“రాష్ట్రం అన్నిరంగాల్లో ఆదర్శంగా నిలుస్తున్నది. పచ్చగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టేందుకు ప్రతిపక్ష నేతలు కుట్రలు చేస్తున్నరు. బీఆర్ఎస్ను ఓడిచేందుకు మరో బీఆర్ఎస్ (బండి, రేవంత్, షర్మిల) ఏకమై వస్తున్నరు. మళ్లీ మన వనరులు దోచుకునేందుకు పాదయాత్రల పేరిట తిరుగుతున్నరు. వాళ్లను నమ్మితే మళ్లీ నిండా మునుగుడే. కార్యకర్తలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణను కాపాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్సే అని గుర్తుంచుకోవాలి. పార్టీకి కార్యకర్తలే బలం, బలగం. కేసీఆర్కు ఉన్న ఆస్తి కూడా కార్యకర్తలే. మీరు పార్టీని కాపాడితే.. నేను మీకు రక్షణగా ఉంటా.”అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఆదివారం నగునూర్ గ్రామంలో జరిగిన కరీంనగర్ రూరల్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు.
కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 2: రాష్ట్రంలో బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధితో పచ్చగా ఉన్న తెలంగాణను చూసి ఓర్వలేక, ఇక్కడి వనరులు, నిధులు, కొల్లగొట్టాలని ప్రతిపక్షాలు ఒక్కటయ్యాయని, వారి కుట్రలను ఛేదించాలని పార్టీ కార్యకర్తలకు మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ రూరల్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కరీంనగర్ మండలం నగునూర్లోని బీఎంఆర్ గార్డెన్లో మండలాధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి గంగుల పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. బీఆర్ఎస్కు కార్యకర్తలే బలం, బలగమని మీ కోసం.. మీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. కేసీఆర్కు ఉన్న ఆస్థి మీరే, ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఏ ఒక్క కార్యకర్తకు బాధ కలిగినా తనకు కలిగినట్టేనని, తన చివరి రక్తం బొట్టు దాకా కార్యకర్తల ముఖంపై చిరునవ్వు కోసం పని చేస్తానని స్పష్టం చేశారు.
సమైక్య పాలనలో ఎంతో మంది సీఎంలు, ప్రభుత్వాలు. ఎంపీలు వచ్చారు, పోయారే తప్ప చేసిందేమీ లేదన్నారు. అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవో ఒక్కసారి ఆలోచించుకోవాలని, కరెంట్ ఎప్పుడు వస్తుందో, పోతుందో తెలియదని, తాగునీటి కోసం ట్యాంకర్ల వద్ద యుద్దాలు చేసిన రోజులు ఉండేవని గుర్తు చేసుకున్నారు. తాను 2000 సంవత్సరంలో రాజకీయాల్లోకి వచ్చానని, కరీంనగర్ మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికైనట్లు చెప్పారు. కానీ అప్పటి ప్రభుత్వాలు అభివృద్ధికి నిధులు ఇవ్వకపోడంతో రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకున్నానని, ఈ క్రమంలో వార్డు సభ్యులే తనపై ఒత్తిడి తెచ్చి 2006లో బలవంతంగా కార్పొరేటర్గా నామినేషన్ వేయిం చి గెలిపించారన్నారు. కరీంనగర్ చరిత్రలో ఒక వ్యక్తి రెండ్లు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర లేదని, కానీ తాను 2009 లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచానని, అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుసగా మూడు సార్లు గెలిచి చరిత్ర తిరగరాసిన ఘనత తనకే దక్కుతుందని వివరించారు. తనను ఆశీర్వదిస్తూ కడుపులో పెట్టుకుంటూ వస్తున్న నియోజకవర్గ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచిన మొదటి రోజుల్లో గ్రామాలకు రోడ్లు లేవని, అభివృద్ధి లేదని, ఈ క్రమంలో తాను చామనపల్లికి వెళ్లి బ్రిడ్జి నిర్మిస్తానని అంటే దుబ్బపల్లి రాజిరెడ్డి అనే వ్యక్తి ‘ అందరూ చెప్పేవారే కానీ చేసేవారు ఎవరూ లేరని’ ఎద్దేవా చేశారని, ఈ క్రమంలో పట్టుబట్టి రూ.50లక్షలతో చామనపల్లికి బ్రిడ్జి తీసుకువచ్చానని గుర్తుచేసుకున్నారు.
కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశాం..
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నదని, మన వనరులు మనమే సంరక్షించుకొని వాడుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ రోజు అభివృద్ధి, సంక్షేమంలో మనమే ముందున్నామన్నారు. పచ్చని తెలంగాణను చూసి ప్రతిపక్షాల కండ్లు మండుతున్నాయని, మళ్లీ మన వనరులు కొల్లగొట్టేందుకు మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణను కాపాడే ఏకైక పార్టీ, మన పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది బీఆర్ఎస్ ఒక్కటేనని స్పష్టం చేశారు. రాష్ర్టాన్ని దేశంలో ఆదర్శంగా నిలుపుతున్న కేసీఆర్కు మన బలం కావాలని, కార్యకర్తలు పార్టీని కాపాడితే, పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్తో గ్రామాల్లోని చెరువులు, కుంటలు నిండు వేసవిలో మత్తళ్లు దుంకుతున్నాయని, వరదకాలువ వద్ద ప్రత్యేక కెనాల్ నిర్మించి కొత్తపల్లిలోని ఏడు గ్రామాలకు నీరు సరఫరా చేస్తున్నామని, సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా చేశామని వివరించారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏ నాయకుడు చేయని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశామని, స్వరాష్ట్రంలో గ్రామీణ రోడ్లకు మహర్దశ వచ్చిందని, లింక్ రోడ్లతో కనెక్టివిటీని పెంచుకున్నామని చెప్పారు.
ప్రతిపక్షాలను నమ్మవద్దు..
బీఆర్ఎస్ అంటే రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమని, ఇక్కడ తెలంగాణకు మరో బీఆర్ఎస్ (బండి సంజయ్, రేవంత్రెడ్డి, షర్మిల) శనిలా దాపురించారని, అసత్య ప్రచారంతో ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నరని దుయ్యబట్టారు. మన వనరులు దోచుకునేందుకు, కరెంట్, బొగ్గును ఇతర రాష్ర్టాలకు తరలించేందుకు పాదయాత్రల పేరిట వస్తున్నారని, వారిని నమ్మవద్దని సూచించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి పైశాచిక ఆనందం కోసం సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టేందుకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, పార్టీ మండల అధ్యక్షుడు, కరీంనగర్ సింగిల్ విండోచైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడూరి సత్యనారాయణ గౌడ్, కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్, దుర్శేడ్ సింగిల్ విండో చైర్మన్ గోనే నర్సయ్య, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాజేశ్వర్రావు, వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ, సర్పంచ్లు ఉప్పుల శ్రీధర్, జక్కం నర్సయ్య, పురుమల్ల శ్రీనివాస్, భూమయ్య, దబ్బెట రమణారెడ్డి, ఎంపీటీసీలు బుర్ర తిరుపతి గౌడ్, సాయిల వినయ్సాగర్, అంకమల్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు నేరెళ్ల శ్రీనివాస్, నాయకులు ర్యాకం మెహన్, బల్మూరి జగన్మోహన్రావు, సుంకిశాల సంపత్రావు, జూవ్వాడి మారుతిరావు, దామెరపల్లి అంజిరెడ్డి, రుద్ర రాములు, చామనపల్లి రాజయ్య, ఎల్కపల్లి చంద్రమోహన్, చల్ల లింగారెడ్డి, కట్ల గౌతంరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు జోజ్జిరెడ్డి,కూర శ్యాంసుందర్ రెడ్డి, నాగయ్య, చింతల లక్ష్మన్, బుర్ర రమేశ్ గౌడ్, లక్ష్మయ్య, ముస్కు మల్లారెడ్డి, వెంకటేశ్వర్లు, సతీశ్, గర్వంధ శ్రీనివాస్, కొమురయ్య పాల్గొన్నారు.
ప్రతిపక్షాల కుట్రలు తిప్పికొట్టాలి..
