని నగునూర్ గ్రామంలో మంత్రి గంగుల ఒగ్గుడోళ్ల కళాకారులు, డప్పు చప్పుళ్లతో ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. గ్రామస్తులు ఆయనను గజమాలతో సత్కరించారు. యువకులు పటాకులు కాల్చుతూ, మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. గొంగలి, గొర్రెపిల్లను బహూకరించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడారు. తాను తప్పు చెబితే తనకు ఓటేయద్దని, నిజం చెప్పినట్లు అనిపిస్తే ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నగునూర్ వస్తే రోడ్లు, తాగు, సాగు నీరు, కరెంట్ లేని పరిస్థితులు చూసి కళ్లలో నీళ్లు తిరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో గ్రామంలో అంతర్గత రహదారులను అభివృద్ధి చేశానని గుర్తు చేశారు. జనవరిలో గ్రామంలోని దళితులందరికీ దళితబంధు ఇస్తామని హామీ ఇచ్చారు. మిగిలిన వారందరికీ కూడా బీసీ బంధు కూడా పూర్తి చేస్తామని భరోసా కల్పించారు. జనవరి నుంచి అందరికీ కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు అందజేస్తామన్నారు. సమైక్య పాలనలో అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డిని అభివృద్ధి కోసం నిధులు కావాలని అడిగితే వెకిలిగా నవ్వారని వాపోయారు. ఆంధ్రాకు చెందిన వారే ముఖ్యమంత్రులు కావడంతో గోదావరి జలాలను, మన బొగ్గును దోచుకుని తెలంగాణను గుడ్డిదీపం చేశారని తెలిపారు. స్వయం పాలనలో సీఎం కేసీఆర్ సహకారంతో వేలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామన్నారు. నియోజకర్గ వ్యాప్తంగా సీసీ రోడ్లను నిర్మించానని, యాభై ఏండ్లలో జరగని అభివృద్ధిని చేసి చూపించానన్నారు. ఎంపీ బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా టికెట్లు ఇస్తానని చెప్పి కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు.
విషయం తెలిసిన మోదీ బండి పదవిని తీసేశారని పేర్కొన్నారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచి నాలుగేైండ్లెనా ఒక్క గ్రామానికి కూడా వచ్చింది లేదన్నారు. దీంతో ఇగ ఎంపీగా ఆయనకు టికెట్ ఇవ్వరనే, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ దోఖాబాజీ పార్టీలని, ఆ పార్టీల నాయకులు కేవలం ఎన్నికలప్పుడూ మాత్రమే కనిపిస్తారన్నారు. ఓటేయించుకొని మాయమవడం తప్ప వాళ్లు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. తాను ఎల్లప్పుడూ మీ కళ్ల ముందే ఉంటూ ఆపదలో అండగా ఉన్నానని గుర్తు చేశారు. యాభై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ మన బతుకులు చీకటిమయం చేసిందని, ఆ పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణను దోచుకొని గుడ్డిదీపం చేస్తుందని విమర్శించారు. ఆంధ్రా నాయకులు హైదరాబాద్లో అడ్డ వేశారని, ఢిల్లీ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు సమైక్యవాదుల ముసుగులో తెలంగాణను దోచుకునేందుకు వస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ను ఓడించడమే లక్ష్యంగా సమైక్యవాదులతో కలిసి వస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మితే మన పిల్లల భవిష్యత్ అంధకారమవుతుందన్నారు. కోట్ల రూపాయలతో తెలంగాణను అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ను ఆశీర్వదించాలని, కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. కాగా పలు పార్టీలకు చెందిన 20 మంది యువకులు, నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ప్రచారంలోఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, పి శ్యాంసుందర్రెడ్డి, సర్పంచ్ ఉప్పుల శ్రీధర్, ఎంపీటీసీ సాయిల్ల వినయ్సాగర్, ఎ శ్రీనివాస్, నాయకులు దాది సుధాకర్, కస్తూరి రాంరెడ్డి, కస్తూరి శ్రీనివాస్రెడ్డి, పెద్ది రమేశ్, పెంచాల శ్రీనివాస్రావు, బత్తిని రాజగౌడ్, బత్తిని దిలీప్గౌడ్, మధుకర్, దావు సంపత్, నెక్ పాషా, వరి భద్రయ్య, బోనగరి హన్మంతరావు, దావు రవితేజ, జీకే యూత్, కస్తూరి శ్రీనివాస్రెడ్డి, ఆకుల కిరణ్, తప్పట్ల నరేశ్, గర్వంధ శ్రీనివాస్, మహేశ్ పాల్గొన్నారు.