కరీంనగర్ : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మితే భవిష్యత్ అంధకారమవుతుందని కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపల్లి మండలం బావుపేట గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీగా నియోజకవర్గానికి ఒక్కపైసా తీసుకురాని బండి సంజయ్ హిందూత్వం(Hindutva) పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికలు రాగానే మాయ మాటలు చెప్పే సంజయ్కు ఈ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, మంత్రిగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందజేసి ప్రజలకు అందుబాటులో ఉన్నానని చెప్పారు. మరోసారి తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.
తెలంగాణ ప్రభుత్వంలో కోట్ల రూపాయల నిధులతో పల్లెల రూపురేఖలు మార్చామని అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్కు ఓటువేయాలని కోరారు. హైదరాబాద్ సంపదలో వాటా కోసం ఆంధ్రోళ్ల కన్ను పడిందని, బీజేపీ కాంగ్రెస్ రూపంలో ఆంధ్రోళ్లు ఒక్కటయ్యారని ఆరోపించారు.