ప్రతిపక్ష పార్టీలు రాష్ర్టానికి శనిలా దాపురించాయి. అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి కండ్లుమండించుకుంటున్నయ్. బద్నాం చేయాలని చూస్తున్నయ్. కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్, బీజేపీల అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి. మన చేసుకున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించుకోకపోతే వాళ్లు చెప్పే అబద్ధాలే నిజమయ్యే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఇంటింటికీ వెళ్లి వివరించాలి. పనిచేసే కార్యకర్తలను పార్టీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నది. తెలంగాణ కోసం కొట్లాడినం. జెండాలు కట్టినం. మోసినం. తనను కార్యకర్త నుంచి గ్రంథాలయ చైర్మన్గా చేసిన ఘనత పార్టీదే.
– పొన్నం అనిల్కుమార్ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్దే..
ఒకప్పటి తెలంగాణ ఎట్లుండే. ఇప్పుడెట్ల ఉన్నది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతోంది. నాడు సాగు నీరు లేక మా మండలంలోని పంటలు ఎండిపోయి రైతన్నకు కన్నీళ్లే మిగిల్చేవి. కానీ స్వరాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి గ్రామాల్లోని చెరువులు, కుంటలు నింపి ఆయకట్టును సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్దే. ఈ రోజు ఏ గ్రామంలో చూసినా బంగారు పంటలు పండుతున్నాయి. నిండు వేసవిలోనూ చెరువులు మత్తడి దుంకుతూ కనువిందు చేస్తున్నయ్. బీళ్లనీ పొలాలుగా మారినయ్. రైతులంతా సంతోషం ఉన్నరు. కేసీఆర్కే జై కొడుతున్నరు.
– తిప్పర్తి లక్ష్మయ్య, ఎంపీపీ
సబ్బండవర్గాల్లో సంతోషం..
స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సబ్బండవర్గాల్లో సంతోషం కనిపిస్తోంది. రైతులకు రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంట్, అసహాయులకు ఆసరా, గొల్ల, కుర్మలకు సబ్సిడీ గొర్రెలు, మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ, దళితుల అభ్యున్నతికి దళిత బంధు అమలు చేస్తూ అండగా నిలుస్తున్నరు. గత ప్రభుత్వాలు ఇలాంటి ఒక్క పథకమైనా తెచ్చాయా..? ఇప్పుడు గొప్పలు మాట్లాడుతున్న ప్రతిపక్షాలు అప్పుడెటు పోయినయి. ప్రతిపక్షాల కుట్రలు చేధించి, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని కార్యకర్తలు ఇంటింటా వివరించాలి.
– పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, కరీంనగర్ మండల పార్టీ అధ్యక్షుడు
పార్టీని మరింత బలోపేతం చేయాలి..
బీఆర్ఎస్కు బలం, బలగం పార్టీ కార్యకర్తలే. కష్టపడి పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలి. మన పాలనకు మనమే పోటీ కావా లె తప్ప ఇతర పార్టీలు ఇటు రావద్దు. ప్రతిపక్ష పార్టీలకు పని చేతకాక, ప్రభుత్వ పథకాలపై విషం చిమ్ముతున్నాయి. మనం అమలు చేస్తున్న పథకాలు, చేస్తున్న అభివృద్ధికి దేశ ప్రజలందరూ ఆకర్షితులవుతుంటే జీర్ణించుకోలేక అసత్య ప్రచారం చేస్తున్నరు. వాటిని తిప్పికొట్టాలి. వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి.
– కనుమల్ల విజయ, కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్
వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే..
ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా, అసత్య ప్రచారాలు చేసినా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయం. ప్రజలంతా మన వైపే ఉన్నరు. కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని ఓర్వలేక ప్రతిపక్షాలు రాష్ట్రంపై విషం చిమ్మాలని చూస్తున్నయ్. తెలంగాణ వనరులను దోచుకునేందుకు సంజయ్, రేవంత్రెడ్డి, షర్మిల పాదయాత్రల పేరిట వస్తున్నరు. వారిని నమ్మవద్దు. వారి కుట్రలను తిప్పికొట్టాలి. సమ్మేళనానికి మండలంలోని 17 గ్రామాల నుంచి వచ్చిన వేల సంఖ్యలో వచ్చిన పార్టీ శ్రేణులు మీమీ గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించాలి. కార్యకర్తలు గడప గడపకూ వెళ్లి చర్చపెట్టాలి. కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలి.
– జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్